కన్ఫ్యూజన్‌లో కమ్యూనిస్టులు

by Disha edit |
కన్ఫ్యూజన్‌లో కమ్యూనిస్టులు
X

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల పేరుతో సీపీఐ, సీపీఎం వేస్తున్న ఎత్తుగడలు, వ్యూహాలు కింది స్థాయి క్యాడర్‌ను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నాయి. ఆ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అర్థం కాక కిందిస్థాయి కార్యకర్తలను గందరగోళంలో పడేశాయి. ఓ వైపు పొత్తు అంటూనే మరోవైపు ప్రజా సమస్యలపై పిడికిలి బిగించేందుకు కమ్యూనిస్టు పార్టీలు రెడీ అవుతున్నాయా? ‘బండెనక బండి కట్టి..పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోదాం..కొడుకో నైజాం సర్కరోడా’..అంటూ భూమి, భుక్తి, విముక్తి కోసం ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాట ఘట్టం మరువలేనిది. నైజాం సర్కారును ఎదిరించేందుకు నాటి నాయకులు చూపిన తెగువ, పోరాటాలు చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. నాటి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్నామని చెబుతున్న నేటితరం కమ్యూనిస్టులు ప్రజా సమస్యలు వీడి రాజ‘కీ’యాలకు దాసోహమైనట్టు ప్రచారం జరుగుతున్నది. పొత్తుల పేరుతో కిందిస్థాయి క్యాడర్‌ను కన్ఫ్యూజన్‌లో పడేస్తూ..ప్రజా సమస్యలపై పోరాటం చేయలేని స్థితికి తీసుకొస్తున్నారనే వాదనా కింది స్థాయిలో బలంగా వినిపిస్తున్నది.

కార్యకర్తలు వ్యతిరేకించినా...

మునుగోడు బై పోల్‌లో సీపీఐ, సీపీఎంకి పట్టున్నా, అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఈ పార్టీలు మద్దతు తెలపడంతో పెద్ద చర్చనీయాంశమైంది. పొత్తు నష్టమని, ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతున్న మనం అధికార పార్టీకి ఎలా మద్దతిస్తామని, కిందిస్థాయి నేతలు రాష్ట్ర స్థాయి నేతలను ప్రశ్నించినా, ఈ పొత్తుపై కిందిస్థాయి నేతలతో సమావేశం నిర్వహిస్తే 60 శాతం కార్యకర్తలు ఈ పొత్తుకు నో చెప్పినా పట్టించుకోని కమ్యూనిస్టు అధినాయకులు..బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో.. కింది స్థాయి లీడర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో పొత్తు కుదిరాకా, కమ్యూనిస్టులను బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ప్రచారానికి వెళ్ళినా తగిన గుర్తింపు ఇవ్వలేదు. చివరికి వీరు మద్దతిచ్చిన అభ్యర్థే విజయం సాధించారు. అయితే గెలిచాక, గెలుపులో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టులను పట్టించుకోలేదు. ఇది మింగుడు పడని అనేకమంది ఆ పార్టీ నేతలు పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంపై గుస్సాగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన తాము తర్వాత ప్రజా సమస్యలపై ప్రజలను సమీకరించి ఉద్యమాలు ఎలా చేయాలో అర్థం కావడం లేదని కేడర్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక బై పోల్ తర్వాత కమ్యూనిస్టు నేతలు ఎక్కడా అధికార పార్టీని ఇరుకున పెట్టించేలా స్టేట్ మెంట్లు కానీ, పెద్దఎత్తున ఉద్యమాలు కనిపించలేదు. పైగా మున్ముందు జరిగే ఎన్నికల్లోనూ అధికార పార్టీకి మద్దతు ఇస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. సీట్లు, ఓట్లు ప్రాధాన్యం కావు అంటూనే.. బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడాన్ని కింది స్థాయి కేడర్ వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

పొత్తు చెడిందా!?

ఉపఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తున్నామని సీపీఐ మొదటి నుంచి చెబుతూ వస్తుంది. అయితే, వచ్చే ఐదారు నెల్లలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇప్పటి వరకూ సీపీఐ నేతలు పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు. పైగా రానున్న ఎన్నికల్లో ఈ పార్టీలు యూటర్న్ తీసుకుంటున్నట్టు టాక్. ఇటీవల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన కామెంట్స్‌ ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో 212 సెగ్మెంట్లలో సీపీఐ కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని, అలాగే తెలంగాణలోనూ పొత్తులపై పునరాలోచిస్తున్నామని, దీనిపై జాతీయ సమావేశాల్లోనూ చర్చిస్తామని అన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారగా..కింది స్థాయి క్యాడర్‌ను మాత్రం కన్య్ఫూజన్‌లో పడేసింది. మునుగోడు బై పోల్‌లో మద్దతు ఇచ్చిన నాయకులు..ఇప్పుడు మద్దతుపై ఆలోచిస్తున్నామని చెప్పడం ఏంటని, అసలు పార్టీ వైఖరి ఏంటో అర్థం కావడం లేదని నేతలు తలలు పట్టుకుంటున్నారు.

అయితే, పొత్తులపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు సీపీఐ, సీపీఎం నేతలు ముందుకు రావడం లేదు. ఇటీవల ఇంటింటికీ సీపీఐ పేరుతో ఆ పార్టీ నేతలు యాత్రలు, సభలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ యాత్రతో ‘బీజేపీ కో హఠావో, దేశ్ కో బచావో’ నినాదంతో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అలాగే రాష్ట్రంలోని కౌలు రైతులు, ధరణి లోపాలు, రైతు రుణమాఫీ, పోడు భూములు, గిరిజన, నిరుద్యోగ, కాంట్రాక్ట్ ఉద్యోగుల లాంటి అనేక సమస్యలపైనా ‘జూన్ 11న ‘సీపీఐ ప్రజాగర్జన’ ద్వారా నినదిస్తామని రాష్ట్రనాయకులు ప్రకటించారు. మొన్నటి వరకూ ప్రజా సమస్యలపై స్పందించని ఈ పార్టీ ఇప్పుడు స్టాండ్ మార్చడాన్ని చూస్తే..పొత్తు చెడిందా అనే అనుమానాలు వస్తున్నాయి.

-నిసార్

సీనియర్ జర్నలిస్టు

95426 52786



Next Story

Most Viewed