వైద్య సేవలో నిజాయితీ కావాలి

by Disha edit |
వైద్య సేవలో నిజాయితీ కావాలి
X

కరోనా పుణ్యమా అని కొందరు డాక్టర్లు మరీ బరితెగించారు. అక్కర లేకున్నా రకరకాల పరీక్షలు చేయడం, ఖరీదైన మందులు రాయడం, అవసరం లేని ఆపరేషన్ చేయడం, ప్రతి కేసును ఐసీయూకు పంపడం, వెంటిలేటర్ పెట్టడం లాంటి విధానాలకు పాల్పడుతున్నారు. దీనికి తగినట్లుగానే ఔషధ పరిశ్రమ విపరీతంగా పెరిగిపోయింది. మన దేశంలో 17,000 పై చిలుకు ఔషధ కంపెనీలు 40,000 పైగా ఔషధ రకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిని మార్కెటింగ్ చేయడానికి కొన్ని కంపెనీలు వైద్యులకు ఖరీదైన నజరానాలు, విందులు, విదేశీ టూర్లు వంటి నీచపు పనులకు దిగుతున్నాయి. వైద్య రంగం అత్యున్నత మానవీయ విలువలతో ఉన్నా కొందరి వలన చెడ్డపేరు వస్తున్నది.

ప్రాణం పోసేవాడు దేవుడైతే, ప్రాణం నిలిపేవాడు వైద్యుడు. సమాజంలో వైద్యుడికి అపారమైన ఆదరణ, గౌరవం ఉంది. వైద్యుడంటే ఒక నమ్మకం, ఒక గురి. తమ ప్రాణాలను వైద్యుడి చేతిలో పెట్టి నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటారు ప్రజలు. విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్నో త్యాగాలు చేస్తాడు వైద్యుడు. తనకు ఎన్ని బాధలున్నా పైకి చిరునవ్వు చిందిస్తూ రోగికి మనోధైర్యాన్ని కల్పించి సగం జబ్బు తగ్గిస్తాడు. తన దగ్గరికి వచ్చిన రోగిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించి వైద్యం చేయాలి. అంకితభావం, బాధ్యత, చిత్తశుద్ధి అనేవి వైద్యుడికి తప్పక ఉండవలసిన లక్షణాలు.

ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు. వారు కుటుంబసభ్యులతో కలిసిపోయేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా చెప్పుకునేంత స్వేచ్ఛ ఉండేది. నిస్సంకోచంగా రోగం గురించి చెప్పుకునేవారు. దీంతో వైద్యుడు తనకు తెలిసిన మందులు ఇచ్చి నయం చేసేవాడు. కుటుంబం కూడా వైద్యుడిని నమ్మకమైన స్నేహితుడిగా, ఆత్మీయుడిగా, మార్గదర్శిగా విశ్వసించేది. నేడు ఫ్యామిలీ డాక్టర్ ఊసే లేకుండా పోయింది. డాక్టర్లు తమ వృత్తిని వ్యాపారంగా, రోగిని కస్టమర్‌గా భావించే పరిస్థితి ఏర్పడింది. వైద్యం కార్పొరేటీకరణ దిశలో పరుగులు పెడుతున్న నేటి దశలో సంపాదనకు అది పర్యాయపదంగా మారిపోయింది.

పనికిరాని పీహెచ్‌సీలు

ప్రజారంగంలో ఆరోగ్యసేవలు, సదుపాయాలు క్రమంగా దిగజారిపోయాయి. పేద ప్రజల ఆరోగ్యానికి రక్షగా, ప్రజారోగ్యానికి వెన్నెముకగా నిలబడాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగా పని చేయడం లేదు. అందులో రోగికి కావాల్సిన వైద్య సదుపాయాలు కూడా ఉండవు. పని చేసే వైద్యులు, సిబ్బంది కూడా అంతంత మాత్రమే. ఒకవేళ తగినంత సిబ్బంది ఉన్నా వారిలో అంకితభావం కొరవడడంతో అవి ఇంకా వెనకబడే ఉన్నాయి. దీనికి కారణం ప్రజారోగ్యం పట్ల పాలకుల నిర్లక్ష్యం, ఉదాసీనత. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు ప్రయివేటు వైద్యులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.దీంతో వైద్యం వ్యాపారీకరణకు దారితీసింది.

ప్రయివేటు మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలు పుట్టగొడుగుల వలె పెరిగి అన్ని రకాల అవినీతికి పాల్పడుతున్నాయి. 'రోగి నుండి ఎలాంటి ఫీజులు, డొనేషన్లు వసూలు చేయకూడదు' అన్న సుప్రీం ధర్మాసనం ఆదేశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేటు ఆసుపత్రులు పచ్చి వ్యాపార సంస్కృతికి తెరతీసాయి. పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తూ, పీఆర్ఓ వ్యవస్థ ఏర్పరచుకుని కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. పేషంట్లను ఆసుపత్రులకు పంపిన ఆర్ఎంపీలకు కమీషన్ ఆకర్షణ చూపుతున్నాయి.

ఆయనను స్ఫూర్తిగా తీసుకొని

కరోనా పుణ్యమా అని కొందరు డాక్టర్లు మరీ బరితెగించారు. అక్కర లేకున్నా రకరకాల పరీక్షలు చేయడం, ఖరీదైన మందులు రాయడం, అవసరం లేని ఆపరేషన్ చేయడం, ప్రతి కేసును ఐసీయూకు పంపడం, వెంటిలేటర్ పెట్టడం లాంటి విధానాలకు పాల్పడుతున్నారు. దీనికి తగినట్లుగానే ఔషధ పరిశ్రమ విపరీతంగా పెరిగిపోయింది. మన దేశంలో 17,000 పై చిలుకు ఔషధ కంపెనీలు 40,000 పైగా ఔషధ రకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిని మార్కెటింగ్ చేయడానికి కొన్ని కంపెనీలు వైద్యులకు ఖరీదైన నజరానాలు, విందులు, విదేశీ టూర్లు వంటి నీచపు పనులకు దిగుతున్నాయి. వైద్య రంగం అత్యున్నత మానవీయ విలువలతో ఉన్నా కొందరి వలన చెడ్డపేరు వస్తున్నది. వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని అత్యున్నత స్థాయిలో నిర్వహించాలి. తాయిలాలకు లొంగిపోకూడదు. రోగి పట్ల నిజాయితీగా వుండాలి. బంధువులకు రోగి వాస్తవ పరిస్థితిని వివరించి ధైర్యం చెప్పాలి. ఇలా వైద్య వృత్తిని అమితంగా ప్రేమించి, శ్వాసించిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్‌ను (బీసీ రాయ్) ఆదర్శంగా తీసుకోవాలి.

ప్రజలకు అసమాన సేవలందించి మానవతావాద డాక్టర్‌గా పేరొందిన డా. బీసీ రాయ్ జయంతిని 'జాతీయ వైద్యుల దినోత్సవం' గా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగానూ పని చేసిన బీసీ రాయ్ 1882 జూలై ఒకటిన బిహార్‌లోని పాట్నా జిల్లా బంకింపూర్‍‍లో జన్మించారు. ఇంగ్లండులో వైద్యవిద్యను అభ్యసించి వచ్చాక పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా లోని వైద్య విద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అటు వైద్య రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ప్రజలకు అసాధారణ సేవలందించి తన 80 ఏండ్ల వయస్సులో 1962 జూలై ఒకటిన కలకత్తాలోనే కన్నుమూసారు. ఆయన జయంతి, వర్ధంతి ఒకే రోజు కావడం విశేషం.

(నేడు డాక్టర్స్ డే)


ఎండీ ఉస్మాన్‌ఖాన్

సీనియర్ జర్నలిస్ట్

99125 80645



Next Story

Most Viewed