CESS election: 'సెస్' ఆత్మకథ

by Disha edit |
CESS election: సెస్ ఆత్మకథ
X

నా పక్కా పుట్టిన రోజు 1 నవంబర్ 1970. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో పట్టుబట్టి మంత్రసానితనం చేసి నన్ను ఈ భూమి మీదికి తీసుకువచ్చింది నాటి ప్రఖ్యాత రాజకీయవేత్త, ప్రజా సేవకుడు కీ.శే. చెన్నమనేని రాజేశ్వరరావు(chennamaneni rajeshwararao). నా పేరు రిజిస్టర్ ప్రకారం 'విద్యుత్ సరఫరా సహకార సంఘం లిమిటెడ్- సిరిసిల్ల'(Co-operative Electric Supply Society) ఆబాలగోపాలం నన్ను 'సెస్' (CESS) అని నన్ను నోరారా పిలుచుకుంటారు. నేను తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, జాతీయస్థాయిలోనే పేరెన్నికగన్న ఏకైక తల్లి సంస్థగా నాటి నుంచి నేటిదాకా, సాటి లేకుండా అలరారుతున్నాను. నేను ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా విస్తరించి నా కార్యకలాపాలని దాదాపు 2 లక్షల 72 వేల మంది వినియోగదారులకు, నా కన్న పిల్లల వంటి ఉద్యోగుల ద్వారా ఉత్తమోత్తమ సేవలను అందిస్తున్నాను.అది ఎలా అంటే, నాడు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి అన్ని కేటగిరీల 4,720 సర్వీసులను కలుపుకొని నాకు అత్యంత మిట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ప్రాణ ప్రతిష్ట చేశారు.

నాడు సిరిసిల్ల((rajanna sircilla) ప్రాంతంలో 46 గ్రామాలకు మాత్రమే కరెంటు సరఫరా ఉండేది. క్రమక్రమంగా ఈరోజు వరకు 2,72,000 వివిధ కేటగిరీల సర్వీసులతో సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాలకు సంపూర్ణ కరెంటును అందించిన సంస్థగా పేరుగాంచాను. ఈరోజు సిరిసిల్ల ప్రాంతం సంపూర్ణ వరి, మెట్ట పంటలతో తులతూగుతున్నది. నేను పరోక్షంగా ఈ జిల్లా ప్రజలకు ఉపాధిని అందిస్తున్నాను. ఎన్‌పీ‌డీసీఎల్‌లో పది మంది ఉద్యోగులు చేసే పనిని ఇక్కడ ఏడుగురు చేస్తున్నారనే విషయాన్ని పాలకులు గమనించాలి.

వీరికి చేతి నిండా పనే

సిరిసిల్ల పట్టణం పద్మశాలీలకు నిలయం. తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్లను మరో సోలాపూర్‌గా అభివర్ణిస్తారు. ఇక్కడ నేత పరిశ్రమలో వివిధ భాగాలతో కలుపుకొని పనిచేసే కార్మికులు 25 వేల మంది ఉంటారు. వీరికి చేతినిండా పని దొరుకుతుంది. కుటీర పరిశ్రమగా నేత, పవర్‌లూమ్ కార్ఖానాలను గుర్తించి ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం సబ్సిడీతో కరెంటును నేను సరఫరా చేస్తున్నాను. 70 శాతం కలిగిన వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఉచితంగా కరెంటు ఇస్తున్నాను. తద్వారా కర్షక, నేత కార్మిక కుటుంబాలు కంటి నిండా నిద్రకు, కడుపునిండా తిండికి కొదువ లేకుండా బతుకును గడుపుతున్నాయి. వేడినీళ్లకు చన్నీళ్లతోడుగా కార్మిక కుటుంబాల మహిళలు బీడీలు చేస్తున్నారు.

నేను 52 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇటీవలనే 53వ యేట అడుగుపెట్టాను. కరెంటు లైన్‌ల నిర్మాణ పనులలో వినియోగదారులు పాలుపంచుకునే సహకారం ఎన్నదగినది. వారి స్వచ్ఛంద శ్రమదానానికి విలువ కట్టి, ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. నిజంగా తల్లి వంటి సంస్థ పరిధిలో నా పిల్లలు, వినియోగదారులు ఎదిగి ఒదిగి ఉండడం ఎలాగో వాళ్లతో పాటు నాకు కూడా నేర్పించారు. అప్పుడప్పుడు 52 సంవత్సరాల నా ప్రగతిని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కొక్కసారి కించిత్తు గర్వంగా అనిపిస్తుంది. ప్రారంభంలో 4,1 75 ఉన్న సర్వీసులు ఉంటే ఇప్పుడు 2 లక్షల 72 వేలకు చేరడం వినియోగదారుల చిత్తశుద్ధికి తార్కాణం, గొప్ప విశేషం కూడా.

అవినీతి మకిలీ అంటించారు

అయితే, నా సంరక్షణ కోసం ఒక పాలకవర్గాన్ని కూడా నేనే ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకుంటున్నాను. మొదటి అయిదారు పాలకవర్గాల కాలంలో నేను ఎంతో అభివృద్ధి చెందాను. ఎందుకంటే ఆ పాలకవర్గం సభ్యులు నిజాయితీగలవారు కావడంతో పాటు నా సేవలను నిజాయితీగా అందించే నిబద్ధతతో పని చేశారు. అందుకని నేను వందల రెట్లుగా వృద్ధి చెందాను. కానీ, ఇటీవల ఏర్పడిన రెండు పాలకవర్గాల కాలంలో నాకు అవినీతి చీడ పట్టింది. నిధుల దుర్వినియోగం పీడ వచ్చి చేరింది. దీంతో నేను ఆర్థిక, పౌష్టికాహార లేమితో అల్లాడుతున్నాను.

సమతుల నిధుల ఆహారం కోసం తల్లడిల్లుతున్నాను. ఇది ఈ ప్రాంతంలోని శాసనసభ్యులకు, కీలక మంత్రికి తెలిసినప్పటికీ నా బాధను వేదనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా, ఇప్పుడు నన్ను ఉద్ధరించడానికి, పిడుచ కట్టుకపోతున్న నా గొంతుకు కాసిన నీటి బిందువులు అందించడానికి మళ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలి. కానీ, అంతర్గతంగా అన్ని రాజకీయ వర్గాల జోక్యంతో బాధాకరంగా కార్యవర్గ సభ్యులఎన్నికలు కొనసాగుతున్నాయి.

మీ మనసులో ఏదో ఉందట

ఇందులో నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. కానీ, నాకు అవినీతి చీడను తగిలించిన వారిని తిరిగి నిలబెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లుతుంది. నేను బాధపడుతున్నానని అంటే, ఎన్‌పీ‌డీసీఎల్‌(tsnpdcl) వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని ఒక ముఖ్య నాయకుడు మౌనంగా మనసులో పెట్టుకున్నాడని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడని ఆ నోటా ఈ నోటా నా వరకు వచ్చింది. ఆయనకు తెలువది కావచ్చు సమస్త మానవాళి సమాజం అంతా కూడా పరస్పర సహకారంతో నడుస్తున్నదని. నువ్వు ఎక్కడ పుట్టినవో, ఏడ చదువుకున్నవో, ఏడ పని చేసినవో నేను అడగలేదు. నాకు అవసరం లేదు. కోరి వచ్చినప్పుడు ఆదరించి కడుపులో పెట్టుకొని, సాది, సంరక్షించి నిన్ను అందరి పిల్లల్లా చూడక పెంచి నాయకుడిగా పెద్ద చేశాను. కానీ, నువ్వు అన్నీ మర్చిపోయినవ్.

'కన్నతల్లికి గంజిపోయనోడు పిన్నతల్లికి బంగారు గాజులు చేయించినట్టు' 'తాతకు దగ్గులు నేర్పినట్టు' పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు. నాకు కావలసింది ఇవ్వు నాయినా. దయచేసి నన్ను ఇంకో వంద సంవత్సరాలు బతికేలా దీవించు తండ్రీ. బతకనివ్వు అయ్యా! బతుకును ఇవ్వు నాయినా! నా మొర ఆలకించు జెరా. నీకు ఎంత ఎన్ని గొప్ప పనులు ఉన్నా రాజకీయ బిక్ష పెట్టిన ఈ తల్లిని ఆదరించు కేటీ రామారావు(ktr) బాపూ! పడుసు పెడుసు కాదు. మీ నాయనకు నా గురించి అంతా ఎరికే. ఆయనకు ఈ మతలబు చెవిన వేయి. నేను తల్లి లాంటి సెస్‌ను మాట్లాడుతున్నాను. తండ్రులారా ఆలోచించండి. మంత్రివర్యా నేను సెస్‌ను మాట్లాడుతున్నాను నన్ను మిస్ కాకూడదు నువ్వు. కాసేపు నీ చల్లని చూపుల 'క్యాల్ 'ఇటువైపు పెట్టు దయగల్ల బిడ్డా !!!


జూకంటి జగన్నాథం

కవి, రచయిత

94410 78095

Read More...

ఏక్ నిరంజన్. BRS పార్టీని పట్టించుకోని జాతీయ నేతలు

Next Story