- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆపరేషన్ సిందూర్కు అంతర్జాతీయ ప్రశంసల వెనక కారణాలు..

భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దక్షిణాసియాలో భద్రతా సమీకరణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన కీలక సంఘటనగా నిలిచింది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా, ఉగ్రవాదాన్ని ఎదిరించే భారతదేశ వజ్ర సంకల్పానికి దర్పణం పట్టింది. మే 6, 2025 అర్ధరాత్రి జరిగిన ఈ ఆపరేషన్ ద్వారా భారత్ ఉగ్రవాదంపై తామెంత గట్టి వైఖరి అవలంబిస్తున్నామో స్పష్టంగా తెలియజేసింది. ఇది 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లోని బాలాకోట్ దాడులకు చారిత్రాత్మక పొడిగింపుగా మనం భావించవచ్చు.
మన నైపుణ్యానికి ప్రశంసల వర్షం
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత చేపట్టిన మెరుపుదాడిని ‘యుద్ధ ప్రకటన’గా అభివర్ణించిన పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, భారత జెట్లను తమ వైమానిక దళం వెనక్కి తరిమిందని పేర్కొన్నారు. అయితే భారత వర్గాల ప్రకారం భారత జెట్లు విజయవంతంగా లక్ష్యాలను ఛేదించి సురక్షితంగా తిరిగి వచ్చాయి. ఈ వాదనల మధ్య వాస్తవమేమిటో మనందరికీ తెలుసు. భారతదేశ సైనిక నైపుణ్యం, సాంకేతికతపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతగా పెరి గాయి. సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో పాకి స్తాన్కు చెందిన ఐదుగురు పౌరులు, భారతదేశానికి చెందిన 12మంది పౌరులు మరణించారు. అనేక సరిహద్దు గ్రామాల ప్రజలు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు తరలించబడ్డారు. ఈ ఉద్రిక్తతలపై ఐక్య రాజ్యసమితి, అమెరికా, చైనా, రష్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశాయి. భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై, పరిస్థితిని సమీక్షించడం, చర్చలు జరపడం వంటి చర్యలు ప్రారంభమయ్యాయి.
దేశ భద్రతా విధానంలో కీలక మలుపు..
ఈ ఆపరేషన్ ద్వారా భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని మరోసారి నిరూపించింది. ఇది దేశ భద్రతా విధానంలో ఒక కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది. కానీ, తర్వాత భారత్ - పాక్ సంబంధాలు మరింత ఉద్విగ్న భరి తంగా మారే పరిస్థితి ఉంది. స్పష్టమైన వైఖరితో ఉగ్ర వాద నిర్మూలనకు చేపట్టిన ఈ చర్యలు తాత్కాలికంగా ఉగ్రవాద సంస్థలను చావుదెబ్బ కొట్టినప్పటికీ, దీర్ఘ కాలిక స్థిరతకు రాజకీయ చర్చలే పరిష్కారమన్న విశ్లేషణలూ బలంగా వినిపిస్తున్నాయి.
భద్రత, శాంతి రెండూ ముఖ్యమే!
ప్రస్తుతం ప్రపంచ దృష్టి దక్షిణాసియాపై నిలిచి ఉంది. భారతదేశం తన భద్రతా హక్కును రక్షించుకోవడం సహజాతి సహజం. ఇందులో మరోమాటకు తావులేదు. కానీ అదే సమయంలో శాంతికి అనుకూలంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. భారతదేశం శాంతికి కట్టుబడి ఉన్న దేశం. కనుక ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఘన విజయం సాధించాలంటే, మిలిటరీ చర్యలతో పాటు ఆర్థిక ఒత్తిడి, అంతర్జాతీయ మద్దతు, రాజనీతిజ్ఞత వంటి అనేక అంశాలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై వ్యాపార పరిమితులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మద్దతును అడ్డుకోవడం, FATF వంటి సంస్థల ద్వారా ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావడం లాంటి చర్యలు కూడా సమాంతరంగా కొనసాగాలి. అప్పుడే ఉగ్రభూత నిర్మూలనకు మార్గం సుగమమవుతుంది.
- యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645