లేఖ: పారదర్శకత లేని తపాలా శాఖ

by Disha edit |
లేఖ: పారదర్శకత లేని తపాలా శాఖ
X

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తపాలా శాఖ గతంలో కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, పార్సల్స్ బట్వాడా చేసేది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో సేవలను అభివృద్ధి పరిచే దిశలో భాగంగా 'ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్'ను స్థాపించారు. ఈ బ్యాంకులో ఖాతా తెరిస్తే పాస్‌బుక్ ఇవ్వకపోవడం విచిత్రం. ఒక వర్చువల్ కార్డు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ బ్యాంక్ ద్వారానే పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు సేకరించడం జరుగుతుంది. ఇటీవల టాటా ఏఐజీ బీమాతో ఒప్పందం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాదారులు 399 రూపాయలు కడితే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తుంది.

పాలసీదారుడు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా, పాక్షిక అంగ వైకల్యం పొందినా వైద్య ఖర్చులకు 60 వేల రూపాయలు, ప్రమాద వైద్య ఖర్చులు 30 వేలు, వారసుల విద్యా ఖర్చులకు ఒక లక్ష వరకు, ఆసుపత్రిలో రోజువారీ ఖర్చుల కింద వెయ్యి రూపాయల బీమా సౌకర్యం 18 నుంచి 65 సంవత్సరాల వారికి లభిస్తుంది. ప్రీమియం 399 రూపాయలు చెల్లించిన తరువాత పాలసీదారుల మొబైల్ ఫోన్ కు మెసేజ్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది చదువురాని వారు, కనీసం సంతకం చేయలేని వారు ఉంటారు. ఖాతాదారుడు మరణించినా వారసులకు తెలియని పరిస్థితి ఉంది. బీమా నగదు పొందాలంటే ఎటువంటి ఆధారాలు లేకపోవడం మరింత విచిత్రం. కావున ఈ ప్రమాద బీమా తీసుకున్న పాలసీదారునికి బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు పట్టా అందజేయాలి. దీని వలన పారదర్శకంగా ఈ పాలసీ అమలు కావడంతో పాటు తపాలా శాఖ మీద పల్లెవాసులకు నమ్మకం ఏర్పడుతుంది.


ఆళవందార్ వేణుమాధవ్

హైదరాబాద్

86860 51752


Next Story

Most Viewed