శాంతి బోధను అలుసుగా తీసుకుంటే..

by Ravi |   ( Updated:2025-05-11 01:00:32.0  )
శాంతి బోధను అలుసుగా తీసుకుంటే..
X

పహెల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా.. టెర్రరిస్ట్ స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. మేకపోతు గాంభీర్యంతో క్షిపణి ప్రయోగానికి పాల్ప డింది.. యాంటీ మిస్సైల్ టెక్నాలజీతో గాలిలోనే బ్లాస్ట్ చేసింది భారత్.. దీనితో పాక్ వణికిపోతోంది.. తెలంగాణలో సామెత "మింగ మెతుకు లేదు, కానీ మీసా లకు సంపెంగ నూనె" అన్నట్లు పాకిస్తాన్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు.

ఇప్పటికే పాక్ కటిక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడే వేళ.. శాంతి చర్చలు తప్ప, వేరే గత్యంతరం లేనే లేదు.. ఎవరైనా.. ఎప్పుడైనా! తీవ్రవాద(మత) పిచ్చితో తెగేదాక లాగితే ఇంతే? ఇంకా దుర్భర మానవ వినాశకర పరిస్థితులు చవిచూడాల్సి వస్తోంది. ఈ ఘోర కలికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి వస్తుంది. సమాధులపై రాజ్యాలు ఏలుతారా? విచక్షణతో ఆలోచించండి.. శాంతి మార్గాన్ని ఎంచుకోండి.

హింస పరిష్కారం కానప్పటికీ..

భారతదేశానికి కిరీటంగా భావించే సుందర కాశ్మీరాన్ని చూడడానికి వెళ్లిన పర్యాటకుల కుటుంబాలను, కట్టుకున్న భర్తని కళ్ళముందే కాల్చి చంపుతుంటే.. కరిగిపోతున్న నుదుటి కుంకుమ కన్నీళ్ళని ఎర్రబారుస్తున్న మతోన్మాద మృత్యు క్రీడకు కారుకులైన నరరూప రాక్షసులకు పాకిస్తాన్ వత్తాసు పలుకుతుంది. ఆ దేశానికి అర్థమయ్యే రీతిలో పహెల్గాం పైశాచిక కాండలో ప్రాణాలు వదిలిన పర్యాటకులకు ఆపరేషన్ సిందూర్‌తో భారత ప్రభుత్వం సాయుధ బలగాలు ఘనంగా నివాళులర్పించారు. పీవోకే లోనివే కాదు పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోని టెర్రరిస్ట్ క్యాంపుల పైనా క్షిపణుల వర్షం కురిపించడం జరిగింది. భారత్ సైనిక బలానికి ఇది నిదర్శనం. నిజానికి "హింస ఏ సమస్యకు పరిష్కారం కాదు, అదే అతి పెద్ద సమస్య". అంటున్న భారతావని శాంతికాముకత్వాన్ని అలుసుగా తీసుకున్న పాకిస్తాన్... ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుతూ మతతత్వాన్ని రెచ్చగొట్టి, అశాంతి, హింసాత్మక దాడులతో ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకుంది పాకిస్తాన్.

బాధ్యతతో కూడిన దాడులు..

భారత్‌లో నెత్తుటేరులు పారించిన అనేక ఉగ్రవాదుల వెనుక ప్రధాన కుట్రదారులైన మౌలానా మసూద్ అజర్, హఫీజ్ మహమ్మద్ సయ్యద్, జాకీవుర్ రెహ్మాన్ లఖ్వీ, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్ర మూకలతో ప్రపంచంలో శాంతికి విఘాతం కలిగి షిఫానీలా తూటాల వర్షాలు, తుపాకుల మోతలు ఇంకె న్నాళ్లు? ఈ ఉగ్రమూకల దాడుల్లో నేలమట్టమవుతున్న నివాసాలను పునర్నిర్మించేది ఎవరు. ఉగ్రవాద మారణకాండతో కనుమరుగైపోతున్న మానవీయ విలువలను కాపాడేది ఎవరు? ఈ అమానవీయ సంఘటనలకు పరిహారం ఎవరు చెల్లిస్తారు!. గాలిలో కలిసిపోతున్న ప్రాణాలను ఎవరు నిలుపుతారు. అని ఇన్నాళ్లు నిగ్గదీసి అడిగింది. కానీ వారు మారలేదు. మారకపోవడంతో పాటు అమాయకులైన టూరిస్టులపై దాడులు జరిపింది. దీంతో ఆపరేషన్ సిందూర్ పేరుతో టెర్రరిస్ట్ స్థావరాలను మట్టుపెట్టి ప్రపంచ శాంతి కోసం తప్పని పరిస్థితుల్లో బాధ్యతతో కూడిన ప్రతిస్పందన దాడులు భారత్ జరిపింది. పాకిస్తాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై క్షిపణులతో రుద్ర తాండవం చేసింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా గురి తప్పకుండా విచక్షణతో బాధ్యతాయుతంగా మట్టుబెట్టింది.

శాంతి చర్చలే పాక్ మార్గం!

కానీ పాకిస్తాన్ ప్రభుత్వం శాంతికి విఘాతం కలిగిస్తూ సామాన్య మానవాళిని, పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు అని విచక్షణ లేకుండా పిట్టల్లా కాల్చింది. ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం తను చేసిన దుర్మార్గాన్ని, తప్పిదాన్ని తెలుసుకొని యుద్ధం ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తుందని తెలుసుకోవాలి. ఈ యుద్ధం కోసం వాడిన ఆయుధాల లాభాలతో వ్యాపారులు చలి కాచుకుంటారు. సంపన్న దేశాలు ఆ కన్నీటిని పెట్రోల్‌గా మార్చుకుంటారని పాకిస్తాన్ గమనించాలి. అభివృద్ధి అంటే?.. పంట పొలంలో నీరు పారాలి. రక్తం కాదు. కనుచూపుమేరలో నివాసాలు విస్తరించాలి. సమాధులు కాదు. ఈ ఘోర కలికి పాకిస్తాన్ బాధ్యత వహించవలసి వస్తుంది. సమాధులపై రాజ్యాలు ఏలుతారా? విచక్షణతో ఆలోచించండి.. శాంతి మార్గాన్ని ఎంచుకోండి. మరోవైపు పాక్ భారత్ యుద్ధాన్ని ప్రపంచం భరించడం లేదని ఇరు దేశాలు సంయమనం పాటించాలని, ఐక్యరాజ్యసమితి కోరుతుంది. అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్‌తో కాల్పుల విరమణ జరిగినప్పటికీ మరోసారి పాకిస్తాన్ ఉల్లఘించడం కొసమెరుపు. రావడమే పాక్ తక్షణ కర్తవ్యం.

- మేకిరి దామోదర్

95736 66650



Next Story

Most Viewed