లేఖ:ఆన్‌లైన్ ఓటింగ్‌కు సిద్ధం కావాలి

by Disha edit |
లేఖ:ఆన్‌లైన్ ఓటింగ్‌కు సిద్ధం కావాలి
X

గౌరవనీయులైన నరేంద్ర మోదీజీ,

భారత ప్రధానమంత్రి

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ప్రజాస్వామ్యం అంటే అందరూ స్వచ్ఛందంగా పాల్గొనే నిష్పక్షపాత, నిజాయితీగల ఎన్నికలు. అర్హత కలిగిన ఓటర్లు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఎన్నికలు అంటే డబ్బు పంపిణీ, ఉచితాలు, రిగ్గింగ్, కులం, మతం, కుటుంబంతో నడిచే ప్రక్రియగా మారాయి. విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు కొందరు తమ విలువైన ఓట్లను వేయకుండా దూరంగా ఉంటున్నారు. పోలింగ్ రోజును సెలవు దినంగా భావించి సరదాగా తిరగడానికి ఉపయోగిస్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీ పోటీ చేస్తుందో, దాని సిద్ధాంతాలు ఏమిటో, అది ప్రజలకు ఎలాంటి సేవ చేస్తుందో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపుతున్నాయి. ప్రతి పౌరుడు ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వం పోలింగ్ రోజును సెలవు దినంగా ప్రకటించినప్పటికీ, కొందరు దానిని నిజాయితీగా ఉపయోగించుకోవడం లేదు. ఇలాంటివారితొనే నిజంగా ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుంది. వారి తీరు రాజకీయవేత్తలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఓటు వేయకపోవడం పాపం. అందుచేత ప్రతి ఓటరు కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఉపయోగించి తాను ఎక్కడ ఉన్నా ఓటు వేయడానికి వీలుగా రిమోట్, ఆన్‌లైన్ అప్లికేషన్‌ పరిచయం చేయడం అవసరం. ఓటు వేయకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించుకునేవారు దీని ద్వారా తప్పనిసరిగా ఓటు వేసేలా చూడాలి.

భారతదేశం డిజిటల్, వైర్‌లెస్, ఆన్‌లైన్ సాంకేతికతలో చాలా అభివృద్ధి చెందింది. మన దేశం ఈవీఎంల అభివృద్ధి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నది. అటువంటిది ఆన్‌లైన్ ఓటింగ్ విధానంలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక సమస్య కాదు. ఇప్పటికే ఈవీఎంల ఖచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అవకతవకలకు గురయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆన్‌లైన్ ఓటింగ్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సంయుక్తంగా కృషి చేయాలి. ఎన్నికల సంస్కరణలలో దీనిని ముఖ్యమైనదిగా పరిగణించి ఆన్‌లైన్/రిమోట్ ఓటింగ్‌ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించాలని సీఈసీకి సలహా ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరుతున్నాము.

సంతోష్‌బాబు రంగనాయకుల

ఫౌండర్, పెన్ & పేపర్ (స్టార్టప్)

88852 23939


Next Story

Most Viewed