రద్దు కాకపోతే పోరు తప్పదు!

by Disha edit |
రద్దు కాకపోతే పోరు తప్పదు!
X

గతంలో భూసమస్యల పరిష్కారం అనుభవం కలిగిన అధికారులకు అప్పగించేవారు. పరిష్కారం కాకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేసి సాధించుకున్నారు. బాధితుల తరపున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పని చేసేవి. నేడు 'ధరణి'తో ఎన్ని బాధలు పడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. తెలంగాణ కోసం దాదాపు 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేశారు. ఐక్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు సమస్య పరిష్కారానికి స్పందన కూడా కరువైంది. 'ధరణి' సమస్యలపై జనసమీకరణ చేయగలిగే యువ నాయకత్వం రావాలి. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలపాలి. భూ సమస్యలు కలెక్టర్ వద్ద కాకుండా తహసీల్దార్ దగ్గర పరిష్కారం అయ్యే విధంగా చూడాలి. ఎక్కువ భూమి అయితేనే కలెక్టర్ల వద్దకు పోవాలి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ధరణి' అన్ని రకాల భూసమస్యలను పరిష్కరిస్తుందని సీఎం ప్రకటించారు. నిజానికిది చిన్న సన్నకారు రైతులతోపాటు వందల ఎకరాలున్న జమీందారులను సైతం పరేషాన్ చేస్తున్నది. కుటుంబ అవసరాల కోసం భూమి అమ్ముకోవాలన్నా, బ్యాంకు లోన్ కావాలన్నా వాస్తవ భూమికి 'ధరణి'లో పొందుపరచిన భూమికి వివరాలు సరిపోకుండా ఉన్నాయి. విస్తీర్ణం, యజమానుల పేర్లు, పార్ట్-బి లో తప్పుల తడకగా నమోదయ్యాయి. దీని వలన ఎక్కువగా నష్టపోయేది పేద రైతులే. ఇప్పటికే వారు 'ధరణి'తో అష్టకష్టాలు పడుతుంటే, ఇప్పుడు దీని సెగ జమీందారులు, వందల ఎకరాల భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సైతం తగిలింది.

వెంచర్‌లో ఏదో ఒక లిటిగేషన్ బయటపడితే మొత్తం వెంచరే సమస్యగా మారుతోంది. అమ్మినవారు, కొన్నవారికి పరస్పర అంగీకారం ఉన్నప్పటీకి 'ధరణి' సాఫ్ట్‌వేర్ సహకరించడం లేదు. మానవ తప్పిదం సరిదిద్దుకునే అవకాశం ఉన్నా కూడా ఫలితం లేకుండా పోతున్నది. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. భూమి కాగితాలు సరిగా ఉండి, కిందిస్థాయి అధికారులు ఆమోదం తెలిపినప్పటీకి కలెక్టర్ ఎడమ చేతి బొటనవేలు ముద్ర బయోమెట్రిక్‌పై పడనిదే 'ధరణి' లో భూమికి సంబంధించిన సవరణలు, మార్పులు జరగవు. ఆ విధంగా వందల కొద్ది సమస్యలు కలెక్టర్ల దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.

తప్పు మీరే చేశారుగా

గతంలో భూ సమస్యల పరిష్కారంలో వీఆర్‌ఓ, ఆర్‌ఐ, తహసీల్దార్ దగ్గర జాప్యం జరిగేది. కలెక్టర్ నెలవారీ జాబ్ చార్టర్ ప్రకారం 186 మీటింగులు, రివ్యూ మీటింగులు, విచారణలు, అభివృద్ధి పనులు, మంత్రులకు జవాబుదారీతనం ఇలాంటి వాటితో బిజీగా ఉంటారు. అందుకే భూములకు సంబంధించిన పనులను కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్‌కూ అప్పగించారు. తహసీల్దార్ రిపోర్టు ఆధారంగానే కలెక్టర్ కంప్యూటర్‌లో లాగిన్ అయి బయోమెట్రిక్ పెట్టి సమస్యలను పరిష్కరించాలంటే సమయాభావం తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం 'ధరణి' సమస్యల పరిష్కారానికి ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది. సూచనలు చేయమని ఆదేశించింది.

క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన కమిటీ ఇప్పడున్న 'ధరణి' మాడ్యుల్స్‌కు అదనంగా ఏడు మాడ్యుల్స్ ను చేర్చితే అత్యవసర సమస్యలకు పరిష్కారం దొరుకుందని సిఫారసు చేసింది. దీంతో ఎంతో కొంత మంది రైతులకు రిలీఫ్ ఉంటుందనుకున్నాం. కానీ, ప్రభుత్వం కొత్త మాడ్యుల్ రూపొందించి, తాను చేసిన తప్పును పరిష్కరించడానికి, సమస్యను మాడ్యూల్‌లో అప్లయ్ చేయడానికి వెయ్యి నుంచి రెండు వేలు వసూలు చేస్తోంది. దీని వలన ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వస్తుంది. రుసుము తీసుకున్నా సమస్య పరిష్కారం అవుతుందా అనుకుంటే అదీ లేదు. చాలా వరకు సమస్యలు రెండు మూడు నెలలైనా అలాగే ఉంటున్నాయి.

నాటి ఐక్యత ఏది?

గతంలో భూ సమస్యల పరిష్కారం అనుభవం కలిగిన అధికారులకు అప్పగించేవారు. పరిష్కారం కాకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేసి సాధించుకున్నారు. బాధితుల తరపున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పని చేసేవి. నేడు 'ధరణి'తో ఎన్ని బాధలు పడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. తెలంగాణ కోసం దాదాపు 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేశారు. ఐక్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు సమస్య పరిష్కారానికి స్పందన కూడా కరువైంది. 'ధరణి' సమస్యలపై జనసమీకరణ చేయగలిగే యువ నాయకత్వం రావాలి. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలపాలి. భూ సమస్యలు కలెక్టర్ వద్ద కాకుండా తహసీల్దార్ దగ్గర పరిష్కారం అయ్యే విధంగా చూడాలి. ఎక్కువ భూమి అయితేనే కలెక్టర్ల వద్దకు పోవాలి. అప్పుడే చిన్న రైతులకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది.

'సర్వే చేసి ప్రతి ఇంచు భూమిని లెక్కలోని తెస్తానన్న' మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలి. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల సమస్యను త్వరగా పరిష్కరించాలి. కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోవాలి. 'ధరణి' సమస్యలు పరిష్కరించదగినవే. త్వరగా పరిష్కరించాలి. దేశంలో జరిగిన ఉద్యమాలన్నీ రైతాంగ పోరాటాలేనన్న విషయం మరవకూడదు. కేంద్రం తెచ్చిన చట్టాలను రైతుల ఆందోళనతో విరమించుకుంది. అదే విధంగా 'ధరణి' రద్దు చేయాలి. లేదా శాశ్వత పరిష్కారం చూడాలి.

వి. బాలరాజు

విశ్రాంత తహసీల్దార్

94409 39160



Next Story

Most Viewed