రాజకీయానికి సై అంటున్న జేడీ

by Ravi |
రాజకీయానికి సై అంటున్న జేడీ
X

రాజకీయానికి సై అంటున్న జేడీ

ఇప్పటిదాకా రాజ్యాధికారం అందని వారి కోసమే తన కొత్త పార్టీ అని జేడీ చెబుతున్నారు. ఏది ఏమైనా జేడీ ప్రకటించిన “జై భారత్ నేషనల్ పార్టీ” ఎంత మేరకు ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపించగలదు అన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది. జేడీ టార్గెట్ ఎవరు అన్నది కూడా ప్రశ్నగా ఉంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉండగా.. ఇప్పుడు లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన కొత్త పార్టీ పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ, “జై భారత్ నేషనల్ పార్టీ” పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఆశయాన్ని స్పూర్తిగా తీసుకుంటూ ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకోవడం శుభపరిణామం.

వ్యూహాత్మకంగానే..

రాష్ట్రంలో వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని, ప్రత్యేక హోదా, నిరుద్యోగ నిర్మూలన, అవనీతి రహిత ప్రభుత్వం తేవడం వంటి ఆంశాలు ప్రధాన ఎజెండాగా జై భారత్ నేషనల్ పార్టీ” నిర్మించానని లక్ష్మినారాయణ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ పలు వేదికలపై ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. అయితే.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. మళ్లీ జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తారని అంతా భావించినా.. చివరికి ఆయనే సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేయబోతుండటం రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్యాయం రావాలి కావాలి అని అంతా కోరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అలా ఉంటారని భావించారు. కానీ ఆయన పొత్తుల పేరుతో టీడీపీ వైపు రావడంతో.. ఇక జనసేనలో చేరిన వారు ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం ఆశలు అన్నీ కూడా అయోమయంలో పడిన వేళ అదే సామాజిక వర్గానికి చెందిన జేడీ పార్టీ పెట్టారు. సంచలనాలకు ఏపీలో ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు జేడీ అంతే కాదు ఆయనకంటూ యువతలో క్రేజ్ ఉంది. దాంతో జేడీ వెంట నడవడానికి చాలా మంది చూస్తున్నారు జేడీ పార్టీ ప్రకటన ఏమీ సడెన్‌గా జరగలేదు వ్యూహాత్మకంగానే ఆయన పార్టీని ప్రకటించినట్లు తెలుస్తుంది.

సుపరిచితుడే అయినా..

వైసీపీలో టికెట్లు రాని వారు టీడీపీతో పొత్తుల వల్ల అవకాశాలు కోల్పోయినవారు అదే విధంగా పొత్తును వ్యతిరేకిస్తున్న వారు ఒక రాజకీయ వేదిక కోసం చూస్తున్నారు. జనసేన నుంచి వలసలు అదే విధంగా వైసీపీ నుంచి కూడా చేరే వారు కూడా “జై భారత్ నేషనల్ పార్టీ వైపు చూస్తున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో పోటీకి ఆప్ చూస్తోంది. దాంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని జేడీ ఏపీలో పోటీ చేసే అవకాశం ఉన్నది. యువత, రైతులు, గ్రామీణం అంటూ జేడీ అజెండాను రూపొందిస్తున్నారు. అలాగే బడుగు బలహీనులకు రాజ్యాధికారం అని నినదిస్తున్నారు. ఇప్పటిదాకా రాజ్యాధికారం అందని వారి కోసమే తన కొత్త పార్టీ అని జేడీ చెబుతున్నారు. ఏది ఏమైనా జేడీ కొత్త పార్టీ ఎంత మేరకు ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపించగలదు అన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది. జేడీ టార్గెట్ ఎవరు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ప్రజ్ఞ పరిణితి ఉన్న వ్యక్తిగా లక్ష్మీనారాయణ సుపరిచితుడే అయినా రాజకీయాలలో ఏమేర ప్రభావం చూపుతారో చుడాలి. ప్రత్యేక హోదా, ప్రధాన ఎజెండాగా ముందుకు వెళుతున్న జై భారత్ నేషనల్ పార్టీ” రాజకీయ విమర్శలకు ఏవిధంగా సమాధానమిస్తుందో చూడాలి. శాశ్వత రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రవేటీకరణ, ఆర్దిక వనరుల బలోపేతం, యువతకు ఉపాధి, విద్య అరోగ్యం వ్యవసాయం, రైతుకు గిట్టిబాటుధర, మౌలిక సదుపాయాల రూపకల్పన, విద్యుత్ రంగం ఎదుర్కోంటున్న సంక్షోభ నివారణకు చర్యలు, పరిశ్రమలు, పెట్టు బడుల ఆకర్షణ, పరిపాలనా సంస్కరణలు , అధికారులు ప్రజప్రతినిధుల జవాబుదారీ తనం తదితర అంశాలపై వారి కార్యాచరణ ప్రకటించి ప్రజలను చైతన్య పరిచే దిశగా సాగాలి. విలువలతో కూడిన రాజకీయాలను ఆదరించితే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

- శ్రీధర్ వాడవల్లి

Next Story