అప్పులు తీరేది ఎలా !?

by Disha edit |
అప్పులు తీరేది ఎలా !?
X

ఈ అప్పులు ఎలా తీరుస్తారో తెలియదు. దేశం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ఆలోచన లేదు. ఒక విజన్ లేదు. దేశంలో ఉత్పాదకత, ఉత్పత్తి, రవాణా, ఎగుమతి వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు పాలయ్యారు. 2014లో ప్రభుత్వ రంగంలో 13 లక్షల 91 వేల మంది ఉద్యోగులు ఉంటే, 2020 నాటికి ఆ సంఖ్య 9 లక్షల 21 వేలకు పడిపోయింది. 10 లక్షల 50 వేలు ఉన్న బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 8 లక్షలకు దిగజారింది. లక్షలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. 2014లో 48 లక్షల ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 15 లక్షలు తగ్గిపోయి 33 లక్షల వద్ద నిలిచింది. సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ అయిపోయింది.

భారతదేశంలో ఎనిమిది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు రూ. 135 లక్షల కోట్లు దాటాయి. ఇవి తీరుడు ఎట్లా? దేశం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయ్యింది. డాలర్‌తో పోలిస్తే మన రూపాయి దారుణంగా పడిపోయింది. 77 రూపాయలకు చేరింది. 2025 నాటికి దేశంలో సబ్సిడీలు ఏవీ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ రంగాన్ని అమ్మకానికి పెట్టినా ఆరు లక్షల కోట్ల సంపాదన లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకుల దివాలా కొనసాగుతున్నది. భారీ రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన 250 మందికి పైగా పెట్టుబడిదారులను రప్పించి వసూలు చేసే ప్రక్రియ లేదు.

ఎన్‌పీ‌ఏ 18 లక్షల కోట్లు దాటింది. 8 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసారు. బ్యాంకుల మీద విచ్చలవిడి అధికారం చెలాయించి వాటిని ముంచారు. పెట్టుబడిదారులలో అంబానీ, అదానీలకే భారీ లాభం జరిగింది. వారికే పెద్దపీట వేసారు. 2014లో 7.1 బిలియన్ డాలర్‌లు ఉన్న అదాని ఆస్తి విలువ 2022 నాటికి 123 బిలయన్ డాలర్‌లకు చేరింది. అంబానీ 23.6 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్‌లకు ఎదిగారు. దేశం ఆర్థిక వ్యవస్థ సముద్రంలో మునుగుతున్న నావలా తయారు కాగా, ప్రధాని నరేంద్ర మోడీ దోస్తుల సంపాదన మాత్రం ఆకాశాన్ని అంటుతున్నది. ప్రపంచంలోని టాప్ టెన్ కుబేరులతో వీరు పోటీ పడుతున్నారు. రోజూ సగటున నాలుగు వేల కోట్ల అప్పులు చేస్తున్న పరిస్థితిలో దేశం ఉంటే, అదాని, అంబానీల సంపాదన ఇలా!

ఉపాధి లేదు, ఉద్యోగం లేదు

దీనికి బాధ్యులు ఎవరు? చేస్తున్న ఈ అప్పులు ఎలా తీరుస్తారో తెలియదు. దేశం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ఆలోచన లేదు. ఒక విజన్ లేదు. దేశంలో ఉత్పాదకత, ఉత్పత్తి, రవాణా, ఎగుమతి వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు పాలయ్యారు. 2014లో ప్రభుత్వ రంగంలో 13 లక్షల 91 వేల మంది ఉద్యోగులు ఉంటే, 2020 నాటికి ఆ సంఖ్య 9 లక్షల 21 వేలకు పడిపోయింది. 10 లక్షల 50 వేలు ఉన్న బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 8 లక్షలకు దిగజారింది. లక్షలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. 2014లో 48 లక్షల ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 15 లక్షలు తగ్గిపోయి 33 లక్షల వద్ద నిలిచింది. సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ అయిపోయింది. 2021లో 19 లక్షల కోట్ల రెవెన్యూ ఉంటే 25 లక్షల కోట్లు ఖర్చు కనిపిస్తున్నది. పెట్రోల్, డీజిల్, మద్యం ద్వారా వస్తున్న రెవెన్యూ ఎక్కువే ఉంది. ప్రజల ద్వారా వసూలు చేస్తున్న పన్నులు సైతం భారీగానే ఉన్నాయి.

ఎనిమిది సంవత్సరాల బీజేపీ పాలనలో నిరుద్యోగం ఎంత పెరిగిందంటే చదువుకున్నవారి సంఖ్యనే 17 కోట్లు దాటింది. సుమారు 56 కోట్లమందికి చేసుకోడానికి పని లేదు. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్నవారిలో 65 శాతం మందికి పని లేదు. రైతులకు ప్రయోజనాలు లేవు. ఆదాయం తగ్గింది. పంట నష్టం జరిగితే పరిహారం లేదు. పంట నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు లేవు. సబ్సిడీలు లేవు. ఎంఎస్‌పీ చట్టం హామీ ఇచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు. నిత్యావసరాల ధరలు గత 40 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. విపక్షాల రాజనీతి సైతం నిజాయితీగా లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన కరెప్షన్ అయితేనేమి, తప్పులు అయితేనేమి, ఇప్పుడు అధికారంలో ఉన్నవారి తప్పులను నిజాయితీగా ఎత్తి చూపే, ఎదిరించే ధైర్యం ఇవ్వలేక పోతున్నాయి. ప్రశ్నించే పరిస్థితిలో వారు లేరు. విపక్షంలో ఉన్న నేతలలో ఎక్కువ శాతం ఆరోపణలను ఎదురుకున్నవారే. ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీల భయం వారిని వెంటాడుతున్నది.

నిరుద్యోగుల ఆందోళన

బిహార్, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో సుమారు కోటిన్నర మంది నిరుద్యోగులు సైన్యంలో 2.5 లక్షల ఖాళీలు భర్తీ చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఇందులో చాలా మంది ఎంపిక శిక్షణ పొందుతున్నారు. వివిధ రాష్ట్రాలలో 33 లక్షల ప్రభుత్వ పోస్టుల ఖాళీలు ఉన్నా భర్తీ ప్రక్రియ లేదు. దేశంలో మందిర్-మస్జిద్ రాజకీయాలు పెరిగిపోయాయి. మస్జీద్ గోడల మీద దేవతల విగ్రహాలు ఉన్నాయని, వజూఖానాలో శివలింగం దొరికిందని, కుతుబ్‌మినార్, తాజ్‌మహల్ మీద వివాదాలు, కోర్టు కేసులు, బుల్‌డోజర్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దేశ విముక్తి కోసం స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అందరితో కలిసి కులమతాలకు అతీతంగా పోరాటాలు, త్యాగాలు చేసిన ఒక వర్గంవారిని విడదీసి మాట్లాడడం, పదే పదే అవమానించడమే లక్ష్యంగా విద్వేష రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

మస్జిద్‌లో హిందూ దేవతల విగ్రహాలు ఉంటే, తొలగించే అవకాశం ఉన్నా వందల సంవత్సరాలు అలాగే ఉంచారు. అంటే వారు గౌరవంగా ఉన్నట్లా లేనట్లా? వివాదం సృష్టిస్తున్న వారు చెప్పాలి. అధికారం నిలుపుకోడానికి లేదా అధికారం కోసం మనుషులను, మనసులను విడదీసే అవసరం ఉందా? అని గాంధీని చంపిన గాడ్సే వారసులను బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పండి. దేశం క్లిష్టమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నది. ఆకలి, నిరుద్యోగం, అసమానతలతో ఆగం అవుతున్నది. ముందు ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. ఎనిమిది ఏండ్లలో ఏమి సాధించారో చెప్పండి. 80 కోట్ల మంది పేదలకు ఐదు కేజీల తాత్కాలిక రేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ముందు పని చేసుకుని జీవించాలని భావిస్తున్న వారికి పని ఇప్పించండి. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును అమలు చేయండి.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223


Next Story

Most Viewed