దళితుల్లోనూ.. ఇంత వివక్షా?

by Disha edit |
దళితుల్లోనూ.. ఇంత వివక్షా?
X

రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పిన మాటలు ఎప్పటికి అక్షర సత్యమే . అట్టడుగు వర్గాలకు సైతం రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో ఆయన దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాడు. రాజ్యాంగ రక్షణతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఈ వర్గాల్లో కూడా నేటికీ అసమానతలు ఎదుర్కొంటున్నారు.

భారత రాజ్యాంగం దళిత వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, ఈ వర్గాల్లో కూడా నేటికీ అసమానతలు ఎదుర్కొంటున్నారు. అందరం దళితులమేనన్న నెపంతో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో షెడ్యూల్డ్ కులాల్లో మాల మాదిగ కులాలే లబ్ది పొంది మిగతా కులాలు అణగదొక్కబడ్డాయి. ఇదే పలు కేంద్ర నివేదికలు సైతం రుజువు చేశాయి.

ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో ఇంతకాలం అన్యాయానికి గురైన ఉపకులాలను విస్మరించి, ఇన్నేళ్లుగా అధికారాన్ని అనుభవించిన మాల, మాదిగ కులాలే మాకంటే మాకు అన్యాయం జరిగిందని మాకే మొత్తం ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని పోరాడుతుండడాన్ని చూస్తే విస్మయం కలుగకమానదు. మళ్ళీ వీరే బహుజన రాజ్యం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నమంటారు. ఇదేం న్యాయం?

దళితుల్లోనూ.. కులగణన అవసరం

2011 అధికారిక లెక్కల ప్రకారం, తెలంగాణ రాష్ట్ర జనాభా 3,63,37,160 కోట్లు. ఇందులో షెడ్యూల్డ్ కులాల జనాభా 63,60,158 లక్షలు అంటే రాష్ట్ర జనాభాలో 17. 50 శాతం. దళితుల్లో మాదిగలు 25,09,992 లక్షలు అంటే 39 శాతం, రాష్ట్ర జనాభాలో 6.9 శాతం. మాలలు 17,05,448 లక్షలు అంటే 27 శాతం, రాష్ట్ర జనాభాలో 4.6 శాతం. ఇక ఇందులోనే అత్యంత వెనుకబడ్డ కులాల( ఉప కులాలు) జనాభా 21,44,718 లక్షలు. అనగా దళిత జనాభాలో వీరు 34 శాతం రాష్ట్ర జనాభాలో 5.9 శాతం మేర ఉన్నారు. ఇక్కడ మరొక అన్యాయం ఏమిటంటే మాల, మాదిగలకు కుల ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ఇస్తే ఉపకులాలకు మాత్రం ఆర్డీవో ద్వారా ఇస్తారు. దీనివల్ల ఉపకులాల ప్రజలు అధికారుల ఇబ్బందులకు తాళలేక లక్షలాది మంది ఉపకులాల ప్రజలు మాల, మాదిగ కుల పత్రాలు పొందడం వల్ల ఈ రెండు కులాల జనాభా అధికారిక లెక్కల్లో పెరిగింది. కానీ వాస్తవ జనాభా వీరికంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే దళితుల్లో కులగణన చేయాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నాం.

దశాబ్దాలుగా అధికారం ఈ రెండు కులాలకే

ఇక రాజకీయ అవకాశాల విషయానికొస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 42 ఎంపీ స్థానాలు గానూ, 7 ఎస్సీ రిజర్వుడు, 294 ఎమ్మెల్యే స్థానాలలో 48 స్థానాలు రిజర్వుడు. వీటిని అధిక శాతంమాలలు దక్కించుకోగా, మాదిగలు ద్వితీయ స్థానంలో వినియోగించుకున్నారు. ఆనాటికి ఉపకులాల ఊసేలేదు. రాష్ట్ర విభజన తర్వాత మన తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలలో 19 ఎస్సీ రిజర్వుడు కాగా,17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 3 స్థానాలు దళితులకు కేటాయించబడ్డాయి. ఈ మూడు స్థానాలలో అనేక దశాబ్దాలుగా పెద్దపల్లి నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి చెందిన గుడిసెల వెంకటస్వామి కుటుంబం, నాగర్ కర్నూల్ నుంచి మాదిగ సామాజిక వర్గం నుండి మంద జగన్నాథం, కంటోన్మెంట్ సికింద్రాబాద్ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నంది ఎల్లయ్య గార్లు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వరంగల్ పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గం ఏర్పడింది ఇక్కడ నుండి కూడా ఎక్కువ మాదిగలే ప్రాతినిధ్యం వహించారు.

19 రిజర్వుడు స్థానాలూ వారికేనా?

ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని, అసెంబ్లీ స్థానాలలో ఎస్సీ ఉప కులాల సంఖ్య నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. 2018 పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న అందులోనూ ఉపకులాల సంఖ్య అధికంగా ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో మొదటిసారిగా ఎస్సీ ఉపకులమైన నేతకానీ కులానికి చెందిన బోర్లకుంట వెంకటేష్ నేతకు పార్లమెంట్ సభ్యునిగా అవకాశం లభించింది. కానీ ఆ పరిస్థితి నేడు లేదు. అందుకే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో సామాజిక న్యాయ ప్రకారంగా ఒక స్థానం మాదిగలకు రెండవ స్థానం మాలలకు మూడవ స్థానం ఉప కులాలకు దక్కాలి. కానీ మాల మాదిగ కులాలకు చెందిన వారే మాకు అన్యాయం జరిగిందంటే మాకన్యాయం జరిగిందని వాదులాడుకుంటూ మా ఎస్సీ ఉపకులాలకు అవకాశం రాకుండా గొంతు నొక్కుతున్నారు.

పైగా దళితులకు రిజర్వ్ చేయబడ్డ 19 అసెంబ్లీ స్థానాలలో పది స్థానాల్లో మాదిగలు ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగతా తొమ్మిది స్థానాలలో మాలలు అధికారాన్ని అనుభవిస్తున్నారు. కానీ సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం వెనుకబడ్డ దళిత ఉపకులాలకు ఆరు స్థానాలు దక్కాల్సి ఉండగా ఎక్కడా అవకాశమివ్వలేదు.

57 కులాలను ఎదగనీయకుండా..

ఒకవైపు మాలల వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని మిగతా వెనుకబడ్డ దళిత కులాల కోసం వర్గీకరణ చేయాలని మాదిగ దండోర పేరుతో ఒక వర్గం ఉద్యమిస్తుంటే, ఎస్సీలను వర్గీకరించొద్దని మాల మహానాడు పేరుతో మరొక వర్గం ఉద్యమాలు చేస్తూ ఈ రెండు కులాలు ప్రభుత్వాల ఆధిపత్యం చెలాయిస్తూ మిగతా 57 కులాలను ఎదగనివ్వకుండా అణచివేస్తున్నారు.

సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ఈ రెండు కులాలే దళితుల ప్రయోజనాలు అనుభవిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు దళితుల్లో వెనుకబాటులో ఉంచబడ్డ ఈ కులాల పేర్లు బయటకు తెలియకుండా, ఈ కులాల సమస్యలు పరిష్కరించకుండా వీరికి మాదిగ ఉపకులాలు, మాలఉపకులాలనే ముద్ర వేసి వీరందరి ప్రయోజనాలు రెండు కులాలే పొందుతుండడం అన్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ నాటికి ఈ కులాల వారికి కనీసం నామినేటెడ్ పదవులు సైతం దక్కలేదు. ప్రభుత్వ పథకాలలో ఒక్క శాతం కూడా ఈ కులాలకు అందలేదు. ఈ కులాలన్నీ కేవలం ఓటు బ్యాంకుగానే మిగిలిపోయాయి. దళితుల్లోనే ఇంత వివక్ష, ఆధిపత్యం ఉంటే ఇక రిజర్వేషన్లు ఎవరికోసమో ఆలోచించాలి.

ఇలా చేస్తేనే.. సామాజిక న్యాయం

ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి ఈ వివక్షతను కొనసాగించకుండా వెనుకబడ్డ దళిత కులాల వృత్తులు సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పరచాలి. ఈ కులాలను ఉపకులాలుగా కాకుండా అత్యత వెనుకడిన షెడ్యూల్డ్ క్యాస్ట్స్‌గా గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, నామినేటెడ్ ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలను కేటాయించాలి. ఈ కులాలకు శాశ్వత న్యాయం చేకూర్చడానికి ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాల మాదిగ కులాలతో సంబంధం లేకుండా ఈ కులాలన్నింటిని 'ఏ' వర్గంలో చేర్చి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కేటాయించాలి. ఇప్పటివరకు అధికారాన్ని అనుభవించిన కులాలు రిజర్వుడు స్థానాలను వదిలి ఇంతవరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించని కులాలకు అవకాశం కల్పించి తాము మాత్రం జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే అంబేద్కర్ ఆశించిన సామాజిక న్యాయం జరుగుతుంది.

(ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా)

బైరి వెంకటేశం మోచి

జాతీయ అధ్యక్షులు

ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి

94919 94090

Next Story

Most Viewed