111 జీవో రద్దు కుట్రా..!?

by Disha edit |
111 జీవో రద్దు కుట్రా..!?
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 111 జీవో ఎత్తివేస్తూ, ఈ జీవో పరిధిలో 84 గ్రామాల ప్రజలకు మేలు చేయడానికి ఈ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ దాని వెనుక భారీ కుట్ర దాగి ఉంది. ఇందులో రాజకీయ ప్రయోజనాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. నిజానికి ఇక్కడ ఎకరం 10 కోట్లు ఉంటుంది. అలాగే 18 వేల ఎకరాల అసైన్డ్ భూమి, మరో 12 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్ కింద ఉన్న భూమిని రైతుల వద్ద నుండి ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొని ఎకరాకు ప్రభుత్వం 600 గజాల స్థలం ఇస్తుంది. అలాగే ఇక్కడ అభివృద్ధి పేరుతో బినామీ కంపెనీలకు కొంత భూమి ఇచ్చి మిగతా భూమిని రాజకీయ నాయకులు కొట్టేయవచ్చేమోనని అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ HMDA లేఅవుట్ చేసి అమ్మినా, ఎకరాకు 20 కోట్లు వస్తుంది. అంటే ప్రభుత్వం 30 వేల ఎకరాలకు 6 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేర్చుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఈ జీవో ఎత్తేసి ఉండవచ్చు.

భవిష్యత్తు హైదరాబాద్ ప్రమాదంలో..

అన్ని సమస్యల లాగానే దీనిని గుర్తించని ప్రతిపక్ష పార్టీలు ఈ జీవో రద్దు వెనకనున్న కుట్రను గుర్తించలేకపోతున్నాయి. లేదా గత కొన్ని రోజుల నుండి ఈ జీవో ఎత్తివేస్తారని ఊహాగానాలతో రాజకీయ నాయకుల భాగస్వామ్యం ఉన్న కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు వేల ఎకరాలు కొనిపెట్టుకున్నారు. దీని ద్వారా కూడా ఆ నాయకులు లబ్ధి పొందనున్నారు. అంటే ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట’ అందుకే ప్రతిపక్షాలు ఈ జీవో ఎత్తివేస్తే ఆందోళన చేయకపోగా, వారి ప్రభుత్వాలు ఏర్పడితే ఈ జీవోను కొనసాగిస్తామని చెప్పడం లేదు. దీనికి కారణం ఇక్కడ వారి భూములు ఉండటమే. అసలు ఈ జీవో ఎత్తివేయడానికి రైతులు ఆందోళన చేశారా? లేదే! మరి ఎందుకు ఈ జీవో ఎత్తివేసినట్లు. ఇందుకు ముఖ్య కారణం ఈ జీవో ఎత్తివేయడం వలన రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తే అవకాశం ఉందనే.

ఇక హుస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మంచి నీటి సరస్సులను కాపాడటం రాబోయే ప్రభుత్వాల తరం కాదు, ఎందుకంటే నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌ను ప్రగతినగర్, సరూర్ నగర్ ఉప్పల్, చెరువులను కాపాడలేకపోయారు. అట్లాగే ఇంకో ముప్పై నుండి నలభై చెరువులు ఆ గ్రామాలలో ఉంటాయి. ఇవన్నీ హుస్సేన్ సాగర్ లాగా మురికి కూపాలూ అవ్వక తప్పదు.హైదరాబాద్‌లో పర్యావరణం దెబ్బ తిని, భవిష్యత్తులో హైదరాబాద్ నగరం ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. హిమాయత్ సాగర్‌ను హుస్మాన్ సాగర్‌ను కాపాడుతాం అన్న ప్రభుత్వపు మాట నమ్మశక్యం కాదు. ముందు హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేసి చూపండి.

ఎవరికి లాభం..

ఇకపోతే ఈ జీవో ఎత్తివేయడం వల్ల ఇతర హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్స్ ఆయా 84 గ్రామాలలో కొనడానికి ముందుకు రావచ్చు. దీని కారణంగా కొంత స్తబ్దత ఏర్పడవచ్చు. ఫైనాన్సియల్ జిల్లా రియల్ వ్యాపారంపై దీని ప్రభావం కొంత ఉంటుంది. కానీ ఇతర ప్రాంతాలకు పెద్దగా ప్రభావం చూపదు. ఎందుకంటే చాలా తక్కువ ధరలకే విజయవాడ వరంగల్ రోడ్‌లలో భూములు ప్లాట్లు లభిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగాక వరంగల్ విజయవాడ రోడ్లలో భూముల రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

ఈ జీవో పరిధిలో కొనుకున్న ప్రజలు నష్టపోయే అవకాశం ఉన్నది. ఎయిర్ పోర్ట్ కట్టేటప్పుడు ఆ చుట్టు పక్క గ్రామాలలో కొన్నవారికి ఈ రోజుకు కూడా కొన్న రేట్ రావడం లేదు. అలాగే యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న గ్రామాలలో కొన్న వారి పరిస్థితి అగమ్యగోచరం. ఈ రెండు ప్రాంతాల్లో భూములు కొని కేవలం బాగుపడింది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు, భూములు ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే. రైతులు బాగుపడింది లేదు.

నారగోని ప్రవీణ్ కుమార్

ప్రెసిడెంట్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

98490 40195

Next Story

Most Viewed