కాశ్మీర్ ఫైల్స్ X కమలం ఫైల్స్

by Disha edit |
కాశ్మీర్ ఫైల్స్ X కమలం ఫైల్స్
X

దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి బీజేపీ మతతత్వాన్ని పావుగా వాడుకుంటోంది. దీనికి చక్కని ఉదాహరణే ఈ మధ్య విడుదల అయిన 'కాశ్మీర్ ఫైల్స్' 'ఈ సినిమాలో కాశ్మీర్ పండిట్లపై జరిగిన దాడులను యదార్ధంగా చూపించారని, వారు అనుభవించిన బాధ అంత-ఇంత కాదని' ప్రధాని మొసలి కన్నీరు కార్చారు. అంతేకాక ఆ చిత్ర దర్శకుడిని, నిర్మాతను పిలిపించుకొని ఫొటోలకి పోజిచ్చారు. కాశ్మీర్ పండిట్లపై దాడులు జరగడం నిజమే కానీ, చాలా యేళ్ల తరువాత ఆ విషయంపై ఎవరో సినిమాను చిత్రీకరిస్తే దానిని కూడా వాడుకోవాలనుకోవడం ఎంత దారుణం?

దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో అర్ధం కాకుండా ఉంది. అఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ లాగా మన దేశంలో కూడా మతఛాందస వాతావరణం ఏర్పడేలా కనిపిస్తోంది. కొందరు నాయకులు మాట్లాడుతున్న మాటలు, వారి చర్యలు ఏ అనర్థాలకు దారి తీస్తాయో, అన్న భయాన్ని కలిగిస్తున్నాయి. పూర్తిగా ఒకే వర్గం, ఆ మతం మూలాలు, ఆదర్శాలు, లక్షణాలు ఉన్నవారిని ప్రోత్సహించడం సామాన్య మానవుడి సహనాన్ని పరీక్షించేలా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే మన దేశంలో ఇటువంటి చర్యలు తగునా? దేశ రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన 'లౌకిక' అనే పదానికి గల అర్థానికి విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నది.

అసలు సమస్యలు పక్కకు నెట్టి

రాజ్యాంగ సమాఖ్య విధానాలపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ధరలు ఆకాశాన్నంటాయి. ఆ ప్రభావం సామాన్యులపై పడుతోంది. ఇంత జరుగుతుంటే మన ప్రధాని మాత్రం 'కాశ్మీర్ ఫైల్స్' అనే చిత్రాన్ని ప్రశంసించడంలో లీనమైపోయారు. అందరూ ఈ సినిమా చూడాలంటూ ప్రత్యేకంగా ఆ మతానికి చెందిన వారిని సినిమా హాలుకి తరలించే పనిలో ప్రధాని వందిమాగధులు నిమగ్నమయ్యారు. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల వంటి అనేక సమస్యల మధ్య నలుగుతున్న దేశం ఆవేదనను ప్రధాని గాలికి వదిలేసి, ఇటువంటి ప్రయోజన రహిత చర్యలు చేయడం దారుణం.

దేశంలోని మేధావులు, ప్రతిపక్షాలు వివిధ సమస్యలపై మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ చిత్రాన్ని దేశ ప్రజలకు తెలిసేలా అతిగా ప్రశంసించడం, పొగడడంలో ఆంతర్యం ఏమిటో? ఏ సగటు పౌరుడిని అడిగినా చెబుతారు. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం వలన ప్రధాని కొంత ఆందోళనలో ఉన్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. పంజాబ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ రాష్ట్ర పర్యటనకు వెళుతూ ప్రధాని అకస్మాత్తుగా తన దారి మళ్లించుకున్నారు. విమానాశ్రయానికి చేరుకుని తన రహదారిని ఎవరో అడ్డగించారని, తనను చంపేందుకు కుట్ర చేశారని మీడియాలో నానా హడావుడి చేశారు. ఈ నాటకం ఎందుకో అర్ధం చేసుకున్న పంజాబ్ ప్రజలు ఆయనకు బాగానే బుద్ధి చెప్పారు.

గాయాలకు రాజకీయ చికిత్స

దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి బీజేపీ మతతత్వాన్ని పావుగా వాడుకుంటోంది. దీనికి చక్కని ఉదాహరణే ఈ మధ్య విడుదల అయిన 'కాశ్మీర్ ఫైల్స్' 'ఈ సినిమాలో కాశ్మీర్ పండిట్లపై జరిగిన దాడులను యదార్ధంగా చూపించారని, వారు అనుభవించిన బాధ అంత-ఇంత కాదని' ప్రధాని మొసలి కన్నీరు కార్చారు. అంతేకాక ఆ చిత్ర దర్శకుడిని, నిర్మాతను పిలిపించుకొని ఫొటోలకి పోజిచ్చారు. కాశ్మీర్ పండిట్లపై దాడులు జరగడం నిజమే కానీ, చాలా యేళ్ల తరువాత ఆ విషయంపై ఎవరో సినిమాను చిత్రీకరిస్తే దానిని కూడా వాడుకోవాలనుకోవడం ఎంత దారుణం?

ఇటీవలి కాలంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన చిత్రాలు విడుదల అయ్యాయి. తమిళనాడులోని ఓ ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ చంద్రుపై తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కిన 'జై భీం' ఎన్నో ప్రశంసలు అందుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించారు. ఈ చిత్రం ఆస్కార్‌కు కూడా నామినేట్ అయ్యింది. దురదృష్టవశాత్తు ఈ చిత్రం ప్రధాని స్థాయిని అందుకోలేకపోయింది. మహిళా సాధికారత, క్రీడలు, యువత నేపథ్యంగా ఈ మధ్య ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, అవేవి ప్రధాని దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఆ దర్శకులను పిలిపించుకొని ఫోటో దిగేందుకు బహుశా ప్రధానికి కూడా సమయం దొరకలేదు.

వాటికి అంత ఆదరణ లేదేం?

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 'కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడికి వై- క్యాటగిరీ భద్రత కల్పించడం. దేశంలో అవినీతిపై పోరాడుతూ, వివిధ అరాచక శక్తులకు బలవుతున్న నిజాయితీగల వ్యక్తులకు లేని వై- క్యాటగిరీ భద్రత ఒక మత ప్రేరేపిత చిత్ర దర్శకుడికి ఉండటం బహుశా బీజేపీ ప్రభుత్వంలోనే సాధ్యమేమో. 2002లో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో ఏంజరిగిందో అందరికి తెలుసు. స్వయానా నేటి ప్రధానే నాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆ ఘటనలపై 'గుజరాత్ ఫైల్స్' అని ఎవరైనా సినిమా తీస్తే దానిని కూడా ఇలాగే ప్రోత్సహిస్తారా? ఆ సినిమా దర్శకుడితో ఫోటో దిగుతారా? ఆ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలలో పన్ను మినహాయింపునిస్తారా? వారి మత ఆచారం ప్రకారం హిజాబ్ ధరించి పాఠశాలకు వెళితేనే తట్టుకోలేని ఈ మత ఛాందసవాదులు అటువంటి సినిమా తీస్తే బతకనిస్తారా! 'సూపర్-30' 'శకుంతలాదేవి" వంటి విద్యావేత్తల జీవిత చరిత్రలను చలనచిత్రంగా తీస్తే వాటికి లేని ప్రత్యేకమైన అభినందనలు 'కాశ్మీర్ ఫైల్స్'కు రావడం ఒకింత ఆశ్చర్యమే. ఒక దేశ ప్రధాని స్థాయిలో ఉంది ఇటువంటి ఉద్దేశపూర్వక ప్రశంసలు చేయడం దురదృష్టకరం. తమ తప్పులనుంచి ప్రజల సమస్యల నుంచి అందరి దృష్టి మళ్లించడానికి చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలను ప్రజలు గమనించాలి.

ప్రజలు మేలుకోవాలి

వ్యవసాయాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడని సాగు చట్టాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారుతో దూసుకెళ్లిన ఆశిష్ మిశ్రా అనే వ్యక్తి నేటి బీజేపీ ప్రభుత్వంలోని అజయ్ మిశ్రా అనే మంత్రి కుమారుడే అని అందరికీ తెలుసు. కానీ, దానిని ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మాయం చేసిన ఘనత ఇప్పటి మన కేంద్ర ప్రభుత్వానిదే. అదేవిధంగా అనేక అత్యాచార ఆరోపణలలో నిందలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులను వారు సులభంగా తప్పించగలిగారు. 'నీరు పల్లమెరుగు - నిజం దేవుడెరుగు' ఈ రోజు కాకపోతే రేపటికైనా చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూనే మేము ప్రజాస్వామ్య వాదులమని చెప్పుకొనే ఈ నాయకుల సంగతి, వారి నాయకుడైన మేకవన్నె పులి సంగతి ప్రజలే చూసుకోవాలి. 'ఇండియా ఫైల్స్' అనే విషాద చిత్రం రాకముందే మనం మేలుకోవాలి.

కంచర్ల సాయి‌భార్గవ్ చైతన్య

96762 28184



Next Story

Most Viewed