పెరుగుతున్న పెట్రోల్ డీజీల్ ధరలకు ప్రత్యమ్నాయమేది?

by Disha edit |
పెరుగుతున్న పెట్రోల్ డీజీల్ ధరలకు ప్రత్యమ్నాయమేది?
X

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పునరుత్పాదక ఇంధన వనరులను అన్వేషిస్తున్న తరుణంలో హైడ్రోజన్ ఇంధనం చక్కని పరిష్కారంగా ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. విమానయాన, నౌకారంగాలతో పాటు, సుదూర ప్రాంతాలకు వెళ్లే రవాణా వాహనాలు, పారిశ్రామిక రంగాలకు హైడ్రోజన్ ఫ్యూయెల్ ఉపయుక్తంగా ఉండబోతోంది. భారత ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహం అందిస్తుండడంతో ఇప్పుడిప్పుడే ఆ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. అత్యధిక వాయు కాలుష్యాన్ని వెదజల్లే 178 దేశాలలో భారత్ 174 వ స్థానంలో ఉంది. హైడ్రోజన్ ఇంధనం వినియోగంతో సంపూర్ణ కాలుష్య రహితంగా చేయవచ్చు.

ధునిక సమాజంలో రవాణా రంగానికి ఎంతో ప్రాముఖ్యముంది. స్థానిక, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణికులకు, సరుకుల రవాణాకు జల, వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ తో పాటు వ్యక్తిగత వాహన వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. అయితే, ఆయా వాహనాల నుంచి వెలువడే ఉద్గారకాలు జల, వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇవి మానవులు, జంతుజాలాలపైనే కాక పర్యావరణ సమతుల్యాన్ని కూడా దెబ్బ తీస్తున్నాయి. దీని దుష్పరిణామాలను తగ్గించడానికి శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. భారత ప్రభుత్వం కూడా వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.

టయోటా కిర్లోస్కర్, భారత ప్రభుత్వ 'నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్ అండ్ ఆర్ & డి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ (NATRiP)'కు అనుబంధంగా పనిచేసే 'ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ" (ICAT) కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టడానికి 16 మార్చ్ 2022న ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా భారతదేశంలో పూర్తిగా హైడ్రోజన్ ఇంధనంతో ఉత్పత్తి చేయబడి, విద్యుత్తుతో నడిచే మొట్టమొదటి 'ఫ్యూయెల్ సెల్ ఎలెక్ట్రిక్ వెహికిల్' (Fuel Cell Electric Vehicle - FC EV) 'టయోటా మిరాయ్' కారును ప్రవేశపెట్టాయి. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఎలెక్ట్రిక్ కారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తన రోజువారీ అధికారిక కార్యక్రమాల కోసం 'టయోటా మిరాయ్'ను ఉపయోగిస్తానని ప్రకటించడమే కాక పార్లమెంటుకు 30 మార్చ్ 2022 న అందులోనే వచ్చారు. ఈ వాహనానికి హైడ్రోజన్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది.

భవిష్యత్ ఆశాకిరణం

ముడిచమురు లేదా క్రూడ్ ఆయిల్ నుంచి సేకరించే హైడ్రోజన్‌ను 'బ్రౌన్ హైడ్రోజన్' బొగ్గు నుంచి సేకరించే హైడ్రోజన్‌ను 'బ్లాక్ హైడ్రోజన్' నీరు, సేంద్రియ వ్యర్థాల నుంచి సేకరించే హైడ్రోజన్‌ను 'గ్రీన్ హైడ్రోజన్' అంటారు. సాధారణ వ్యర్థాలను, మురుగు వ్యర్థాలను వేరు చేయడం ద్వారా 'గ్రీన్ హైడ్రోజన్'ను ఉత్పత్తి చేయవచ్చు. జపాన్ భాషలో 'మిరాయ్' అంటే భవిష్యత్ అని, భారతదేశ భవిష్యత్‌ను 'గ్రీన్ హైడ్రోజన్ పరుగులు పెట్టిస్తుందని' గడ్కరీ అభిప్రాయపడ్డారు. మరో ఏడాదిలో దేశంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కార్లు, ట్రక్కులు, బస్సులు పరుగులు పెడతాయని అన్నారు. రైతులు 'అన్నదాతలు'గానే కాక 'ఇంధన దాతలు' గా మారనున్నారని, భారత్ గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగే రోజు మరెంతో దూరం లేదని అన్నారు.

భవిష్యత్తులో పెట్రోల్ ధర రూ.25 కు దిగి వచ్చే అవకాశముందని, ప్రస్తుతం ఇంధన ఎగుమతికి ఖర్చు పెడుతున్న రూ.17 లక్షల కోట్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అన్నారు. టయోటా, కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) సంయుక్తంగా 'మిరాయ్' కారు పని తీరును అధ్యయనం చేస్తున్నాయి. 2024లో కర్ణాటకలోని టయోటా ప్లాంట్‌లో మిరాయ్ కార్ల తయారీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మిరాయ్‌లో హైడ్రోజన్ ఇంధనం నింపడానికి మూడు నుంచి ఐదు నిమిషాలు చాలు. ఒక్కసారి ట్యాంక్ నింపితే దాదాపు 650 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కిలోమీటర్‌కు రెండు రూపాయలే ఖర్చవుతుంది.

Also read: శూన్య ఉద్గారమే మానవాళికి మేలు

ప్రత్యామ్నాయ దారులు

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పునరుత్పాదక ఇంధన వనరులను అన్వేషిస్తున్న తరుణంలో హైడ్రోజన్ ఇంధనం చక్కని పరిష్కారంగా ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. విమానయాన, నౌకారంగాలతో పాటు, సుదూర ప్రాంతాలకు వెళ్లే రవాణా వాహనాలు, పారిశ్రామిక రంగాలకు హైడ్రోజన్ ఫ్యూయెల్ ఉపయుక్తంగా ఉండబోతోంది. భారత ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహం అందిస్తుండడంతో ఇప్పుడిప్పుడే ఆ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది.

అత్యధిక వాయు కాలుష్యాన్ని వెదజల్లే 178 దేశాలలో భారత్ 174వ స్థానంలో ఉంది. హైడ్రోజన్ ఇంధనం వినియోగంతో సంపూర్ణ కాలుష్య రహితంగా చేయవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న దాదాపు ఐదు లక్షలకు పైగా సెల్యూలార్ టవర్లు మొత్తం వాయు కాలుష్యంలో రెండు శాతాన్ని వెదజల్లుతున్నాయి. ఫ్యూయెల్ సెల్ జనరేటర్లను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించే అవకాశముంది.

విద్యుత్ వాహనాల పరిస్థితి

గ్లోబల్ వార్మింగ్ కారణంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు, వాటి దుష్పరిణామాలకు చెక్ పెట్టడానికి ప్రపంచ దేశాలు చేసుకున్న COP-21 లేదా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ప్యారిస్ ఒప్పందంలో భాగంగా శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలకు బదులుగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని సంకల్పించారు. బ్యాటరీల ధరలు తగ్గుముఖం పట్టడంతో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. డిసెంబర్ 2021లో దేశంలో 50 వేల విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదైనప్పటికీ మొత్తం వాహనాల సంఖ్య కంటే అది మూడు శాతం తక్కువ.

దేశవ్యాప్తంగా 7,96,000 వాహనాలు రిజిస్టర్ అయినా 1,800 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. దాదాపు 80 శాతం పెట్రోల్, డీజిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మన దేశం వాటి వాడకాన్ని తగ్గించడం తో పాటు హైడ్రోజన్ ఇంధనం, ఫ్యూయెల్ సెల్ ఎలెక్ట్రిక్ వెహికల్ (FCEV) వినియోగంపై దృష్టి సారిస్తోంది. మన శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలనిచ్చి పర్యావరణ పరిరక్షణకు ఇతోధికంగా మేలు జరగాలని, దేశం ఆర్థికంగా మరింత పురోగతి సాధించాలని, యువతకు పుష్కలంగా ఉద్యోగావకాశాలు ఏర్పడాలని, ప్రజారోగ్యానికి బాసటగా నిలిచి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం.


యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

88850 50822


ఇవి కూడా చదవండి :

భారీ తగ్గింపుతో OLA కొత్త బైక్ లాంచ్.. కేవలం రూ. 999తో బుకింగ్

Next Story