- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రమబద్ధీకరణతో.. మెరిట్కు ముప్పు!
తెలంగాణలో కొలువుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

తెలంగాణలో కొలువుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం వివిధ శాఖల్లో ముఖ్యంగా విశ్వవిద్యా లయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చూస్తున్న నిర్ణయం, మెరిట్ ఉన్న అభ్య ర్థులకు తీరని అన్యాయం చేసేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ హైకోర్టు వెలు వరించిన తీర్పు నిరుద్యోగుల వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. పగలు రాత్రి కష్టపడి చదివి, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హత కలిగిన యువతకు ఈ నిర్ణయం శరాఘాతంలా మారింది. ‘అన్ని అర్హతలు ఉండి కూడా మేము నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే, ఎటువంటి పరీక్ష రాయకుండా చేరిన వారికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు న్యాయం?’ అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు..
హైకోర్టు తీర్పు..రాజ్యాంగ విరుద్ధం!
తెలంగాణ హైకోర్టు (నవంబర్ 2024లో) వెలువరించిన చారిత్రాత్మక తీర్పు ప్రకారం, ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి వీలు కల్పించే సెక్షన్ 10-A (ఉమ్మడి రాష్ట్రం నాటి 1994 నియామక నియంత్రణ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన సెక్షన్ 10-A సవరణ) రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎటువంటి పారదర్శకత లేని ‘బ్యాక్ డోర్’ నియామకాలను క్రమబద్ధీకరించడం వల్ల అర్హులైన నిరుద్యోగుల హక్కులు దెబ్బతింటాయని కోర్టు అభిప్రాయపడింది. భవి ష్యత్తులో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను చట్టబద్ధమైన నియామక ప్రక్రియ (TGPSC) ద్వారానే భర్తీ చేయాలని హైకోర్టు ఖచ్చి తమైన ఆదేశాలు జారీ చేసింది.
పారదర్శకత లేని నియామకాలు..
గతంలో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన వారిలో అత్య ధికులు ఎటువంటి అర్హత పరీక్షలు రాయకుండానే విధుల్లో చేరారు.. కేవలం రాజకీయ నాయకుల సిఫార్సులు, అధికారుల అండదండలతో నియమితులైన వారిని ఇప్పుడు ‘రెగ్యులరైజ్’ చేయడం వల్ల ప్రభుత్వ పాలనలో నాణ్యత లోపిస్తుందని విశ్లే షకులు హెచ్చరిస్తున్నారు. సరైన అర్హతలు లేకపోయినా, పైరవీలతో లేదా లంచాలతో ఉద్యోగాలు పొందిన వారు రేపు వ్యవస్థలో కీలక బాధ్యతలు చేపడితే అవినీతి పెచ్చరిల్లే ప్రమాదం ఉంది.
మెరిట్ అభ్యర్థుల ఆత్మఘోష..
పగలు రాత్రి కష్టపడి చదివి, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హత కలిగిన యువతకు ఈ నిర్ణయం శరాఘాతంలా మారింది. ‘అన్ని అర్హతలు ఉండి కూడా మేము నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే, ఎటువంటి పరీక్ష రాయకుండా చేరిన వారికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు న్యాయం?’ అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ల జాప్యంతో మానసిక వేదనకు గురవుతున్న నిరుద్యోగులు, ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాల వల్ల ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాల వైపు మళ్లుతున్నారు.
న్యాయమైన పరిష్కారం కోసం..
ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల మానవతా కోణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే, కానీ అది నిరుద్యోగుల హక్కులను కాల రాసేలా ఉండకూడదు. అందుకే ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి.. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వారికి వారి అనుభవాన్ని బట్టి పరీక్షలో కొంత ‘వెయిటేజీ’ లేదా వయోపరిమితి సడలింపు ఇచ్చి వారిని కూడా పోటీ పరీక్షలో భాగస్వాములను చేయాలి.. ప్రతి పోస్టునూ బహిరంగ పోటీ ద్వారానే భర్తీ చేస్తేనే పాలనలో సమర్థత, పార దర్శకత పెరుగుతాయి. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించాలి. నిరుద్యోగుల ఆశలను కాపాడాలని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పారదర్శక నియామక ప్రక్రియను చేపట్టాలని యావత్ నిరుద్యోగ లోకం కోరుకుంటోంది.
- ఎ. ఆనంద్ సాగర్
89196 59715






