కుల సంఘాల స్వేచ్ఛా నినాదం

by Disha edit |
కుల సంఘాల స్వేచ్ఛా నినాదం
X

ఈ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. యాదవులు, ఉపకులాలు తెలంగాణలో పద్దెనిమిది శాతం ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. నిజానికి ఇది చాలా బలమైన సంఖ్య. మిగతా బహుజన కులాల మద్దతు తీసుకోవాలి. యాదవుల నుంచి విద్యావంతులుగా, స్థితిమంతులుగా ఎదిగినవారంతా రాజకీయాలకు అతీతంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో తమ జాతిని ముందు వరుసలో నిలపడానికి 'యాదవ విద్యావంతుల వేదిక'ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌‌లో యాదవ హాస్టల్‌ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ క్రమంలోనే మే మూడున రాష్ట్ర రాజధానిలో యాదవుల ఆత్మగౌరవ సభ జరుగనుంది. ఆ సభ యాదవులు, ఉపకులాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలకు కూడా ప్రత్యామ్నాయాలు చూపించేలా ఉండాలి.

భారత సమాజంలో వర్గ దోపిడితోపాటు కుల దోపిడి కూడా జరుగుతుంది. శ్రామిక కులాలవారు శ్రమ దోపిడి, కుల వివక్షకు, అసమానతలకు గురవుతున్నారు. అందుచేతనే బ్రిటిష్‌ ఇండియాలో వివిధ కుల సంఘాలు ఏర్పడ్డాయి. అందులో కొన్ని అవకాశాల కోసం, అస్థిత్వం కోసం ఏర్పడితే, మరికొన్ని అణిచివేతలకు, అసమానతలకు వ్యతిరేకంగా, కుల విముక్తి కోసం, నిర్మూలన కోసం కూడా ఏర్పడినాయి. కానీ, అవి ఆంగ్లో ఐరిష్‌ చరిత్రకారుడు పెరి అండర్సన్‌ చెప్పినట్టు తమ కులస్థులకు విముక్తిని అందించే బదులు, గౌరవ ప్రతీకలను మాత్రమే అందించే కృషి చేయడానికే పరిమితమై ఉండవచ్చు. 98 ఏండ్ల కిందనే 1924లో 'అఖిల భారత యాదవ మహాసభ' ఏర్పడింది. స్వాతంత్రోద్యమంలో ముందు భాగాన నిలిచింది. అనేక మంది వీరులను ఆ సమరానికి అందించింది.

యాదవ మహాసభ కృషి ఫలితంగానే బ్రిటిష్‌ పాలకులు 1931లో కులగణన చేపట్టారు. దాని ఫలితంగానే అట్టడుగు శ్రామిక కులాలవారు ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యే లుగా, కలెక్టర్లుగా, న్యాయమూర్తులుగా ఎదిగి వచ్చారు. ఉత్తర భారతం నుంచి మొదలైన ఈ కల్చర్‌ అణగారిన కులాలను రాజకీయ బాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా చేసింది. ఫ్రెంచి విద్యావేత్త క్రిస్టాఫ్‌ జెప్ఫెర్లో మాటలలో చెప్పాలంటే, ఇది అణగారిన కులాలలో ఇంకా సమగ్ర స్వరూపాన్ని సంతరించుకోవాల్సిన ఒక నిశబ్ద విప్లవం. నిజానికి అట్టడుగు కులాలు అధికారం పొందే స్థాయికి ఎదగడం అనేది సూటిగా సాగేది కాదు. అంతర్లీన క్రియాశీల ప్రక్రియ. ఆ రకంగా వచ్చిన అట్టడుగు కులాల చైతన్యం దుర్బేధ్యమైన కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాల కంచుకోటలను బద్దలుకొట్టింది. అందుకే వివిధ రాష్ట్రాలలో అట్టడుగు కులాలు, అణగారిన జాతులు రాజ్యాధికారంలోకి రాగలిగాయి.

వాటికి తోకలుగా ఉండొద్దు

స్వతంత్ర భారతంలో కుల సంఘాలు స్వేచ్ఛను కోల్పోయి రాజకీయ పార్టీల వాడకానికి గురవుతున్నాయి. ఏ అగ్ర కులాధిపత్య, వారసత్వ రాజకీయాలను కూకటివేళ్లతో పెకలించారో, అలాంటి జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కోసం, కులాలను సంఘటితం చేసే పనిముట్లుగా కుల సంఘాలు మారాయనే విమర్శ కూడా ఉంది. వాస్తవానికి రాజకీయ పార్టీల నేపథ్యం కలిగిన కుల సంఘాలతో ప్రయోజనం శూన్యం. పార్టీలకు తోకలుగా ఉంటే అణగారిన కులాలకు వ్యతిరేకంగా వారు చేసే నిర్ణయాలను ప్రశ్నించడం సాధ్యం కాదు.

ఎందుకంటే, ఇండియన్‌ డెమోక్రసీ చూడడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలా కనిపించినప్పటికీ, దేశంలోని మెజార్టీ పార్టీలన్నీ ఏదో ఒక కులం ఆధిపత్యంలోనో, అగ్రకులాధిపత్యంలో నడుస్తున్నాయన్నది కాదనలేని సత్యం. కాబట్టి తోక సంఘంగా ఉంటే వారి కులాధిపత్య దోరణికి విరుద్దంగా మన జాతికి మనం ఏ విధమైన న్యాయం చేయలేం. ఒకరిద్దరి ప్రయోజనాల కోసమో, చిన్న చిన్న పదవుల కోసమో రాజీ పడకుండా తమ జాతి ప్రయోజనాల కోసం ఎవరు తపిస్తారో వారే విజయం సాధించినట్టని చరిత్ర రుజువుచేస్తున్నది.

సమాజ మార్పునకు కీలకం చదువే

అణగారిన కులాలు అధికారం అందిపుచ్చుకోవడానికి అగ్రకుల పాలకవర్గాలు అంత ఈజీగా అనుమతించవు. ఆ పనిని చాప కింద నీరులా చేయాలి. రాజకీయాలలోనూ, ప్రభుత్వ ఉద్యోగాలలోనూ అణగారిన కులాల క్రియాశీలతను మరింత పెంచుకోవాలి. శ్రామిక కులాల పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఒక ఉన్నత ఆశయంగా అర్థం చేసుకోవాలి. అది పూలే వెలుగులో చత్రపతి సాహూ మహారాజ్‌ లోతుగా అర్థం చేసుకున్నాడు. సమాజ మార్పుకు చదువే కీలకం అని తెలుసుకున్నాడు. అందుకే ఆయన కుల వివక్ష మీద పోరాడడంతోపాటు కొల్లాపూర్‌ పట్టణంలో 1901లో జైన హాస్టల్స్‌, విక్టోరియా మరాఠా హాస్టల్స్‌ 1906లో ముస్లిం హాస్టల్స్‌ 1907లో, వీరశైవ లింగాయత్‌ హాస్టల్స్‌ 1908లో, అంటరాని వారికి, మరాఠాలకి హాస్టల్‌, 1921 సంవత్సరంలో దర్జీ నేతలకు నాందేవ్‌ హాస్టల్‌, మరాఠాలకి హాస్టల్స్‌ విశ్వకర్మలకు సోనార్‌ హాస్టల్‌ నెలకొల్పి ఆయా కులాల నుంచి ఆ కాలంలోనే అట్టడుగు కులాలను ఎలైట్‌ సెక్షన్స్‌‌గా ఎదిగే విధంగా తోడ్పడ్డాడు.

ఆ కోణంలోనే ఉత్తర భారతంలో యాదవ మహాసభ కృషి చేసింది. దానిని తొందరగా అందిపుచ్చుకున్న తెలుగు రాష్ట్రాల రెడ్డి, కమ్మ, వెలమ సంఘాల కృషిని ఉదాహరణ చూడవచ్చు. హైదరాబాద్‌‌లో 1909లో యాదవ మహాజన సంఘం, 1919లో రెడ్డి సంఘం, 1920లో గౌడ సంఘం, 1980లో కమ్మ సంఘం, నిజాం చివరి కాలంలో వెలమ సంఘం ఏర్పడినాయి, రెడ్డి సంఘం వారు ప్రత్యేక ప్రణాళికతో పని చేశారు. రెడ్డి హాస్టల్‌‌ ఏర్పాటు చేసి వారి రాజకీయ అధికారం కోసం విద్యావంతులను తయారు చేసే మార్గం వేశారు. మిగతా కుల సంఘాలు కూడా ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేకపోయారు. హైదరాబాద్‌ నగరంలో యాదవులు స్థితిమంతులుగా పెద్ద సంఖ్యలో ఉనప్పటికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో తమ హక్కులు పొందడంలో, రాజ్యాధికారం సాధించడంలో వెనుకబడిపోయారన్నది కాదనలేని సత్యం.

నేరుగా వారి ఖాతాలకు జమ చేయాలి

ఈ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. యాదవులు, ఉపకులాలు తెలంగాణలో పద్దెనిమిది శాతం ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. నిజానికి ఇది చాలా బలమైన సంఖ్య. మిగతా బహుజన కులాల మద్దతు తీసుకోవాలి. యాదవుల నుంచి విద్యావంతులుగా, స్థితిమంతులుగా ఎదిగినవారంతా రాజకీయాలకు అతీతంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో తమ జాతిని ముందు వరుసలో నిలపడానికి 'యాదవ విద్యావంతుల వేదిక'ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌‌లో యాదవ హాస్టల్‌ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ క్రమంలోనే మే మూడున రాష్ట్ర రాజధానిలో యాదవుల ఆత్మగౌరవ సభ జరుగనుంది. ఆ సభ యాదవులు, ఉపకులాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలకు కూడా ప్రత్యామ్నాయాలు చూపించేలా ఉండాలి. సాంప్రదాయ డిమాండ్లకు బదులుగా కొత్త నినాదాలను, డిమాండ్లను పాలక, ప్రతిపక్ష పార్టీల ముందు ఉంచాలి. వాటిని రేపటి తరాలు అందిపుచ్చుకునేలా రూపొందించాలి.

ప్రభుత్వం ఇస్తున్న గొర్రెల స్కీం నిధులను డైరెక్టుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయమనాలి. ఇలా చేయడంతో గొర్రెల అభివృద్ధితో పాటు యాదవుల కుటుంబాలలో ఆర్థిక సంమృద్ధితో చదువులు వెల్లివిరుస్తాయి. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యతోపాటు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.యాదవ యూనివర్సిటీ కోరాలి. అగ్రకులాలవారు దళిత సోదరులను రెచ్చగొట్టి గొర్రెలు కాసుకునే వారిపై నమోదు చేయించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎత్తివేయమనాలి. ఉన్ని తీయడం, గొంగళ్లు నేయడం, ఒగ్గు కథలు చెప్పడం, మాంసం ఉత్పత్తి ఇత్యాది పనులలో నైపుణ్యాలను ద్విగుణీకృతం చేసేందుకు యాదవ యూనివర్సిటీని ఎందుకు కోరగూడదో చర్చించాలి. యాదవులకు, ఉపకులాలకు ప్రత్యేక రిజర్వేషన్ల నినాదం లేవనెత్తాలి. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను పెంచమనాలి.

చలకాని వెంకట్‌ యాదవ్‌

హైకోర్టు న్యాయవాది, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌

98665 89914

Next Story

Most Viewed