పోస్టల్ ఆర్డర్లు పెంచాలి!

by Ravi |   (  Updated:2025-04-03 00:30:12  IST  )

ప్రపంచంలోనే అత్యధిక సమాచార వ్యవస్థ కలిగిన ఇండియా పోస్ట్ సమాచార మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది.

పోస్టల్ ఆర్డర్లు పెంచాలి!
X

ప్రపంచంలోనే అత్యధిక సమాచార వ్యవస్థ కలిగిన ఇండియా పోస్ట్ సమాచార మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. మన దేశంలో మొదటి పోస్టాఫీస్ 1774 సంవత్సరంలో కలకత్తా నగరంలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఇండియాలో సుమారు 1,64, 972 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దాదాపు 4,17,114 ఉద్యోగులు పని చేస్తున్నారు. గతంలో పల్లెటూర్లలో నివసించే వారికి పట్టణాలలో ఉన్న తమ బంధువుల క్షేమ సమాచారం తెలిపేందుకు ఏకైక సాధనం పోస్ట్ ఆఫీస్ మాత్రమే. గ్రామీణ పోస్ట్‌మెన్ ఊర్లలో ఒక ఆత్మ బంధువుగా ఉంటూ చదువురాని వారికి ఉత్తరం వచ్చిన వెంటనే చదివి వినిపించే వారు. నేటి ఇంటర్నెట్ యుగంలో బ్యాంక్ ద్వారా ఆన్‌లైన్ సేవలు వచ్చినప్పటికీ, పొదుపు ఖాతాలు, భీమా పథకాలు విస్తృతంగా అమలు పరుస్తుంది. ప్రైవేట్ రంగాల్లోని కొరియర్ వ్యవస్థకు పోటీగా నిలదొక్కుకొని మనుగడ కొనసాగించడానికి కారణం గ్రామీణ ప్రజల ఆదరణ. డబ్బును ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పంపడానికి ఇండియా పోస్టల్ ఆర్డర్ (ఐపిఓ) ఉపయోగపడుతుంది. దీనిని ఒకప్పుడు పోటీ పరీక్షలకు ఫీజ్ చెల్లించడానికి ఉపయోగించేవారు. సమాచార హక్కు చట్టం-2005 ద్వారా దేశ పౌరులు ఏదేని ప్రభుత్వ శాఖలోని సమాచారం పొందేందుకు ఫీజు చెల్లించడానికి ఉపయోగపడుతుంది. విదేశాలలో ఉన్న భారతీయ పౌరులు ఇ-ఐపిఓ(ఎలక్ట్రానిక్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్)ను ఆన్ లైన్‌లో ఫీజ్ చెల్లించి ఇ-ఐపీఓ తీసుకొనవచ్చు. కానీ నేడు పోస్టల్ ఆర్డర్స్ లభించుటలేదు. పోనీ ఆన్‌లైన్‌లో ఇ-ఐపిఓ తీసుకుందామని పౌరులు అనుకున్నా ఇంటర్నెట్ సర్వర్ పని చేయక, సైట్ తెరుచుకోక పోస్టల్ ఆర్డర్స్ పొందలేకపోతున్నారు. దీని వలన ప్రజలు సమాచార హక్కుచట్టం-2005 ఉపయోగించలేక పోతున్నారు. కావున పోస్టల్ శాఖ వారు ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్‌ను పోస్ట్ ఆఫీస్‌లలో ఎక్కువ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Next Story