రాహుల్‌ ఆదరణ ఓర్వలేకనే..!

by Disha edit |
రాహుల్‌ ఆదరణ ఓర్వలేకనే..!
X

రీబీ హఠావో అంటూ.. దేశంలో పేదరికం తగ్గించేందుకు నాడు భూములు పంచి, ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓ దశలో కాంగ్రెస్ అంటే బడుగు, బలహీన వర్గాలకు అండ అనే స్థితిలోకి వెళ్లింది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అయ్యేందుకు రాహుల్ గాంధీకి రెండుసార్లు అవకాశమొచ్చినా తిరస్కరించారు. కాంగ్రెస్‌లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పదవుల కోసం ఆరాటపడలేదు. నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీ వారిది ప్రజాపోరాటమే.. వారి గొంతు, పయనం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే.. అటువంటి నాయకునిపై బీజేపీ ప్రభుత్వం అనర్హత వేటు వేయడం నిజంగా సిగ్గుచేటు. దేశంలో జోడో యాత్రతో నవశకం ప్రారంభమైందనే కారణంతోనే బీజేపీ సర్కారు గాంధీ పార్లమెంట్ సభ్యునిగా రద్దు చేయడం.. 8 ఏళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించడం ప్రజాస్వామ్య దేశంలో మూర్ఖమైన చర్య.

దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లేందుకు...

ప్రస్తుత బీజేపీ తీరు చూస్తుంటే.. రోజు రోజుకు ప్రజాస్వామ్యంపై కక్షగట్టి.. విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతుంది. దేశంలో జోడో యాత్ర ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లోని పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు రావడంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు భావించవచ్చు. మోడీ పేరుపై ఓ విమర్శ చేస్తే ఇంత కక్ష గట్టిన బీజేపీ గతంలో అనేక సందర్భాలలో సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఇతర దేశాల వారితో పోలుస్తూ విమర్శించిన సందర్భాలెన్నో. పార్లమెంటు సభ్యుడని చూడకుండా అసభ్యకరంగా విమర్శించారు. అయినా ఆయన ఏనాడు నోరు మెదపలేదు. యూపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా హత్య చేసినట్లు ఒప్పుకున్నా అతడిపై చర్యలు తీసుకోని బీజేపీ, దొంగ అని సంబోధిస్తే పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని సస్పెండ్ చేయడం విడ్డూరం.

ఏ ధర్మంలో భాగమిది?

దేశం కోసం, ధర్మం కోసమంటూ మాట్లాడే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాలను పూర్తిగా కక్ష పూరితంగా మార్చివేశాయి. ఓ వైపు దేశంలో రోజు రోజుకు దళిత, ముస్లీం వర్గాలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ... నిరుద్యోగ భారతంగా, ఆకలి కేకల భారతంగా మారుస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా నిరుద్యోగులు బజ్జీల బండ్లు పెట్టుకోవాలని కేంద్రమంత్రి మాట్లాడారు. బిల్కిస్ బానో దోషులను జైలు నుంచి విడుదలైతే సత్కరించిన బీజేపీ దేశాన్ని ఎటువైపు తీసుకెళుతుందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇప్పటికే విపరీతమైన ధరలతో సామాన్యుడు బతకలేనంత స్థితికి ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతున్న బీజేపీ సర్కారుకి, పేదల కోసం పనిచేస్తున్న నాయకులంటే భయమే. అందుకే రాహుల్‌కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మూర్ఖపు చర్యకు పాల్పడింది. పేదల సంగతి మర్చిపోయి దేశ సంపదనంతా.. అదానీ, అంబానీలకు దోచిపెడుతూ లక్షలకోట్లలో రుణమాఫీ చేస్తున్న బీజేపీ సర్కారు. అధికారమే ధ్యేయంగా ప్రభుత్వాలను కూల్చి, సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది.

రాహుల్ గాంధీని అనర్హత పాలు చేయడమంటే గరీబోళ్ల కు అండగా ఉండే నాయకత్వం లేకుండా చేయడమే. దళిత, అణగారిన వాడల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గూర్చి ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షను సాకారం చేసిన పార్టీకి అండగా ఉంటూ.. భవిష్యత్తులో ఇటువంటి కక్ష రాజకీయాలకు తావు లేకుండా చేయడానికి మనం సమిష్టిగా గళమెత్తాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం

7893303516

Next Story