అమ్మ ఒడి - అలనాటి జ్ఞాపకాల సుడి..

by Disha Web Desk 20 |
అమ్మ ఒడి - అలనాటి జ్ఞాపకాల సుడి..
X

మొన్న జూన్ 28 న అమ్మఒడి కార్యక్రమానికి కురుపాం విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో పాల్గొన్నాను. గిరిజన ప్రాంతంలో జరిగిన ఆ సభ నన్ను జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్ళింది. కారణం ఆ సభలో వందలాది మంది ప్రభుత్వ బడుల్లో చదివే చిన్నారులను చూడడం వల్ల జరిగింది. ముచ్చటగా యూనిఫాంలో ఉండి ఆత్మవిశ్వాసంతో మెలుగుతున్నారు వారంతా. నాలుగేళ్ల క్రితం వరకూ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులే అలా కనబడడం ఉండేది. వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలు ఆంగ్లంలో, తెలుగులో ధాటిగా ప్రసంగించడం సభికుల్ని ఆకట్టుకుంది.

నేను 1980లో తాడికొండ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి జాయిన్ అయ్యాను. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మూడు మాత్రమే గురుకుల పాఠశాలలు. నాణ్యమైన విద్య, కంటికి రెప్పలా కాపాడే గురువులు, మంచి భోజనం, ఆట స్థలం అన్నీ నిరంతరం అందుబాటులో ఉండేవి. విద్యార్థి బాగోగులు, ఎదుగుదల పట్ల వ్యక్తిగత శ్రద్ధ ఉండేది. అయితే యూనిఫాంలు ఇంటిదగ్గర నుండే తెచ్చుకోవాలి. మా యింటి పరిస్థితుల వల్ల రెండో, మూడో తప్పించి ఉండేవి కావు. అప్పుడు స్కూల్ లో కొన్ని పాత ఖాకీ నిక్కర్లు అవసరమైన వారికి ఇచ్చేవారు. రూమ్‌లో కుప్పపోసి ఉంటే సైజు బట్టీ వెతుక్కోమనే వారు. అవి దాదాపు చివికిపోయి చిరుగులతో ఉండేవి. నేను రెండు తీసుకున్నాను. ఒకటి పెద్దగా చిరిగింది.. ఇంకోటి చిన్నగా చిరిగింది. అవసరానికి ఒకదానిపై ఇంకొకటి వేసుకోవచ్చని ఆలోచన. అదే చేసేవాడిని.


కొంచెం న్యూనత గా అనిపించినా పెద్దగా అనిపించేది కాదు. వేరే గత్యంతరం ఏముందిలే అని. పైగా అందరూ అబ్బాయిలే కావడం ఇంకొంచెం ఊరట. ఆ దసరా సెలవులకు మా నాన్న నన్ను ఊరికి తీసుకు వెళ్దామని వచ్చారు. అప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకున్న రెండు నిక్కర్లు చూసి ఎంతో బాధ పడ్డారు. పైన ఉన్నది వేసుకుంటే ఒక దగ్గర చిరుగు. కిందది అయితే మరో చోట. రెండూ కలిసి కొంచెం మెరుగు. ఆయన ఇరవై సంవత్సరాలైనా ఆ సీను గుర్తుకు తెచ్చుకుని బాధపడడం మానలేదు. అదీ సంగతి.

ఇప్పుడీ విషయం ప్రస్తావన ఎందుకంటే అంత మంచి స్కూల్ లోనే పిల్లల చదువులు, సదుపాయాలు చూసుకున్నా, దుస్తుల కోణంలో ఆలోచించలేదు. ఇక మామూలు బడుల్లో సంగతి చెప్పనక్కరలేదు. చిరుగుల దుస్తులు కలిగించే న్యూనతా భావం గానీ, మంచివి కలిగించే ఆత్మ విశ్వాసం గానీ చిన్న విషయాలుగా భావించడం వల్లనే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కోణాన్ని కూడా విస్మరించకపోవడం చిన్నారుల పట్ల, వారి చదువూ, ఎదుగుదల పట్ల సున్నితమైన స్పందనకు నిదర్శనం. ముఖ్యమంత్రి జగన్ ప్రశంసాపాత్రులు.

డా. డి.వి.జి.శంకర రావు , మాజీ ఎంపీ, పార్వతీపురం.

94408 36931.

Next Story

Most Viewed