అవినీతికి దారితీసే లొసుగులు సరిదిద్దడం తక్షణావసరం!

by Ravi |
అవినీతికి దారితీసే లొసుగులు సరిదిద్దడం తక్షణావసరం!
X

ఎలక్టోరల్ బాండ్ వివరాలను వెల్లడించడానికి జూన్ 30 వరకు పొడిగింపు కోసం సుప్రీంకోర్టులో ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేస్తే, ఈ పొడగింపు కుదరదంటూ.. మార్చి 12వ తేదిలోపు వివరాలు సమర్పించాలని ఆదేశించింది. దీంతో నిన్న సాయంత్రం ఎస్బీఐ ఆ వివరాలను ఈసీకి సమర్పించింది. ఈ వివరాలని మార్చి 15 సాయంత్రం 5 గంటలలోపు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీని సైతం కోర్టు ఆదేశించింది.

నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో అమలు చేసిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024 ఫిబ్రవరి 15న చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ఏకాభిప్రాయ తీర్పులో స్పష్టం చేసింది. అయితే, ఈ కేసులో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 'స్వచ్ఛందంగా' చెల్లించే చందాల సమాచారం గోప్యంగా ఉంచటం చెల్లుతుందా? తదనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి, ఆదాయపు పన్ను చట్టానికి, కంపెనీల చట్టానికి చేసిన సవరణలు చెల్లుబాటు అవుతాయా? అనేది మొదటిది. ఇక రెండోది... కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు 'అపరిమితమైన' చందాలు సమర్పించుకోవడానికి సంబంధించి కంపెనీల చట్టానికి చేసిన మరో సవరణ రాజ్యాంగబద్ధత గురించి. ఈ రెండు అంశాల్లోనూ కేంద్రానికి ప్రతికూలంగానే కోర్టు తీర్పు వెలువడింది.

బీజేపీకి పెద్ద చెంపదెబ్బే!

పౌరులు తమ 'ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే రాజకీయ పార్టీలకు అందుతున్న నిధుల సమాచారం తెలుసుకోవడమనేది తప్పనిసరని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. కానీ ఈ పథకంలో పారదర్శకత లోపించడాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది. రాజ్యాంగంలోని 19(1 )(ఏ) అధికరణాన్ని ఇది స్పష్టంగా ఉల్లంఘిస్తున్నది అని ఆయన తేల్చి చెప్పారు. ఈ తీర్పు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి పెద్ద చెంపదెబ్బేనని చెప్పాలి. అంతేకాక ఎస్బీఐ ఈ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పైగా తీర్పు వెలువడే వరకు నగదుగా మార్చుకోని బాండ్లను పార్టీలు వెనక్కి తిరిగి ఇచ్చివేయాలని కూడా స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన 2019 ఏప్రిల్ 12 నుంచి మొత్తం అన్ని బాండ్ల వివరాలు సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. అదేవిధంగా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలను తెలపాలని పేర్కొంది. ఈ రెండు మార్చి 6వ తేదీలోగా జరగాలని గడువును కూడా విధించింది. కానీ దానిని జూన్ 30 వరకు పొడిగించాలని ఎస్బీఐ కోరింది.

స్వేచ్ఛాయుత ఎన్నికలకు గొడ్డలిపెట్టు!

నిర్దిత పరిస్థితుల్లో కంపెనీలు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చ వచ్చునని కంపెనీలు చట్టం(2013)లో 182 వ నిబంధన అనుమతిస్తున్నది. అయితే, 2017 లో 'ఫైనాన్స్ చట్టానికి' సవరణలు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం అనేక మినహాయింపులను అమలులోకి తెచ్చింది. వీటి ఆధారంగా 2018 నుంచి ఎలక్టోరల్ బాండ్ల పథకం అమల్లోకి వచ్చింది. 2018 నుంచి 2022 మార్చి వరకు జారీ అయిన మొత్తం ఎలక్టోరల్ బండ్లలో 57 శాతం అంటే, రూ.5,271 కోట్లు బీజేపీకి వెళ్లాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 951 కోట్లు మాత్రమే దక్కాయి. అంటే పథకంలో ఉన్న మొగ్గును సూచిస్తుంది.

రాజకీయ చందాలకు చట్టబద్ధమైన నిధులను నియంత్రిత బ్యాంకింగ్ మార్గాల ద్వారా సేకరించడాన్ని ప్రోత్సహిస్తున్నామని, చందాలు ఇచ్చుకునే వారు రాజకీయ వేధింపులకు గురికాకుండా ఉండేందుకు పేర్లను గోప్యంగా ఉంచటం అవసరమని ప్రభుత్వం చేసిన వాదనను ధర్మాసనం గతంలోనే తోసిపుచ్చింది. కంపెనీలు చందాలు ఇస్తున్నాయి అంటే, బదులుగా ఏదైనా లబ్ధి పొందాలని ఆలోచన దాని వెనక దాగి ఉండే అవకాశాలు ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అంటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి (క్విడ్ ప్రో కో) ఇక్కడ పనిచేస్తుందని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు ఈ ఇచ్చుకోవడం అనేది గొడ్డలిపెట్టు వంటిదని హెచ్చరించారు. బాండ్లు పారదర్శకతకు మసి పూస్తాయని గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన ఉటంకించారు.

కార్పొరేట్ క్విడ్ ప్రో కో

సుప్రీంకోర్టు తీర్పు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. పాలక పక్షం ప్రాపకం కోసం పాకులాడని కార్పొరేట్ సంస్థ ఉంటుందా? అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వంటి ఆర్థిక వేత్తలు సందేహాలు వ్యక్తం చేయడం ఈ సందర్భంగా మన గుర్తించుకోవాలి. కార్పొరేట్ చందాల పై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించదగిన పరిణామమే అయితే, అసలు సమస్య ఎన్నికల వ్యయం, దాని వెనక ఉండేటటువంటి అవినీతి, వ్యక్తిగత చందాల ద్వారా అవినీతి జరగదనే గ్యారెంటీ ఏమీ ఉండదనేది వాస్తవం. ఎన్నికల వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి,రాజకీయ పార్టీలు కార్యకర్తల చందాల మీద మాత్రమే ఆధారపడే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రస్తుతం అవినీతికి దారి తీసే లొసుగులను చక్కదిద్దటం తక్షణావసరం. అందుకే ఓటర్లందరూ విద్యావంతులై ఆలోచించాలి. అవినీతికి కళ్లెం పడుతున్న ప్రభుత్వాలను కూల్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.

Next Story

Most Viewed