తెలంగాణలో పాదయాత్రల జోష్

by Disha edit |
తెలంగాణలో పాదయాత్రల జోష్
X

2023 అసెంబ్లీ ఎన్నికల హీట్ రాష్ట్రంలో అప్పుడే మొదలైంది. 'ఎవరి వాదం వారికి ప్రియం-ఎవరి గమ్యం వారికి ముఖ్యం' అనే విధంగా పార్టీలు పాదయాత్రలను దండయాత్రలుగా ప్రారంభించాయి. తాము అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ ప్రయత్నాలలో మునిగిపోయాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేలా కాంగ్రెస్ 'గడప గడప' తిరుగుతూ పార్టీని బలోపేతం చేసేందుకు యత్నిస్తోంది. ఇటు బీజేపీ కూడా ఆరు నెలల ముందే ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించి టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతూ పార్టీ గెలుపునకు దారి వేసుకుంటోంది. సంవత్సరంలో దాదాపు 200 రోజులు యాత్ర కొనసాగే విధంగా రోడ్ మ్యాప్ వేసుకొని జోష్‌లో ఉంది.

తెలంగాణలో ఇటీవలి కాలంలో కొత్తగా ఏర్పడిన మరిన్ని పార్టీలు కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలకు సై అంటూ పాదయాత్రలు ప్రారంభించాయి. 'బహుజనులకు అధికారం' అంటూ బీఎస్‌పీ స్టేట్ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ దాదాపు 300 రోజులకుగాను పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ఆర్ టీపీ చీఫ్ షర్మిల 'రాజన్న రాజ్యం' నినాదంతో 1000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. నగరంలో కేజ్రీవాల్ పార్టీ ఆప్ నేతలు కూడా పాదయాత్రలు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో దాదాపు ఆరు పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను కూడా ఖరారు చేసుకుంటూ ప్రచార బరిలోకి దిగాయి.

టీఆర్ఎస్ వైఫల్యాల మీదనే గురి

రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సహజంగానే ఆ పార్టీ మీద ప్రజలలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో జరిగిన దోపిడీ కంటే ఎనిమిదేళ్ల పాలనలో జరిగిన అరాచకమే ఎక్కువని ప్రజలు భావిస్తున్నారు. అందుకే వారు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది. వరుసగా మూడవసారి గెలిచి అధికారం సుస్థిరం చేసుకోవాలని ఆకాంక్షతో టీఆర్ఎస్ అనేక రకాల ప్రణాళికలతో కసరత్తు చేస్తున్నది. కొత్తగా వచ్చిన పార్టీలు మెరుగైన ప్రభావాన్ని చూపితే, ప్రధాన పార్టీల ఓటింగ్ షేర్లలో మార్పులు జరిగి, అవి గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఇటీవలి కాలంలో జరిగిన వివిధ సర్వేల ప్రకారం రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సరైన మెజారిటీ సాధించలేదని చెబుతున్నారు. దీంతో కొంత కష్టపడితే గెలుస్తామన్న ధీమా ప్రధాన పార్టీలలో పెరిగిందనే చెప్పవచ్చు. 2018 లో టీఆర్ఎస్ ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఉండకపోవచ్చని అంటున్నారు. ఎంఐఎం ఏడు సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ ఓటింగ్ షేర్ పెరిగే అవకాశం ఉంది. 'ఏ పార్టీకి ఓటు వేస్తున్నాం అని కాకుండా ఎటువంటి మనుషులకు, ఎటువంటి పనితనం ఉన్నవారికి ఓటు వేస్తున్నాం' అనేది గమనించాలి. ప్రజలకు సరైన నాయకత్వం ఇచ్చేవారికి ఓటు వేస్తే ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంటుంది.

గోవింద్ గద్వాల్

అడ్వకేట్. 79893 81219


Next Story