సత్యం ఆయన ఆయుధం

by Disha edit |
సత్యం ఆయన ఆయుధం
X

ఈ శతాబ్దిలో అత్యధికంగా మానవాళిని ప్రభావితము చేసిన నాయకుడిగా ఆయనను ప్రజలు గుర్తించారు. అహింసతో సాధించలేనిది ఏదీ లేదని ఋజువు చేసిన గాంధీజీ బాటే ఏనాటికైనా ప్రపంచపు బాట అవుతుందని హింసను ప్రోత్సహించే దేశాలు తెలుసుకోవాలి. ప్రపంచంలో నేడు ఎక్కడ హింస జరిగినా బాపూజీ అహింసా విధానం చర్చకు రాక మానదు. సత్యము, అహింస గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ 2 అక్టోబరు 1869న గుజరాత్‌లోని పోరుబందరులో ఒక సామాన్య కుటుంబములో జన్మించారు.

గాంధీ, ఈ పేరు స్ఫురణకు రాగానే చంటి పిల్లల నుంచి చరమాంకానికి చేరువవుతున్న వృద్ధుల వరకు ఒకే భావన ఉప్పొంగుతుంది. మన 'బాపు' అంటూ ప్రతి ఇంటా ఆ పేరు జేగంటై మోగుతుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించ‌డం కోసం అనేక మంది త్యాగధనులు హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా గాంధీజీతో భుజం, భుజం కలిపి, ప్రాణాలను పణంగా పెట్టిన వారు అసంఖ్యాకంగా ఉన్నారు. గాంధీ చిత్రపటాలను నెత్తిన పెట్టుకొని కోటానుకోట్ల మంది ఊరేగిన దేశమిది. అహింసను ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ పాలకుల గుండెలలో రైళ్లు పరుగెత్తించిన శాంతికాముకుడు. 'డూ ఆర్ డై 'అనే నినాదంతో 1942 క్విట్ ఇండియా మహోద్యమాన్ని నడిపిన విశ్వమానవుడు. ఇప్పుడు కొందరు జాతిపితను అవమాన పరిచే విధంగా చరిత్రను తప్పుదారి పట్టిస్తున్నారు.

గాడ్సే దేశ భక్తుడని అంటున్నారు. సావర్కర్‌‌ను గాంధీ కన్నా గొప్పగా చిత్రీకరిస్తున్నారు. గాంధీజీని హత్య చేసిన గాడ్సే‌ను నిందించకుండా, హత్య కుట్రలో ఆరోపణలు ఉన్న వీర్ సావర్కర్‌కు బ్రహ్మరథం పట్టడం ఏమిటని జాతి ప్రశ్నిస్తున్నది. భారతీయ జనతా పార్టీ నేతలు మహాత్ముని మీద తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ విభజనకు మహాత్ముడు కారణమని నమ్మబలుకుతున్నారు. ఆర్‌ఎస్ఎస్ మద్దతు ఉన్న కొన్ని సంఘాలు గాంధీ వర్థంతిని శౌర్య దివస్‌గా పాటించి, గాడ్సేకు నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఒక బీజేపీ ఎంపీ లోక్‌సభలోనే గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించారు. ఈ వ్యవహారం పట్ల అనేక మంది భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విభిన్న వాదనలు

'వ్యక్తి పూజ, అతిశయోక్తి ప్రశంసలను ఆర్ఎస్ఎస్ నిరోధించింది. కానీ, సావర్కర్ లాంటి హిందూ మహాసభ నాయకులు వాటికే పెద్దపీట వేశారు' అంటారు రచయిత సంపత్. 'గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ మాజీ సభ్యుడు గాడ్సే ప్రమేయం ఉందని, ఆ సంస్థపై నల్లరంగు పూసే ప్రయత్నాలు జరిగాయని, ఫాసిస్ట్ అని, నిరంకుశ వాద సంస్థ, తిరోగమనవాది అనే దుష్ప్రచారాలు జరిగాయని' ఆర్ ఎస్ ఎస్ 'ఎ వ్యూ టు ది ఇన్‌సైడ్ ' పుస్తక రచయితలు వాల్టర్ కె ఆండర్సన్, శ్రీధర్ డి దామ్లే రాశారు. 'గాంధీని హత్య చేయడానికి దాదాపు ఒక దశాబ్దం ముందే గాడ్సే ఆర్ఎస్ఎస్‌తో తెగతెంపులు చేసుకున్నారని, తరువాత హిందూ మహాసభలో చేరారనే' ప్రతిపాదనను ముందుకు నెట్టడానికి ఆర్ఎస్ఎస్ అనుకూల రచయితలు ఈ వివాదాన్ని ఉపయోగించుకున్నారని 'ఝా' అభిప్రాయపడ్డారు.

2015లో గాడ్సే మనుమడు ఒక విలేఖరితో మాట్లాడుతూ 'గాడ్సే 1932లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారని, ఆయన ఎప్పుడూ ఆ సంస్థ నుంచి బహిష్కరణకు గురి కావడంగానీ, వదిలి వెళ్లడంగానీ జరగలేదని' చెప్పారు. అయినప్పటికీ, సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. 1949 నవంబర్ 15న తనను ఉరితీసే ముందు గాడ్సే ఆర్ఎస్ఎస్ ప్రార్థన లోని మొదటి నాలుగు వాక్యాలను చదివారు. ఆ సంస్థలో ఆయన చురుకుగా పనిచేశారన్న విషయాన్ని ఇది వెల్లడిస్తుంది.

ప్రపంచానికే స్ఫూర్తిదాయకం

గాంధీ నేతృత్వంలోనే దేశానికి స్వాతంత్య్రం సిద్దించింది. అదే తరహాలో కేసీఆర్ నాయకత్వంలో అహింసా మార్గంలోనే తెలంగాణ ఉద్యమం కూడా గొప్ప విజయం సాధించింది. ప్రపంచానికే ఉద్యమపంథాను నేర్పిన దేశ స్వాతంత్య్రోద్యమ ఔన్నత్యాన్ని మరోసారి మననం చేసుకుని ముందుకు సాగాలి. గాంధీజీ సిద్ధాంతాలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తి దాయకం. స్వాతంత్రోద్యమం బలహీనపడకుండా చూడడానికి హరిజనులను గాంధీ ఆకర్షించారు. ఈ శతాబ్దిలో అత్యధికంగా మానవాళిని ప్రభావితము చేసిన నాయకుడిగా ఆయనను ప్రజలు గుర్తించారు. అహింసతో సాధించలేనిది ఏదీ లేదని ఋజువు చేసిన గాంధీజీ బాటే ఏనాటికైనా ప్రపంచపు బాట అవుతుందని హింసను ప్రోత్సహించే దేశాలు తెలుసుకోవాలి. ప్రపంచంలో నేడు ఎక్కడ హింస జరిగినా బాపూజీ అహింసా విధానం చర్చకు రాక మానదు.

సత్యము, అహింస గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ 2 అక్టోబరు 1869న గుజరాత్‌లోని పోరుబందరులో ఒక సామాన్య కుటుంబములో జన్మించారు. చిన్నతనము నుండి అబద్ధాలకు దూరంగా ఉండే ప్రయత్నము చేశారు. అన్యాయానికి సహకరించేవారు కాదు. అందులో భాగంగానే 'ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు' అని ప్రజలకు పిలుపునిచ్చారు. మానవాళి మనుగడ కోసం విశాల దృష్టితో అహింసను ప్రబోధించిన మహాత్ముడికి 153వ జయంతి సందర్భంగా నివాళి.

(నేడు గాంధీ జయంతి)


డా. సంగని మల్లేశ్వర్

కేయూ జర్నలిజం విభాగాధిపతి

వరంగల్, 98662 55355


Next Story

Most Viewed