నివేదన:అక్కడ 'రూల్ ఆఫ్ లా' పాటించండి

by Disha edit |
నివేదన:అక్కడ రూల్ ఆఫ్ లా పాటించండి
X

ఏజెన్సీ ప్రాంతాలలోని 29 ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలకు కనీసం దరఖాస్తు చేసుకునే అర్హత లేకుండా చేసిన జీఓ నం. 03ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల కోసం ప్రకటన చేయడం పట్ల నిరుద్యోగులలో హర్షం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనై గిరిజనేతర నిరుద్యోగులకు ఏజెన్సీ ప్రాంతాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకపోతే న్యాయపోరాటానికి దిగుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జీఓ నం 3 ను రద్దు చేస్తున్నట్లు కానీ, కొనసాగిస్తున్నట్టు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం.

భారీగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులలో ఆనందం వ్యక్తమవుతోంది. కానీ, ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులలో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దానికి కారణం జీఓ నం.03. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు 29 ప్రభుత్వ శాఖలలో వందకి వంద శాతం రిజర్వేషన్ కల్పించడంతో గత 20 సంవత్సరాలుగా కేవలం గిరిజన అభ్యర్థులతోనే నియామకాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు గిరిజనేతరులు ఈ నియామకాలలో తమకు అన్యాయం జరుగుతోంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన ధర్మాసనం జీఓ నం. 03ను రద్దు చేసి, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతాలలో వంద శాతం ఉద్యోగాలను రిజర్వు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేసింది. భవిష్యత్తులో జీఓ నం. 03ను అనుసరించి వందకి వంద శాతం వారికి రిజర్వేషన్లు పాటిస్తూ నియామకాలు చేపడితే, 1986 నుంచి జరిగిన అన్ని నియామకాలను సమీక్షించాల్సి వస్తుందని హెచ్చరించింది.

మారిన నోటిఫికేషన్

ఈ క్రమంలోనే వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలోని ఏజెన్సీ ప్రాంతాలలో కొద్ది నెలల క్రితం జరిగిన అంగన్‌వాడీల నియామకాలకు సంబంధించి అధికారులు జీఓ నెం. 03 ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ గిరిజనేతర ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు నోటిఫికేషన్లను రద్దు చేసింది. దాంతో మహిళా,శిశు సంక్షేమ శాఖ రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి మరో ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేసింది.సుప్రీంకోర్టు, హైకోర్టు రెండు కూడా జీఓ నం. 03 ను రాజ్యాంగ విరుద్ధం అని వ్యాఖ్యానించినందున, ప్రస్తుత నియామకాలలో ఏజెన్సీ ప్రాంతాలలోని అన్ని రకాల ఉద్యోగాలకు ఎస్‌సీ, బీసీ, ఓసి, మైనారిటీలందరూ పోటీ పడేలా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేయాలని తెలంగాణ గిరిజనేతర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రద్దు ఉన్నట్టా లేనట్టా?

1986 నుండి జీఓ నం. 03 ను అనుసరించి ఏజెన్సీ ప్రాంతాలలో జరిగిన ఉద్యోగ నియామకాలలో తీవ్రంగా నష్టపోయిన వేలాదిమంది గిరిజనేతర నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. గడిచిన రెండు దశాబ్దాల కాలంగా ఏజెన్సీ ప్రాంతాలలోని 29 ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలకు కనీసం దరఖాస్తు చేసుకునే అర్హత లేకుండా చేసిన జీఓ నం. 03ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల కోసం ప్రకటన చేయడం పట్ల నిరుద్యోగులలో హర్షం వ్యక్తమవుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనై గిరిజనేతర నిరుద్యోగులకు ఏజెన్సీ ప్రాంతాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకపోతే న్యాయపోరాటానికి దిగుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జీఓ నం 3 ను రద్దు చేస్తున్నట్లు కానీ, కొనసాగిస్తున్నట్టు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం.

సుభానీ మహమ్మద్

మహబూబాబాద్

99899 99786

Next Story

Most Viewed