తెలంగాణ ఉద్యమం లక్ష్యం నెరవేరిందా? సామాజిక న్యాయంపై కొనసాగుతున్న ప్రశ్నలు..

by Ravi |   (  Updated:2026-06-02 00:30:11  IST  )

తెలంగాణ ఉద్యమం కేవలం ప్రత్యేక రాష్ట్ర సాధనకే పరిమితం కాలేదు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం లక్ష్యాలపై సాగిన పోరాటం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల భాగస్వామ్యం ఎంత మేరకు పెరిగిందనే అంశంపై విశ్లేషణ.

తెలంగాణ ఉద్యమం లక్ష్యం నెరవేరిందా? సామాజిక న్యాయంపై కొనసాగుతున్న ప్రశ్నలు..
X

తెలంగాణ ఉద్యమం కేవలం భౌగోళిక విభజన కోసం జరిగిన పోరాటం కాదు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ తెలంగాణ ప్రజల హక్కుగా దక్కాలనే సంకల్పంతో దశాబ్దాల పాటు సాగిన ప్రజా ఉద్యమం అది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలక వర్గాల ఆధిపత్యం వల్ల తెలంగాణ ప్రజలు ఎన్నో రంగాల్లో వివక్షకు గురయ్యారని, తమ వనరులపై తమకే హక్కు ఉండాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేసి సకల జనులు కలిసి ప్రత్యేక తెలంగాణను సాధించారు. అయి తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా, ఉద్యమం ఆశించిన సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో ఆచరణలో కనిపించడం లేదనే ప్రశ్న సమాజంలో బలంగా వినిపిస్తోంది. తెలంగాణ జనాభాలో దాదాపు 90% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అయినప్పటికీ, వారికి రాజ్యాధికారం, ఉద్యో గాలు, భూములు, ఆర్థిక అవకాశాల్లో సమాన వాటా దక్కు తోందా? అనే ప్రశ్న కొనసాగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అధికారం, వనరులు కొద్ది అగ్రకులాల చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ కోసం పోరాడిన మెజార్టీ ప్రజలు తమ జీవితాల్లో మార్పు ఆశించారు. తమ పిల్లలకు ఉద్యోగాలు, తమ కుటుంబాలకు భూములు, తమ వర్గాలకు రాజకీయ ప్రాతి నిధ్యం, తమ సమాజానికి గౌరవం వస్తుందని నమ్మారు. కానీ ఆ ఆశలు నెరవేరకపోతే, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఫలితం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైందనే ఆవేదన సహజమే. ప్రత్యేక తెలంగాణ అంటే కేవలం కొత్త రాష్ట్రం కాదు, అందరికీ సమాన అవకాశాలు కల్పించే సామాజిక న్యాయం కూడా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు తమ జనాభా దామాషా ప్రకారం పాలన, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, వనరుల్లో భాగస్వామ్యం పొందినప్పుడే తెలంగాణ ఉద్యమ లక్ష్యం సార్థకమవుతుంది. సమాన భాగస్వామ్యం, సమాన అవకాశాలు, సమాన గౌరవం ఉన్నప్పుడే తెలంగాణ నిజమైన ప్రజాస్వామ్య రాష్ట్రంగా నిలుస్తుంది.

- పుల్లెంల గణేష్

95530 41549

Next Story