ఉన్నది ఉన్నట్టు: పైరవీలు, పైసలుంటేనే పనులు

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: పైరవీలు, పైసలుంటేనే పనులు
X

ఒక ట్విట్టర్ మెసేజ్ పెడితే పనైపోతుంది అంటూ గులాబీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. అసలు ట్విట్టర్ ద్వారా సమాచారం ఇవ్వాల్సిన దుస్థితి ఎందుకొస్తున్నది? ప్రజా దర్బార్, గ్రీవెన్స్ సెల్ లాంటివి ఉంటే క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రత పాలకులకు అర్థమవుతుంది. కానీ తెలంగాణలో ఇలాంటి ప్రాక్టీసు లేదు. ప్రభుత్వ విభాగాలు సక్రమంగా పనిచేస్తే ఈ అవసరమెందుకొస్తుంది? ప్రజలు అడిగేవారు.. పాలకులు ఇచ్చేవారు.. అనేది తెలంగాణ ప్రత్యేకత కాబోలు! ప్లానింగ్ పర్మిషన్ మొదలు వాటర్, కరెంటు, డ్రైనేజీ కనెక్షన్ వరకు లంచం ఇచ్చుకోవాల్సిందే. లేకుంటే జీవితకాలంలో అనుమతులు దొరకవు. ఐ-పాస్, బీ-పాస్ లాంటి 'విప్లవాత్మక' పథకాలు ఎన్ని ఉన్నా ఆమ్యామ్యాలిస్తే వర్కవుట్ అవుతుంది. లేకుంటే పనులు జరగవు. అక్షరజ్ఞానం లేని సామాన్యులు, ప్రజా ప్రతినిధులను కలిసే మార్గం లేని మారుమూల గ్రామీణులకు దారి ఏది? కలెక్టర్ ఆఫీసుల ముందు పురుగు మందు తాగి ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించాల్సి వస్తున్నది? ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని చనిపోవాలనే నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి" సమస్యలను చెప్పుకునే మార్గం ప్రజలకు లేదు.. వాటిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి పాలకులకు లేదు.. నిరసనల ద్వారా సర్కారు దృష్టికి తీసుకెళ్ళే స్వేచ్ఛ అసలే లేదు.. బంగారు తెలంగాణ నినాదంలోని వాస్తవం సంగతి ఎలా ఉన్నా పనులు కావాలంటే పైరవీలు, లంచం తప్పనిసరి అనేది అక్షర సత్యం.

బంగారు తెలంగాణ'కు ప్రభుత్వ పెద్దలు ఇచ్చే నిర్వచనం వేరుగా ఉండొచ్చు. కానీ పైరవీలు, లంచం లేకుంటే పనులు కావనేది సామాన్యులకు స్వీయానుభవం. అవినీతి లేకుండా కడుపు కట్టుకుని పనిచేశాం కాబట్టే అభివృద్ధి సాధ్యమైందని పెద్దలు చెప్పుకోవచ్చు. కానీ దేశంలోనే ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో సెకండ్ ప్లేస్‌లో తెలంగాణ ఉన్నట్లు సీఎంఎస్ నిర్వహించిన సర్వేలో 2018లోనే వెల్లడైంది. 'నేను లంచం ఇవ్వలేను..', 'లంచం ఇవ్వడానికి దానం చేయండి..' అంటూ వృద్ధులు ఫ్లెక్సీ బోర్డులు కట్టుకుని డీజీపీ ఆఫీసుకు, ప్రగతి భవన్ పరిసరాలకు వెళ్ళడం తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో అద్దం పడుతుంది. పాలకుల అసమర్థత, ప్రభుత్వ విభాగాలపై నియంత్రణ లేకపోవడానికి ఇదో మచ్చుతునక.

అధికారుల లంచాల బాధను తట్టుకోలేక ఓ రెవెన్యూ అధికారిని పెట్రోల్ పోసి కాల్చేసిన సంఘటన సంచలనం రేకెత్తించింది. అధికారుల అవినీతి దాహాన్ని తీర్చలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యలకు ప్రయత్నించిన సంఘటనలూ ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. క్యాస్ట్, ఇన్‌కమ్, సర్వీస్ లాంటి ఏ సర్టిఫికెట్‌లు కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిందే. ఇక భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పేరు మార్పు, సవరణలు.. ఇలా ఏ పనికైనా వేలు, లక్షల రూపాయల్లో ముట్టుచెప్పుకోవాల్సిందే. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో చాలామంది పట్టుబడుతున్నారు. ఈ విభాగం నమోదు చేస్తున్న కేసులు సముద్రంలో నీటి బొట్టు మాత్రమే.

ఖద్దరు నేతలే పైరవీకారులు

అధికార పార్టీ లీడర్లు, ప్రజా ప్రతినిధులే పైరవీకారులు. స్థానికంగా ఏ పనులు కావాలన్నా వారి దయ ఉండాల్సిందే. ఇది రాష్ట్రంలో ఒక తప్పనిసరి షరతుగా మారింది. ఇందుకు ఎంతో కొంత వారికి ముట్ట చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే దళిత బంధు సాయానికి నోచుకోవాలన్నా పర్సంటేజీలను లోకల్ ఎమ్మెల్యేలు ఇచ్చుకోవాల్సిందే. చివరకు అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరి ఖర్చు కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం పొందాలన్నా ఎమ్మెల్యే నుంచి రికమండేషన్ ఉండాల్సిందే. ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల కోసం ఖద్దరు బట్టలు వేసుకునే ఆ సంఘం నేతలకు సమర్పించుకోవడం రొటీన్ ప్రాక్టీసు. నిబంధనలు, మార్గదర్శకాలు ఎట్లా ఉన్నా లంచం ఇస్తే అవన్నీ బేఖాతర్.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, సుపరిపాలన, సత్వర సేవలు అందించడానికే కొత్త జిల్లాల ఏర్పాటు అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. వారంవారం జరిగే ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తే రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఏ స్థాయిలో పనిచేస్తున్నదో స్పష్టమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన నర్సుల పేరు సర్వీసు రిజిస్టర్‌లో నమోదు కావాలంటే లంచం తప్పనిసరి. తాజాగా కొత్త పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి సర్వీసు సర్టిఫికెట్ కోసమూ డబ్బులు ముట్టచెప్తేనే పని అవుతుంది. చివరకు ఉద్యోగుల జనరల్ ఇన్సూరెన్స్ ఖాతాలోని డబ్బుల్ని అవసరాల కోసం డ్రా చేసుకోవాలనుకున్నా కమిషన్ ఇచ్చుకోక తప్పడం లేదు.

తాను చెడి... సమాజాన్ని చెరిచి

ప్రభుత్వంలో పనులు కావాలంటే లోకల్ లీడర్లను పట్టుకుంటే అయిపోతుంది అనేది తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయింది. లోకల్ లీడర్లు బతుకుతున్నదే ఈ పైరవీలు, కమిషన్లు, లంచాలతోటి. ప్రజలకు సేవ అనే టాగ్‌లైన్ తగిలించుకున్న వీరు చేస్తున్న సేవ సంగతి ఎలా ఉన్నా పనులు చేసిపెట్టే బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లుగా మారారన్నది కఠోర సత్యం. ఎన్నికలప్పుడు ఓటు వేయించుకోడానికి నోటును ఇవ్వడం అలవాటు చేసి ఆ తర్వాత ఐదేళ్ళ కాలంలో ఏ పని చేయాలన్నా ఎంతో కొంత తీసుకోవడం జనరల్ ట్రెండ్‌గా మారింది. ఇవ్వడం వారి బాధ్యత, తీసుకోవడం తమ హక్కు అనే తరహాలో మారిపోయింది. నామోషీ, భేషజాలు లాంటివేమీ లేకుండా నిస్సిగ్గుగా జరిగిపోతున్నాయి.

కష్టపడి సంపాదించిన డబ్బుతో ఓ ఇల్లు కట్టుకోవాలనుకున్న చిరుద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి.. ప్లానింగ్ పర్మిషన్ మొదలు వాటర్, కరెంటు, డ్రైనేజీ కనెక్షన్ వరకు లంచం ఇచ్చుకోవాల్సిందే. లేకుంటే జీవితకాలంలో అనుమతులు దొరకవు. ఐ-పాస్, బీ-పాస్ లాంటి 'విప్లవాత్మక' పథకాలు ఎన్ని ఉన్నా ఆమ్యామ్యాలిస్తే వర్కవుట్ అవుతుంది. లేకుంటే పనులు జరగవు. హైదరాబాద్ వరదల సమయంలో ప్రభుత్వం సాయం రూపంలో ఇచ్చే పదివేల రూపాయలకు సైతం లోకల్ లీడర్లదే పెత్తనం. ఏ పని కావాలన్నా జేబులు తడపాల్సిందే. పైరవీలు, లంచం తెలంగాణలో వ్యవస్థీకృతమయ్యాయి. తెలంగాణ రాకముందూ ఈ జబ్బు ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత తీవ్రమైంది.

అది సాయమా.. పాలనలోని లోపమా

ఒక ట్విట్టర్ మెసేజ్ పెడితే పనైపోతుంది అంటూ గులాబీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. అసలు ట్విట్టర్ ద్వారా సమాచారం ఇవ్వాల్సిన దుస్థితి ఎందుకొస్తున్నది? ప్రజా దర్బార్, గ్రీవెన్స్ సెల్ లాంటివి ఉంటే క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రత పాలకులకు అర్థమవుతుంది. కానీ తెలంగాణలో ఇలాంటి ప్రాక్టీసు లేదు. ప్రభుత్వ విభాగాలు సక్రమంగా పనిచేస్తే ఈ అవసరమెందుకొస్తుంది? ప్రజలు అడిగేవారు.. పాలకులు ఇచ్చేవారు.. అనేది తెలంగాణ ప్రత్యేకత కాబోలు! కరోనా టైమ్‌లో ఆక్సిజన్ మొదలు ఆపదలో చిక్కుకున్నవారిని కాపాడాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏదో దయతలిచి ఇస్తున్నట్లు భావిస్తున్నారు. కానీ ఒక బాధ్యత అని గుర్తించడం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలున్నాయనే వాస్తవాన్ని గ్రహించడం లేదు.

అక్షరజ్ఞానం లేని సామాన్యులు, ప్రజా ప్రతినిధులను కలిసే మార్గం లేని మారుమూల గ్రామీణులకు దారి ఏది? కలెక్టర్ ఆఫీసుల ముందు పురుగు మందు తాగి ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించాల్సి వస్తున్నది? ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని చనిపోవాలనే నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి" సమస్యలను చెప్పుకునే మార్గం ప్రజలకు లేదు.. వాటిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి పాలకులకు లేదు.. నిరసనల ద్వారా సర్కారు దృష్టికి తీసుకెళ్ళే స్వేచ్ఛ అసలే లేదు.. నియోజకవర్గాల అభివృద్ధికి ఇన్ని కోట్లు ఇస్తున్నాను అంటూ సీఎం గొప్పగా ప్రకటించుకుంటారు. కానీ ఇంతకాలం అభివృద్ధి జరగలేదనే వాస్తవం, ప్రభుత్వ అసమర్థత ఆ వరాలు, డబ్బుల మాటున దాగిపోతున్నది.

అధికారులకూ తప్పని తిప్పలు

స్థానికంగా ఏ అధికారి ఉండాలో ప్రజా ప్రతినిధులే నిర్ణయిస్తున్నారు. ఎస్సై మొదలు ఎస్పీ వరకు, తాసీల్దారు మొదలు కలెక్టర్ వరకు ఆ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినవారికే పోస్టింగులు. నచ్చిన చోట పనిచేయాలంటే వారికి సమర్పించుకోవడం, లొంగిపోవడం వీరికి కామన్ ప్రాక్టీసుగా మారింది. లక్షల రూపాయలు లంచం ఇచ్చి పోస్టింగులు పొందిన ప్రభుత్వ ఉద్యోగులు అన్ని జిల్లాల్లో కనిపిస్తారు. చివరకు వారి దయాదాక్షిణ్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తారు. అక్రమంగా సంపాదించుకోడానికి ఆ అధికారులకు పరోక్షంగా లైసెన్సు వచ్చినట్లే. తేడా వస్తే బదిలీ వేటు తప్పదు. ఒకరి జుట్టు మరొకరి చేతిలో ఉన్నంతకాలం ఇలాంటి రికమెండేషన్లు, లంచాల జాతర కంటిన్యూ అవుతుంది. ఇక కాళ్ళు మొక్కి సేఫ్ జోన్‌లో ఉన్న ఐఏఎస్‌ల సంగతి సరేసరి.

కష్టపడకుండా నాలుగు పైసలు సంపాదించుకోవడంతో పాటు సొంత పనులు చక్కదిద్దుకోడానికి పాలిటిక్స్ బెస్ట్ ప్లేస్‌గా మారింది. లగ్జరీ లైఫ్‌కూ ఇది ఓ సులభమైన దారి అయింది. పార్టీ కార్యకర్తల రూపంలో ఎమ్మెల్యేల చుట్టూ కనిపించే చోటా మోటా గల్లీ లీడర్లంతా పైరవీలతోనే నెట్టుకొస్తున్నారు. శ్రమ చేయకుండానే లక్షలాది రూపాయలు ఆర్జించే జీవితానికి అలవాటు పడ్డారు. సభల సమయంలో జనాన్ని సమీకరించడం, సొంత ఖర్చుతో కొన్ని పనులు చేసి పెట్టి నేతల దృష్టిలో పడుతున్నారు. స్థానిక ప్రజల నుంచి లంచాల రుచిమరిగి పర్సంటేజీ ముట్టజెప్పి ఖద్దరు నేతల ద్వారా పనులు చేసి పెడుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమై పొలిటికల్ లీడర్ల పైరవీలే పవర్‌పుల్‌గా మారాయి.

బంగారు తెలంగాణ నినాదంలోని వాస్తవం సంగతి ఎలా ఉన్నా పనులు కావాలంటే పైరవీలు, లంచం తప్పనిసరి అనేది అక్షర సత్యం. ఇది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిందీ కాదు.. తెలంగాణలో మాత్రమే జరుగుతున్నదీ కాదు. బలమైన పైరవీ ఉంటే, లంచం ఇస్తే నాలా నడిమధ్యలో ఇల్లు కట్టుకున్నా అడిగే అధికారులు ఉండరు. పర్మిషన్ లేకున్నా, నిబంధనలకు విరుద్ధంగా బంగళాలు కట్టుకున్నా వచ్చే ఇబ్బందేమీ లేదు. సర్కారు భూమిని ఆక్రమించుకున్నా రాత్రికి రాత్రే ప్రైవేటు ల్యాండ్‌గా మారిపోతుంది. మూడు పైరవీలు, ఆరు లంచాలతో తెలంగాణ వృద్ధి చెందుతున్నది. యథా రాజా తథా ప్రజా..

ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story

Most Viewed