పీటీ ఉషకు అపూర్వ గౌరవం

by Disha edit |
పీటీ ఉషకు అపూర్వ గౌరవం
X

భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు ప్రప్రథమ మహిళా అధ్యక్షురాలిగా ఎంపికయిన తొలి క్రీడాకారిణి పీటీ ఉష. పయ్యోలీ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన ఉష ఇపుడు రాజ్యసభ సభ్యురాలిగానూ ఉన్నారు. 80 వ దశకంలో భారత దేశ కీర్తిని క్రీడారంగంలో జగద్విదితం చేసిన 58 సంవత్సరాల పరుగుల రాణి పూర్తి పేరు పిలవుళ్లకండి తెక్కెపారంబిల్ ఉష (పీటీ ఉష). ఒలింపిక్ అధ్యక్ష పదవికి క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన మహారాజా యాదవీంద్ర సింగ్ తరువాత ఈమె ఎన్నిక కావడం విశేషం. ఈ అసోసియేషన్ ఎన్నికలు 10 డిసెంబర్ 2022 న ఎన్నికలు జరగాల్సి ఉండగా, సహచర అథ్లెట్స్, జాతీయ ఫెడరేషన్ సూచనను మన్నించి ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

క్రీడా జీవితం

27 జూన్ 1964 న కేరళ రాష్ట్రం, కోజికోడ్ జిల్లా కాలికట్ సమీపంలోని పయ్యోలి గ్రామంలో ఈపీఎం పైథల్, టీవీ లక్ష్మీ దంపతులకు ఉష(P. T. Usha) జన్మించారు. పేదరిక బాల్యమే ఆమెను రాటుదేలేలా చేసింది. కేరళ ప్రభుత్వం నుంచి లభించిన రూ 250 స్కాలర్‌షిప్ క్రీడల పట్ల మక్కువ పెంచింది. ఆ తరువాత కన్నూర్‌లోని క్రీడా పాఠశాలలో చేరి మొదటిసారి 1977 జాతీయ పాఠశాలల క్రీడల పోటీలలో చిరుతలా పరిగెత్తింది. ఆమె పరుగును వీక్షించిన అథ్లెటిక్స్ శిక్షకుడు ఓఎం నంబియార్ మంత్రముగ్దుడయి ఆమె ఒక గొప్ప స్ప్రింటర్ కాగదలని ఊహించారు. నంబియార్ కఠోర శిక్షణలో రాటు దేలిన ఆమె 1978లో 100,200 మీటర్లు, 60 మీటర్ల హర్దిల్స్, లాంగ్ జంప్‌లో 4 బంగారు, రజత పతకాలు సాధించింది. 4x 100 మీటర్ల రిలే విభాగంలో కాంస్య పతకం సాధించింది. కేరళ వార్షిక కాలేజీ మీట్ సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీలలో ఏకంగా 14 పతకాలు సొంతం చేసుకున్నారు. తర్వాత వరుసగా 1979 నేషనల్ గేమ్స్, 1980 నేషనల్ ఇంటర్ స్టేట్ మీట్‌లో పలు పతకాలు సాధించడంతో పాటు ఆయా విభాగాలలో అనేక జాతీయ రికార్డులు(national records) నెలకొల్పడం ఆమె అద్వితీయమైన ప్రతిభకు తార్కాణం.

1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత్ కు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళ గా చరిత్ర సృష్టించారు. 1981 బెంగళూర్‌లో జరిగిన సీనియర్ ఇంటర్ స్టేట్ క్రీడలలో 100 మీటర్లు 11.8 సెకన్లలో, 200 మీటర్లు 24.6 సెకన్ల తో జాతీయ రికార్డు నెలకొల్పింది. భారత్‌లో నిర్వహించిన 1982 ఏషియన్ గేమ్స్‌లో(asian games) 11.95,25.32 సెకన్లతో 100,200 మీటర్ల విభాగాలలో రజత పతకాలు సాధించింది. 1983లో జంషెడ్‌పూర్ లో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్స్‌లో 200 మీటర్ల జాతీయ రికార్డును 23.9 సెకన్లతో బద్దలు కొట్టడమే కాక 53.6 సెకన్లలో 400 మీటర్ల పరుగు పందెంలో మరో జాతీయ రికార్డును నమోదు చేసింది. అదే సంవత్సరం కువైట్ లో జరిగిన ఏషియన్ ఛాంపియన్ షిప్స్ లో 400 మీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించింది. 1980 మాస్కో ఒలింపిక్ క్రీడలతో ప్రారంభించిన అంతర్జాతీయ ప్రస్థానాన్ని దాదాపు రెండు శతాబ్దాలు, అంటే 1998 లో థాయ్ ల్యాండ్, బ్యాంకాక్ లో జరిగిన ఆసియా క్రీడల వరకు అప్రతిహతంగా కొనసాగించింది. 2000 సంవత్సరంలో తన రిటైర్మెంట్ ప్రకటించింది.

ఆమె పతకాలు, సత్కారాలు

ప్రఖ్యాత ఆసియా క్రీడలలో (ఏషియన్ గేమ్స్) ఆమె నాలుగు బంగారు, ఏడు రజత పథకాలు సాధించింది. భారత క్రీడారంగానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్రపతి ఆమెను 6 జూలై 2022 న రాజ్యసభకు నామినేట్ చేసారు. 1984 లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో(olympics) ఆమె కేవలం సెకనులో వందవ వంతుతో కాంస్య పతకం కోల్పోయింది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఏషియన్ గేమ్స్‌లో నాలుగు బంగారు, ఏడు రజత పతకాలను, ఏషియన్ ఛాంపియన్ షిప్స్ లో 14 బంగారు పతకాలు సహా 23 పతకాలను ఆమె కైవసం చేసుకున్నారు.

కన్నూర్ యూనివర్సిటీ 2000 సంవత్సరంలో డి లిట్‌తో, ఐఐటీ కాన్పూర్ 2017లో డాక్టరేట్ ఇన్ స్పోర్ట్స్ (డీఎస్‌సీ), యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ 2018 లో డి. లిట్. గౌరవ పురస్కారాలతో సత్కరించాయి. భారత ప్రభుత్వం 1985లో ఆమెను 'పద్మశ్రీ'తో గౌరవించింది. ప్రస్తుతం ఆమె ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (ఐఐఎంయూఎన్) బోర్డు సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(Indian Olympic Association) 16 వ అధ్యక్షురాలిగా ఈ నెల 28న వ బాధ్యతలు చేపట్టబోతున్న పీటీ ఉష తన అపార క్రీడానుభావాన్ని రంగరించి సుశిక్షిత క్రీడాకారులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తారని ఆశిద్దాం.


యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

8885050822

Next Story

Most Viewed