భూముల అమ్మకం.. సమర్థవంతమైన పాలనా?

by Disha edit |
భూముల అమ్మకం.. సమర్థవంతమైన పాలనా?
X

ప్రభుత్వమైనా ప్రకృతి సంపద సద్వినియోగం చేసుకోవాలి. కానీ తాను కూర్చున్న కొమ్మనే గొడ్డలితో నరకుతున్నట్లుగా ఉంది నేటి తెలంగాణ ప్రభుత్వ వైఖరి. ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో అందరూ లబ్ది పొందాలి. రాజ్యాంగ బద్ధమైన పనులతో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. కానీ నేటి పాలకులలో అదెక్కడ కానరాదు. కాలుష్యం అరికట్టలేని ప్రభుత్వం. శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించని సర్కారు మూఢ నమ్మకాలతో మునిగి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంది. వాస్తు, జ్యోతిష్యం, పూజలు, యజ్ఞ యాగాదుల సంస్కృతి పేరిట కోట్లు కుమ్మరించి రాజకీయాలు చేస్తుంది.

అధికారం ఇస్తే ఇదేనా చేసేది?

ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు లేక అద్దెకు తీసుకొని అరకొర వసతులతో నడిపిస్తున్న సిబ్బంది మొర ఆలకించే నాధుడెవ్వరు? ప్రభుత్వ భూమి పరుల చేతికి పొతే పచ్చదనం పెంపుకు భూములెక్కడా? హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డు ఎలా వస్తుంది. ఆహ్లాదకర వాతావరణం ఉండేనా? రోడ్లు భవనాలు చూసుకొని మురిసి పోవాలా? ప్రభుత్వ కార్యాలయాలకు కానీ పరిశోధన కేంద్రాలకు స్మశానాలకు గాని భూములు మిగిలేనా? అసలే భూములు లేక ఇబ్బంది పడే పొరుగు రాష్ట్రాల ప్రభుత్వ బాధలు పాలకులకు కనబడుట లేదా? భూములు వేలం వేస్తే కోకాపేటలో ఎకరానికి 100 కోట్లకు అమ్ముడు పోయిందని గల్లా ఎగరేసుకొని తిరుగుతున్నారు. అక్రమ కట్టడాలను ఆపలేని ప్రభుత్వం, అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించలేని పాలకులకు ప్రభుత్వ భూములు వేలం వేసే అధికారం ఎక్కడిది? అధికారం కట్టబెడితే చేసే నిర్వాకం ఇదేనా? అభివృద్ధికి పట్టు కొమ్మగా నిలిచిన గ్రామ పంచాయితీలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు. బలహీన వర్గాల సమస్యలు ప్రభుత్వాన్ని పట్టవా? అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు డబ్బులు ఇవ్వనందున ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ప్రభుత్వానికి తెలియదా? పట్టణ ప్రగతి మాటలకే పరిమితమైంది! సకల జనుల సమాహారం అంటే ఇదే కాబోలు! హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య శతాబ్దాలుగా సమస్యగానే ఉండిపోయింది. ప్రతి వర్షాకాలము రోడ్లు ఊర్ల చెరువులుగా మారి కలువ కాంతులీనుతున్నాయి. కానీ పాలకులు పాడిందే పాట పాడుతున్నారు. రంగు రంగులలో అప్పుల సింగిడి బంగారు తెలంగాణ అంతా కమ్ముకుంటుంది. ప్రభుత్వ భూములంటే ప్రజల భూములు ప్రజా సంక్షేమం కొరకు వాటిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ భూములు వేలం ఆపాలి!

ప్రజల సొమ్ము రాళ్ళపాలు!

ఉచిత పథకాలు ప్రజలను సోమరి పోతులుగా తయారు చేస్తుందే తప్ప, వారి కాళ్ల మీద వారే నిలబడేలా చేయడం లేదు. కష్టం లేని ఫలితం ఆశించడం కూడా సరైంది కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది! ఆదాయం పెంచుకోవాలంటే భూములే ఎందుకు వేలం వేయాలి? వేరే మార్గాలు అగుపడడం లేదా? ప్రభుత్వ సలహాదారులు, సెక్రెటరీలు, ఆర్థిక నిపుణులు బాస్ చెప్పిందానికి తల ఊపుతారా? శవాలను కాల్చడానికి జానెడు స్థలం లేకుండా చేయడం అభివృద్ధి అనిపించుకొంటుందా? ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతులకు కౌంటర్ వేసి సరి లేరు మాకెవ్వరు అంటే చెల్లే కాలమా? సమయం వస్తే పేకమేడల్లా ప్రభుత్వం కూలిపొక తప్పదు! అభివృద్ధి పేరిట అప్పులు చేసి పన్నులు భారీగా పెంచి ఆర్థికమాంద్యం సృష్టించి నిత్యావసర ధరలు పెంచితే సామాన్యమైన మనిషి బతికి బట్ట కట్టేనా? బంధుల పథకాలు తెచ్చి బంధుత్వం కలుపుకుంటే ఓట్లు రాలుతాయా? నిధుల కోసం వివిధ శాఖలకు వేలకోట్ల లక్ష్యం సరైందేనా? ప్రజాధనం ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి మాటల మంత్రాలతో ఓట్లు కాజేసుకొని అధికారం చెలాయించుకోవడానికేనా? పాలకులు వారి జేబులో నుండి డబ్బుల ఖర్చు పెట్టి కులభవనాలు కట్టిస్తున్నారా? ప్రజల సొమ్ము రాళ్ళ పాలు చేస్తున్నారు! ఓటర్లను ముగ్గులోకి దించి ఓట్లు వేయించుకొని మరోసారి అధికార పగ్గాలు చేపట్టడానికేనా? ఆదాయం లేకుండా ఖర్చులు పెట్టి ఆగం ఆగం చేసేది సమర్థవంతమైన పరిపాలనా ఇదీ!

కేంద్రం సైతం అంబేడ్కర్ ఆశయాలకు పాతర పెట్టి ముసలి కన్నీరు కార్చుతుంది. కులమతాల చిచ్చుపెట్టి ప్రజాస్వామ్య విలువలు మంట గలుపుతుంది. రామాలయాల కట్టడాలు, బాబ్రీ మసీదు కుల్చివేతలు దేశంలో ఒక హిందూ మతమే ఉందా? దేశములో శాంతి భద్రతలు కాపడలేని ప్రభుత్వం ఆగ్రదేశాలతో ఎలా పోటీ పడుతుంది. ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. మెజారిటీ ఉందని రెచ్చిపోతే శ్రీలంకలో జరిగిన మాదిరి పాలకులపై ప్రజల తిరుగుబాటు తప్పదు! ఆ సంఘటన నుండి గుణపాఠం నేర్చుకోవాలి!

పూసాల సత్యనారాయణ

90007 92400


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed