కోయ వారి కొత్తల పండుగ విశిష్టత తెలుసా?

by Ravi |
కోయ వారి కొత్తల పండుగ విశిష్టత తెలుసా?
X

కోడిపెట్టని అర్పించి, పాల ఆకులు, ఇప్ప ఆకులు ఇంటికి తెస్తారు. వడ్డె తల్లి కోడిని మొక్కి ఇప్ప సారా ఆరబోసి మిగతాది కుల పెద్దలు తాగుతారు. వడ్డె దొరకు ఆ ఇంటి చిన్న లేదా పెద్ద కోడలు కాళ్లు కడిగి దండం పెట్టుకుంటారు. నూకల బియ్యాన్ని వడ్డె కుటుంబ సభ్యులందరికీ ఇస్తాడు. అందరూ ఆ బియ్యాన్ని కోడిపుంజుకు పోస్తూ మొక్కుతారు. ఆ తర్వాత ఆ కోడిని నైవేద్యంగా అర్పిస్తారు. అప్పుడే చనిపోయినవారు కానీ, కొత్త దంపతులుగానీ పెద్దలను స్మరించుకుంటూ వారితో కలిసినట్లుగా భావిస్తారు. ఈ సందర్భంగా వారు మూడు తరాలవాళ్లని కొలుచుకుంటారు. ఆరోజు గూడెం మొత్తం ఒక అపురూప వేడుకలా తయారవుతుంది.

కోయవారి పండుగలు ఎంతో విభిన్నంగా, విశిష్టంగా, సాంప్రదాయబద్దంగా ఉంటాయి. పండుగలన్నీ వారి జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. వారు ప్రధానంగా ఆరు పండుగలు నిర్వహించుకుంటారు. భూమి పండుగ / సూరాల పండుగ, పొట్ట పండుగ / వెన్నుగంటి పండుగ, కొత్తల పండుగ / పెద్దల పండుగ, సమ్మక్క పండుగ / మండమెలిగే పండుగ, పచ్చ పండుగ / చిక్కుడు పండుగ. రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క-సారలమ్మ పండుగ. వీటిని కోయలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగలన్నీ బుధ, గురువారాలలోనే జరుపుకుంటారు. అందుకే వారు బుధ. గురువారాలను శుభకార్యములకు పవిత్రమైన రోజుగా భావిస్తారు.

పండుగ జరిగే విధానం

ఉత్తర కార్తె మొదటి వారం అంటే సెప్టెంబర్‌లో వచ్చే పెద్దల పండుగ లేదా కొత్తల పండగను గిరిజనేతరులు పెత్రమాస లేదా పెద్ద అమావాస్య రోజు నిర్వహించుకుంటారు. కొత్తల పండుగ రోజున గూడాలన్నీ సంప్రదాయం తో నిండి ఉంటాయి. ఉదయమే లేచి పేడతో ఇల్లు అలికి ముగ్గులు వేసి తలస్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. పెద్ద మనుషులు తెల్ల పంచ కట్టు కుంటారు. గుమ్మానికి మామిడి, వేపాకులతో తోరణాలు కట్టి, మొక్కజొన్న గానీ, వరి కంకులనుగానీ తోరణాల మధ్య కడతారు. తర్వాత సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, ముత్యాలమ్మ, కొమ్మలమ్మ, ముసలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, మూగరాజు, గాదె రాజు, బాల కుమారస్వామి, కాతూరుడు మొదలగు ఇలవేల్పులను కొలుస్తారు.

అనంతరం కోడిపెట్టని అర్పించి, పాల ఆకులు, ఇప్ప ఆకులు ఇంటికి తెస్తారు. వడ్డె తల్లి కోడిని మొక్కి ఇప్ప సారా ఆరబోసి మిగతాది కుల పెద్దలు తాగుతారు. వడ్డె దొరకు ఆ ఇంటి చిన్న లేదా పెద్ద కోడలు కాళ్లు కడిగి దండం పెట్టుకుంటారు. నూకల బియ్యాన్ని వడ్డె కుటుంబ సభ్యులందరికీ ఇస్తాడు. అందరూ ఆ బియ్యాన్ని కోడిపుంజుకు పోస్తూ మొక్కుతారు. ఆ తర్వాత ఆ కోడిని నైవేద్యంగా అర్పిస్తారు. అప్పుడే చనిపోయినవారు కానీ, కొత్త దంపతులుగానీ పెద్దలను స్మరించుకుంటూ వారితో కలిసినట్లుగా భావిస్తారు. ఈ సందర్భంగా వారు మూడు తరాలవాళ్లని కొలుచుకుంటారు. ఆరోజు గూడెం మొత్తం ఒక అపురూప వేడుకలా తయారవుతుంది.

(నేడు కొత్తల పండుగ)


పెనుక ప్రభాకర్

ఆదివాసీ రచయితల వేదిక

94942 83038

Next Story

Most Viewed