ఇదీ సంగతి: ఎన్నికలలో వామపక్షాలు

by Disha edit |
ఇదీ సంగతి: ఎన్నికలలో వామపక్షాలు
X

వామపక్షాల పోరాటాలు, ఉద్యమాలు మునుపటి స్థాయిలో లేకున్నప్పటికీ ఎర్ర జెండా అభిమానులు, ఆ జెండా డై హార్డ్‌లు సజీవంగానే ఉన్నారు కాబట్టి మతతత్వ పార్టీల ప్రభావం దక్షిణ భారతదేశంలో తక్కువేనని చెప్పాలి. 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో వామపక్షాల వైఖరిని బట్టే దేశ రాజకీయాలు రూపుదిద్దుకునే పరిస్థితి ఉంది. దేశ రాజకీయాల్లో బలంగా పాతుకుపోయిన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఎదిరించాలంటే వామపక్షాలతో సహా ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాల్సి ఉంది. ఈగోలతో, చీలికలతో ఇలాగే కొనసాగినట్లయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ సార్వత్రిక ఎన్నికల్లో కానీ అధికారంలోకి రావడం కల్లోమాటేనని చెప్పాలి.

తెలంగాణతో పాటు ఈ ఏడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. వామపక్ష పార్టీల మీదే ప్రస్తుతం అందరికీ దృష్టి ఉంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో వారి నిర్ణయం ఎలా ఉన్నా, 2024లో పార్లమెంట్‌ ఎన్నికల్లో వామపక్షాల వైఖరిని బట్టే దేశ రాజకీయాలు రూపుదిద్దుకునే పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పర్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు, వామపక్షాల ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట బాగా దెబ్బతిని ఉన్న రోజులవి. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసిన కొద్ది కాలానికే ఆయన అద్భుతమైన విజయం సాధించడానికి ఇది కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చు. వామపక్షాల పోరాటాలు, ఉద్యమాలు ప్రస్తుతం ఆ స్థాయిలో లేకున్నప్పటికీ ఎర్ర జెండా అభిమానులు, ఆ జెండా డై హార్డ్‌లు సజీవంగానే ఉన్నారు కాబట్టి మతతత్వ పార్టీల ప్రభావం దక్షిణ భారతదేశంలో తక్కువే.

బీఆర్ఎస్‌ పొత్తుల్లో స్పష్టత లేమి

ఇక విషయానికి వద్దాం.. తెలంగాణలో హడావిడి మొదలు అయిపోయింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేసిన నాటి నుంచి సీఎం కేసీఆర్ బిజీ అయిపోయారు. ఖమ్మం జిల్లాలో సభ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌లలోనూ ఇటు చత్తీస్‌గడ్, ఝార్‌ఖండ్ లోనూ ప్లాన్ చేస్తున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికలకు వెళతారని విపక్షాలు భావిస్తున్నాయి. అటు ఈసారి టీడీపీ, జనసేనలు కలిసి తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీతో వీరు కలిసి పోటీ చేస్తారా, లేక విడిగా చేస్తారా, తేలాల్సి ఉంది. బీఎస్పీ, షర్మిల పార్టీ పోటీలో ఉంటాయి. వీరు విడిగా ఉంటారా లేక ఎవరితోనైనా పొత్తు లో ఉంటారా అనేది ఇంకా తేలలేదు, బీఆర్ఎస్ ఖమ్మం సభకు కేరళ, ఢిల్లీ సీఎంలు పినరయి రవి, కేజ్రీవాల్‌తో పాటు కర్ణాటక, యూపీ మాజీ సీఎంలు అఖిలేష్, కుమారస్వామిలు హాజరు కావడం రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకునే విషయమే అవుతుంది. సీఎం కేసీఆర్ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లేని ఫ్రంట్ ఏర్పాటుకు బీజం వేసినట్లు అవుతుందని అనుకుంటున్నారు.

జోడో యాత్ర ప్రభావం అధికమే

అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావాన్ని వీరు అంతా తక్కువ అంచనా వేస్తున్నారని అనుకోడానికి వీలులేదు. తెలంగాణలో ఎన్ని గ్రూపులు కాంగ్రెస్‌లో ఉన్నా నేతలను విస్మరించి ప్రజలు గతం కన్నా మెరుగుగానే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రభావం తెలంగాణలో లేకపోలేదు. అయితే సీపీఐ, సీపీఎం తెలంగాణలో కాంగ్రెస్ వెంట లేకపోవడమే మైనస్ కాగా మరోవైపున వామపక్షాలు టీఆర్‌ఎస్‌తో ఉండడం ఆ పార్టీకి బలంగా పేర్కొనవచ్చు. అలాగే అటు హైదరాబాద్‌లో ఎంఐఎం తోడు టీఆర్ఎస్‌కు కల్సి వచ్చే విషయాలుగా పేర్కొనవచ్చు. ప్రొఫెసర్ కోదండరాం ఏర్పర్చిన పార్టీ జనసమితి కూడా ఎవరితోనైనా పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉంది. బీజేపీ దూకుడుగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరి అదిరించి, బెదిరించి, కులమతాలు, మందిర్, మస్జీద్‌ల పేరిట మనుషుల విభజన రాజకీయాలు, విషపూరిత విద్వేష మాటల, ఉపన్యాసాలతో అధికారంలోకి వచ్చే పరిస్థితులు తెలంగాణలో లేవు. పీఎం నరేంద్రమోడీ ఈ నెల 19న వస్తున్నారని ముందే చెప్పినా అది వాయిదా పడినట్లు తాజా సమాచారం. ఖమ్మంలో బిఆర్ఎస్ సభకు పోటీగా చేరికల సభ పెట్టాలని బీజేపీ భావిస్తున్నట్లుంది. మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరుతారని అంటున్నారు. అయితే క్షేత్ర పరిస్థితి భిన్నంగా కనిపిస్తున్నది.

కమలం వికసించేనా

బీజేపీలో ఎవరూ చేరినా అక్కడ ఆ పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అంటున్నారు. మొత్తంగా బీజేపీ హడావిడి చేస్తున్నట్లు తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు లేవు. అక్కడ బీజేపీ ఎంపీ ఒకరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఇచ్చిన స్టేట్‌మెంట్ సంచలనం అయింది. ఇటీవల తెలంగాణలోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేయాలనే చర్చ కూడా జరిగింది. దీన్ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని కూడా ఒక వాదన వచ్చింది. ఆ తర్వాత ఈ అంశం ప్రస్తావన ఆగిపోయింది ఇక తెలంగాణ, కర్ణాటకలలో ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు లేదా విచారణల ప్రభావం అంతగా పీపుల్‌లో కనిపించడం లేదు. నేతల మీద కేసులు, విచారణల ఫలితం పెద్దగా ఎన్నికలలో ఉండే పరిస్థితి లేదు. భారత్ జోడో ప్రభావం కర్ణాటక మీద అధికంగా ఉంది. తెలంగాణాలో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఎం, సమాజ్‌వాది, జేడీఎస్ పార్టీలకు పొత్తుల్లో భాగంగా బీఆర్ఎస్ కొన్ని సీట్లు వదిలే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇదే పద్ధతిలో బీఆర్ఎస్ షేరింగ్ ఇతర రాష్ట్రాల్లోను ఉంటుందంటున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అటు శివసేన మహారాష్ట్రలో ఇంకా ఏమీ మాట్లాడడం లేదు. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ, అటు తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, శరద్ పవార్‌ తదితరులు తాము కాంగ్రెస్ వెంటనే ఉంటామని చెప్పేసారు.

దేశ హితం కోసమే ప్రతిపక్షాల పొత్తు

జాతీయ స్థాయిలో సీపీఐ, సీపీఎం కాంగ్రెస్‌లకు సంబంధించి పొత్తుల విషయంలో స్పష్టత వ్యక్తం చేస్తే తప్ప 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉండదని చెప్పాలి. ఇక బిజూ జనతా దళ్ విషయానికొస్తే, అక్కడి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు రాష్ట్ర హితమే ముఖ్యం, అయన పెద్దగా జాతీయ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. అయితే కేంద్రంలో ఎవరున్నా ఆయన తమ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే అవసరం ఉంటే మద్దతు ఇస్తారు. ఇక దేశంలో మొత్తంమీద వామపక్షాలకు 3 నుంచి 6 శాతం ఓట్లు ఉన్నాయి. కనీసం వంద పార్లమెంట్ సీట్ల మీద వీరి ప్రభావం ఉంటుంది. కేరళ, త్రిపుర, బెంగాల్‌లలో బీహార్‌లో కొంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు లోనూ వీరికి ట్రేడ్ యూనియన్లలో బలం ఉంది. ఇదీ ప్రస్తుతం రాజకీయ అస్పష్టమైన చిత్రంగా పేర్కొన వచ్చు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం దేశం పై వీరందరి కన్నా ఎక్కువే కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్ని కలిసి పోటీ చేస్తేనే మంచిది! ఎవరికి వారు తామే గొప్ప అనుకుంటూ ఈగోలకు వెళ్లకుండా దేశ సమగ్రత, అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసి పని చేస్తే మంచిది! లేని పక్షంలో దేశం అంబానీ, అదాని లాంటి స్వదేశీ కార్పొరేట్‌ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో వామ పక్షాలు అప్రమత్తంగా ఉండక తప్పదు!

ఎండి.మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

9951865223

Read More...

రీయంబర్స్‌మెంట్ ప్లీజ్



Next Story

Most Viewed