పాకిస్తాన్ మనపై యుద్ధానికి తలపడితే.. మరోసారి కొత్త దేశం అవతరిస్తుందా?

by Ravi |   ( Updated:2025-05-10 01:16:03.0  )
పాకిస్తాన్ మనపై యుద్ధానికి తలపడితే.. మరోసారి కొత్త దేశం అవతరిస్తుందా?
X

భారత దేశ సైనిక పటిమకు, వ్యూహానికి అద్దం పట్టింది మే 6 అర్ధరాత్రి 1.05 నుండి 1.30 ని. ల వరకు భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్. ఎవరు ఊహించని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఖచ్చితమైన లక్ష్య ఛేదనతో, పాకిస్తాన్ పౌరులకు, సైనిక స్థావ రాలకు ఎటువంటి నష్టం కలుగకుండా, అంత ర్జాతీయ సరిహ ద్దు అతిక్రమించకుండా ఏకంగా తొమ్మిది ఉగ్ర కేంద్రాలను భారత్ ధ్వంసం చేసి, వంద మందికి పైగా ఉగ్రవాదులను నిర్జించి పహెల్గాం అమరులకు నివాళులు అర్పించింది.

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మొట్ట మొదటి సారిగా ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారిం దనే విషయాన్ని ప్రపంచ దేశాలకు ఆధారాలతో తెలియజెప్పి వారి మద్దతును పొందడంలో భారత్ సఫలీకృతం అయింది. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అధికారులు నిరంతరం వివి ధ దేశాలతో జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలు ఇచ్చాయి. పాకిస్తాన్ కోరి మరీ పెట్టించుకున్న భద్రతా మండలి సమావేశంలో తనకు మిత్ర దేశమైన చైనాతో సహా ఒక్క దేశం కూడా వారికి మద్దతుగా నిలవలేదంటే అది దౌత్యపరంగా భారత్ సాధించిన అద్భుత విజయంగా భావించాలి.

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ..

1947లో దేశ విభజన జరిగి భారత్, పాకిస్తాన్ దేశాలుగా ఏర్పడినప్పటి నుండి పాకిస్తాన్ భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. దేశ విభజన జరిగిన ఏడాదే ట్రైబల్ మిలిటెంట్ల ముసుగులో పాకిస్తాన్ ఆర్మీ కశ్మీరులో కొంత భాగాన్ని ఆక్రమించుకుని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పేరుతో తమ ఆధీనంలో ఉంచుకుంది. 1965లో భారత్ పాక్ యుద్ధం, 1971 బంగ్లాదేశ్ విమోచన పోరాటం, 1999లో జరిగిన కార్గిల్ (ఆపరేషన్ విజయ్) యుద్ధాలలో అవమానకరమైన ఓటములను చవి చూసిన తదుపరి ప్రత్యక్ష పోరాటానికి బదులుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్స హిస్తూ, భారత్ పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పుతూ దాయాది దేశం ప్రచ్ఛన్న యుద్ధానికి పాల్పడడం అలవాటుగా మార్చు కుంది. కశ్మీర్‌కు ప్రధాన ఆదాయ వనరైన పర్యాటక రంగాన్ని దెబ్బతీసి తద్వారా స్థానిక యువతకు ఉపాధి లభ్యం కాకుండా చేసి వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షించాలనే దుర్లక్ష్యంతో ఏప్రిల్ 22న పహెల్గాంలో మత ప్రాతిపదికతో ఉగ్రదాడి జరిగింది. అయితే క్లిష్ట సమయంలో అత్యంత చాకచక్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన దౌత్యం, ప్రత్యర్థిని ఆర్థిక దిగ్బంధనం చేసింది.

అష్ట దిగ్బంధనం

సిందూర్ పేరు నుంచి ఉగ్ర లక్ష్యాలను నిర్మూలించే వరకు ఆపరేషన్ సిందూర్ అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. పుల్వామా దాడి అనంతరం భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపి వేయడం, పాకిస్తాన్ సరిహద్దులను మూసివేయడం, సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తానీ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించకుండా నిషేధించడం వంటి అనేక నిర్ణయాత్మక చర్యలను అమలు చేసింది. పాకిస్తాన్ వ్యవసాయ రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన సింధు జలాలను ఆపాలని భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్‌కు ఆశనిపాతం వంటిది. ఒప్పందం కుదిరిన తర్వాత ఎప్పుడూ సింధూ జలాల పంపిణీ ఆపడం జరగలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం ఊహకు అందని విధంగా ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాయాది దేశ ప్రజలలో పాలకులపై అసహనం ఏర్పడే అవకాశం ఉంది. సింధు జలాల విషయంలో బిలావల్ భుట్టో చేసిన ఆడంబర ఆర్తనాదాలకు కారణమిదే.

ఆధునిక యుద్ధంలో మనదే ఆధిపత్యం

మన సైనిక బలగాలు ఆపరేషన్ సిందూర్‌ను ఎల్.ఓ.సి నుండి 6-100 కి.మీ పరిధిలో ఉన్న భవల్పూర్ జిల్లాలోని మార్కాజ్ సుభాన్ అల్లా, మార్కాజ్ తైబా ( ముర్ధిక్), సియాల్ కోటలోని మోహ్మునాజోయా, సర్జాల్ ఉగ్ర శిబిరాలను కూల్చేశాం. భారత అమ్ములపొదిలో ఉన్న అత్యాధునిక ఆయుధాలైన స్కాల్స్ క్షిపణులు, హ్యామర్ బాంబులు, కమకాజీ డ్రోన్లతో విలయాన్ని పాకిస్తాన్ కు పరిచయం చేశాం. గతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాడులు చేసినా అవి పీవోకే, ఎల్.ఓ.సి సమీప ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. కానీ బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత మొదటి సారిగా ఎల్.ఓ.సికి 100 కి.మీ దూరంలో పాకిస్తాన్‌లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పంజాబ్ ప్రావి‌న్స్‌లోని బహువాల్పూరులో ఉన్న ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు, ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న పాకిస్తాన్ ఆర్మీ రెజిమెంటల్ సెంటర్లకు చిక్కకుండా, వాటికి ఏటువంటి నష్టం కలిగించకుండా దాడిని నిర్వహించగలగడం ఆధునిక యుద్ధంలో భారత ఆధిపత్యానికి నిదర్శనం.

భారత్ వైపే తక్కిన ప్రపంచం

పహెల్గాం దాడిపై బదులిచ్చే రక్షణ హక్కు భారత్‌కు ఉందని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. భారత్ సైన్యం కేవలం ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది కానీ సైనిక స్థావరాలపై దాడి చేయలేదు. ఇప్పుడు పాకిస్తాన్ పని అడకత్తెరలో పోక చెక్కలా మారింది. భారత్ యుద్ధం మొదలెట్టిందని చెప్పడానికి వీలు లేదు. అదే సమయంలో తమ భూభాగంపై దాడి చేసి ఉగ్ర శిబిరాలను నాశనం చేసిన నిజాన్ని జీర్ణించుకోలేదు. ప్రతీకార చర్యలు మొదలెడితే పూర్తి స్థాయి యుద్ధానికి తలపడిన నింద పాకిస్తాన్ భరించాలి. ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే సైన్యంలో అసంతృప్తి రాజుకుంటుంది. ఒకవేళ యుద్ధానికి తలపడితే భారత దేశ సైనిక బలాన్ని తట్టుకునే సామర్థ్యం, యుద్ధం కొనసాగించే ఆర్థిక బలం దివాళా అంచున ఉన్న పాకిస్తాన్ దేశానికి లేదు. ఈ విజ్ఞత కోల్పోయి పాకిస్తాన్ పూర్తిస్థాయి యుద్ధానికి తెగిస్తే ఆపరేషన్ సిందూర్ వలన బలూచిస్తాన్ దేశం అవతరించడమే కాకుండా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంత ర్భాగం అయ్యే అవకాశం సంభవించవచ్చు. జనరల్ నరవనే పేర్కొన్నట్లు "పిక్చర్ అభీ బాకీ హై".

లింగమనేని శివరామ ప్రసాద్

79813 20543



Next Story

Most Viewed