హక్కుల ఉల్లంఘన మానవతకు వ్యతిరేకం

by Disha edit |
హక్కుల ఉల్లంఘన మానవతకు వ్యతిరేకం
X

దేశానికి స్వాతంత్రం సిద్ధించిన సమయంలో యావద్దేశ ప్రజలూ తమ భవిష్యత్తు మహోజ్వలంగా ఉంటుందని సకల జనులకు సమస్త హక్కులు లభ్యం కాగలవనీ ఆశించారు. అందుకే ప్రజల కలలను సాకారం చేయడానికి రాజ్యాంగ నిర్మాణ సభ్యులు భారత రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. సంక్షేమ రాజ్యాంగా తీర్చిదిద్దాలని తలచి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం గా మలిచారు. ఇది అంత పెద్దగా ఉద్గ్రంధం కావడానికి ముఖ్య కారణం ఇందులో దేశం, దేశ ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఒక్కొక్క అంగాన్ని, శాఖను విపులంగా చర్చించడమే. అయితే రాజ్యాంగం ప్రకారం దేశ సంక్షేమం కోసం మూడు వ్యవస్థలను సృష్టించారు అవి శాసన వ్యవస్థ, పాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ మూడు సమన్వయంతో పనిచేస్తేనే ఏ దేశమైనా సంక్షేమ రాజ్యంగా ఆవిర్భవించి హక్కులు పరిరక్షించబడతాయి. కానీ దురదృష్టకరంగా ఇవి జవాబుదారీతనంగా వ్యవహరించకపోవడంతో సమాజంలో వివక్ష, అణచివేత, అసమానత, హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు గడిపోయినా నేటీకి ప్రజలు న్యాయం, హక్కుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే జీవనం గడుపుతున్నారు. వీరికి హక్కులు, న్యాయం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? నిజానికి ఈ ప్రపంచంలో బలవంతులు, బలహీనులనే రెండే వర్గాల వారున్నారు. వీరు గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులోనూ ఉంటారు.

కానీ సహజంగా మానవ నైజం కోరేదేమిటంటే బలవంతుడైన వాడు తన శక్తి సామర్ధ్యాలను దుర్వినియోగం చేయకుండా బలహీనుల పట్ల ప్రేమ, దయ, జాలి, సానుభూతి, సహాయ వైఖరి అవలంభించాలి. అతడి శక్తి బలహీనుడి అశక్తతను దూరం చేసి అతని బలోపేతానికి దోహదపడాలి కానీ అలా జరుగుతుందా? ఇప్పటికీ బలవంతుల చేతిలోనే అనేక హక్కులు, అధికారాలు ఉండిపోతున్నాయి. బలహీనుడికి వాటిలో కొంత కూడా ప్రాప్తం కావడం లేదు. అతనికి అడుగడుగున అన్యాయం, అభద్రత, హక్కుల ఉల్లంఘనే ఎదురవుతున్నాయి. తద్వారా హక్కులు అనుభవిస్తున్నవారు, హక్కుల నిరాకరణకు గురైనవారు వేర్వేరు వర్గాలుగా ఏర్పడ్డారు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి దృశ్యాలు అనేకం గోచరిస్తాయి.

దాని మీద ఆధారపడి ఇతర హక్కులు

భూప్రపంచంపై నివసించే ప్రతి ఒక్కరికి సహజంగానే కొన్ని హక్కులుంటాయి. మనిషి మనిషిగా జీవించడానికి ఇవి అత్యవసరం. ఇందులో కులం, జాతి, మతం, భాష ప్రాంతీయతలకు అతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండటమే ప్రధాన ఉద్దేశ్యం తో మానవ హక్కుల దినాన్ని 1948 డిసెంబర్ 10 న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా( Human Rights Day) జరుపుకుంటున్నారు. మానవ హక్కులలో అన్నింటికన్నా ప్రధానమైనది జీవించే హక్కు. దీనిని కాదనే హక్కు ఎవరికీ లేదు. దీని పైనే ఇతర హక్కులన్ని ఆధారపడి ఉంటాయి. ఈ హక్కును భంగం పరిస్తే ఇతర ఏ హక్కులు మిగలవు. అందుకే ఈ హక్కుని సమస్త ప్రజాస్వామిక చట్టాలు ఒక సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన ప్రాథమిక హక్కుగా(fundamental right) గుర్తించాయి.

ప్రతి మనిషి సమాజంలో చలన రహితంగా జీవితం గడపాలని అనుకోడు. సమాజంలో తన పాత్ర పోషించాలని అనుకుంటాడు ఇది అతని సహజమైన హక్కు. అయితే ఇది స్వేచ్ఛాయుత అవకాశాలున్నప్పుడే సాధ్యం. అందుకే నేటీ ప్రజాస్వామ్య యుగంలో భావ ప్రకటన స్వేచ్ఛను(Freedom of expression) ప్రాథమిక హక్కులలో ఒకటిగా గుర్తించారు. దీని ప్రకారం తన అభిప్రాయాలను వ్యక్తపరిచే అధికారం ఉంది. అయితే దీనిని హద్దులు మీరి వినియోగిస్తే సమాజానికి హానికరం. సాధారణంగా హక్కులు మాగ్నాకార్టతో (Magna Carta)ప్రారంభమైందని చెబుతారు. కానీ ఆటవిక సమాజంలో కూడా ఈ హక్కులు ఉన్నట్లు చెబుతారు. జాతి, వర్ణం, లింగం, కులం, మతం, భాష, ప్రాంతం, రాజకీయం వంటి కారణాలతో వివక్షకు గురికాకుండా ఉండే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు, మత ధర్మాన్ని అనుసరించి ప్రచారం చేసుకునే హక్కు, చిత్రహింసలు, క్రూరత్వం నుంచి రక్షణ పొందే హక్కు, వెట్టిచాకిరీ, బానిసత్వం లాంటి దుర్మార్గాల నుంచి రక్షణ పొందే హక్కు, సరైన కారణం, రుజువులు, సాక్ష్యాలు లేకుండా నిర్బంధించబడకుండా ఉండే హక్కు, నేరస్తులని అనుమానమున్నప్పటికీ, నిందితులని తేలే వరకు వారు నిరపరాధిగా పరిగణించే హక్కు, ఒక అభియోగం ఆపాదించబడినప్పుడు, పక్షపాత రహితంగా విచారణ పొందే హక్కు, సురక్షిత ప్రాంతంలో ఏకాంతంగా జీవించే హక్కు, జీవించే హక్కు, సామాజిక భద్రత హక్కు, భావ స్వాతంత్య్ర హక్కు, విద్యా హక్కు, ప్రజాస్వామ్య హక్కు, కాపీరైటు హక్కు, జాతీయతా హక్కులు వంటివెన్నో ఉన్నాయి.

కంచే చేను మేస్తే ఎలా

దేశానికి స్వాతంత్రం సిద్ధించిన సమయంలో యావద్దేశ ప్రజలూ తమ భవిష్యత్తు మహోజ్వలంగా ఉంటుందని సకల జనులకు సమస్త హక్కులు లభ్యం కాగలవనీ ఆశించారు. అందుకే ప్రజల కలలను సాకారం చేయడానికి రాజ్యాంగ నిర్మాణ సభ్యులు భారత రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. సంక్షేమ రాజ్యాంగా తీర్చిదిద్దాలని తలచి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం గా మలిచారు. ఇది అంత పెద్దగా ఉద్గ్రంధం కావడానికి ముఖ్య కారణం ఇందులో దేశం, దేశ ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఒక్కొక్క అంగాన్ని, శాఖను విపులంగా చర్చించడమే. అయితే రాజ్యాంగం(indian constitution) ప్రకారం దేశ సంక్షేమం కోసం మూడు వ్యవస్థలను సృష్టించారు అవి శాసన వ్యవస్థ, పాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ మూడు సమన్వయంతో పనిచేస్తేనే ఏ దేశమైనా సంక్షేమ రాజ్యంగా ఆవిర్భవించి హక్కులు పరిరక్షించబడతాయి. కానీ దురదృష్టకరంగా ఇవి జవాబుదారీతనంగా వ్యవహరించకపోవడంతో సమాజంలో వివక్ష, అణచివేత, అసమానత, హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి.

కంచే చేను మేసిన చందంగా వ్యవస్థే పక్కదారి పడితే ఎలా? అందుకే చాలా ప్రజాస్వామ్య దేశాల్లో మానవ హక్కులకు భరోసా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనదేశంలోనూ ఇది కనిపిస్తుంది. యుద్ధాలతో విలవిలలాడుతున్న దేశాలలో, రాచరిక దేశాలలో మానవ హక్కుల ఉల్లంఘన సర్వసాధారణమే కానీ ప్రజాస్వామ్య దేశాలలో కూడా ఇలా జరిగితే ఎలా? అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని గొప్పలు చెప్పుకుంటున్న మన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించినా మన పాలకులలో చలనం రాకడపోడం విడ్డూరం. అందుకే ప్రజలే తమకు అన్యాయం జరుగుతోందని, హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని భావిస్తే వాటికి సంబంధించిన ప్రత్యేక కోర్టులను, కమిషన్‌లను ఆశ్రయించవచ్చు.కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే మానవులలో నైతిక స్పృహ ఉంచుకోవాలి అప్పుడే హక్కుల ఉల్లంఘన గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. కోర్టులు, చట్టాలు తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాలు కావు. మానవులు నైతికంగా పరివర్తన చెందితేనే హక్కులు పరిరక్షించబడతాయి.

(నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం)


ఎండీ ఉస్మాన్‌ఖాన్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99125 80645


Next Story

Most Viewed