Health tips: మట్టి కుండతో ఆరోగ్యం

by Disha edit |
Health tips: మట్టి కుండతో ఆరోగ్యం
X

రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అందుకే చాలా మంది ఎండ తీవ్రత నుంచి సేదతీరేందుకు తక్షణమే కూలింగ్ ఇచ్చే ఫ్రిడ్జ్ వైపు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలితో స్టీల్, ప్లాస్టిక్, పింగాణి పాత్రలు వచ్చేశాయి. నేటి తరం మట్టి కుండలను వాడడం దాదాపుగా మర్చిపోయారు. పూర్వ కాలంలో నీళ్లను ఈ మట్టి కుండలలో నిల్వ చేసి తాగేవారు. ప్రస్తుతం ఫ్రిడ్జ్ నీటిని మాత్రమే తాగుతున్నారు. అలా చల్లని నీరు తాగడం వలన వెంటనే శరీరానికి చాలా హాయిగా అనిపిస్తుంది కానీ, కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఫ్రిడ్జ్‌లో కూల్ అయిన చల్లటి నీరు తాగడం వలన అకస్మాత్తుగా గొంతు పడిపోతుంది. గొంతు నొప్పితో పాటు జలుబు చేసే అవకాశం ఉంటుంది. మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

వీటి వినియోగం పెంచాలి

ఇటీవల కాలంలో మట్టి పాత్రలతో పాటు మట్టి గ్లాసులు, మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మట్టి కుండలో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో సన్ స్ట్రోక్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య. దానికి సరియైన పరిష్కారం మట్టి కుండలోని నీటిని తాగడమే. ఇందులో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అదే విధంగా మన శరీర గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. మట్టి కుండలో మంచి నీరు తాగడం వలన మన శరీరానికి ఆమ్ల శాతం అందుతుంది. అందుకే పేదవారు వాడుతున్న మట్టికుండలను మధ్యతరగతి వారు, ధనికులు, పట్టణ ప్రజలు కూడా వైద్యుల సలహా మేరకు అలవాటు చేసుకున్నారు.

అతి కొద్ది శాతం మాత్రమే వేసవిలో మట్టి కుండలకు గిరాకీ ఉండేది. నేడు ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ కు అలవాటు పడ్డారు. నిజానికి మన పూర్వీకులు మట్టి పాత్రలో ఆహార పదార్థాలు వండడం, మట్టి కుండలోని మంచినీరు తాగడం చేసేవారు. మట్టి పాత్రలో భోజనం చేసేవారు. వీటి వినియోగంతో ఆరోగ్యంగా ఉండేవారని అందుకే వీటి వినియోగం పెంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి కాలం ఏప్రిల్ నెలలో ఇలా ఉంటే మేలో పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఎండాకాలంలో ఎక్కువగా కోరుకునేది చల్లని నీరు. అందుకే మట్టి పాత్రలలో ఉండే నీరు తాగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి శక్తి అందజేస్తుంది. వేసవిలో మన దాహాన్ని తీర్చడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మట్టి కుండ సహజ సిద్ధంగా నీటిని చల్లబరుస్తుంది. ఈ నీటికి రుచి కూడా ఎక్కువగానే ఉంటుంది. మట్టి కుండలో మంచినీళ్లు తాగడం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి.

లకావత్ చిరంజీవి నాయక్

కేయూ, వరంగల్

99630 40960

Next Story