రాహుల్ ఓట్ చోర్ విమర్శలపై ఈసీ తన నిబద్ధతను నిరూపించుకోవాలి!

by Ravi |   (  Updated:2025-08-14 00:30:53  IST  )

బిహార్‌లో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణలు ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ’లో ఓటు చోరీ జరుగుతోందని

రాహుల్ ఓట్ చోర్ విమర్శలపై ఈసీ తన నిబద్ధతను నిరూపించుకోవాలి!
X

బిహార్‌లో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణలు ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ’లో ఓటు చోరీ జరుగుతోందని, దాన్ని సరిదిద్దాలని కోరుతూ వంద మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలు ఢిల్లీలో నిరసన ర్యాలీ చెయ్యడం ప్రాముఖ్యత కలిగిన వార్త. వారిని ఎన్నికల కమిషన్ తమను కలిసేందుకు అనుమతినిస్తే సరి పోయేది. రాహుల్ గాంధీ గత సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు కొన్ని ఆధారాలతో బలంగా చెప్తున్నారు. కర్ణాటకలో ఒక పార్లమెంట్ నియోజక వర్గంలో లక్ష ఓట్లకు పైగా మతలబు జరిగినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ సరైన రుజువులతో ఆయన వాదనకు సమాధానం ఇచ్చి ఉంటే అది దేశ ప్రజలకు మంచి సందేశం ఇచ్చినట్లు ఉండేది. పైగా అలా చెయ్యడం దాని బాధ్యత కూడా. దురదృష్ట‌వశాత్తూ ఎన్నికల సంఘం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు కనబడడం లేదు. ఒక రాజ్యాంగ సంస్థ తన బాధ్యత పట్ల ఏ రూపంలో విమర్శ ఎదురైనా, దాన్ని ఒక అవకాశంగా తీసుకుని ప్రజల దృష్టిలో తన నిబద్ధతను చాటి చెప్పేలా ప్రవర్తించాలి. పైగా దీనిపై విమర్శ చేస్తున్నవారు లోక్‌సభలో ప్రతిపక్ష నేత. ఇప్పుడు మరింత స్పష్టతతో దేశ ప్రజలకి బదులివ్వాలి. కానీ జరుగుతున్నది అలా లేదు.. ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారయ్యే ప్రజాస్వామ్యంలో బిహర్‌లోని ఒక అసెంబ్లీ‌లోని‌వే ఇప్పటికే అక్కడ వేలాది ఓట్లు తొలగిస్తున్నారు. మొత్తం అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారు. దొంగవైతే తప్పేం లేదు.. కానీ అవి దొంగవా? లేదా అర్హులనే రాజకీయ కారణాలతో తొలగిస్తు‌న్నారా? అన్నది స్పష్టంగా రుజువులతో చెప్పడం లేదు. పైగా అంతా ఎన్నికలకు ముందు రెండు నెలల్లో తే‌ల్చేస్తున్న హడావిడి రివ్యూ. రాహుల్ ఆరోపణల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు. అది అప్రస్తుతం. త‌న బాధ్యత పట్ల ఒక అనుమానం లేవనెత్తే అంశంపై ఎ‌న్నికల కమిషన్ సరిగ్గా స్పందించాలి. అక్రమాలతో ప్రజా తీర్పు తారుమారు కాకుండా చూసే బాధ్యత కూడా దానిదే. అది ప్రజల పట్ల, దేశం పట్ల రాజ్యాంగ బద్ధమైన బాధ్యత.

- డా.డి.వి.జి. శంకరరావు

94408 36931

Next Story