జనసేనానికి బీజేపీ బంధం

by Disha edit |
జనసేనానికి బీజేపీ బంధం
X

వివాహ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించామని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల ఒక ప్రకటన చేశారు. రెండు లేదా అంతకు మించి పెండ్లిళ్లు చేసుకున్నవారు ప్రజాప్రతినిధులుగా పోటీచేసేందుకు అనర్హులుగా ఆ చట్టంలో పొందుపరస్తున్నామన్నారు. ఇదే జరిగితే పవన్ రాజకీయ జీవితం సమాధి అయినట్టే. ఇది పవన్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ ఉపయోగించిన ట్రంప్ కార్డుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటన వెలువడగానే చంద్రబాబు పొత్తుల విషయం తర్వాత చూసుకుంటామని సర్దుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీని ఒప్పిస్తామని మొదటిసారి పవన్ ప్రస్తావించారు.

దేశ రాజకీయాలను బీజేపీ శాసిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వమే దీనికి ప్రధాన కారణం. దేశమంంతటినీ కాషాయమయం చేసే దిశగా వీరు అడుగులు వేస్తున్నారు. కమ్యూనిస్టు కంచు కోటలు వెస్ట్ బెంగాల్, కేరళలాంటి అనేక రాష్ట్రాలలో బీజేపీకి నిన్నటి వరకు అడుగు పెట్టేందుకు కూడా అవకాశలు లేవు. ఇపుడు ఈ రాష్ట్రాలలో బీజేపీ చాప క్రింద నీరులా ప్రవహించి అక్కడి అధికార పార్టీలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. ప్రస్తుతం వీరి చూపు దక్షిణాది రాష్ట్రాలపై పడింది. కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బలీయమైన స్థితికి చేరుకుంది.

2023లో జరగబోయే సాధారణ ఎన్నికలలో గెలుపు కొరకు టీఆర్‌ఎస్ పార్టీతో 'నువ్వా నేనా?' అనే రీతిలో పోటీ పడుతోంది. ద్రావిడ ప్రభావం అధికంగా ఉన్న తమిళనాడులో కూడా బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాగా వెయ్యాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నపుడు కూడా ఆంద్రప్రదేశ్‌లో ఆ పార్టీ అంతగా పుంజుకోలేదు. ఈ కారణంగానే బీజేపీ నాయకత్వం తమ జాతీయ అవసరాల కోసం గతంలో తెలుగుదేశం పార్టీతో, ప్రస్తుతం వైసీపీతో సఖ్యతగా ఉంది. 2019 ఎన్నికల తర్వాత పవన్‌ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలిపారు. అప్పటి నుంచి ఈ రెండు పార్టీలకు మిత్రపక్షాలుగా ముద్ర పడింది. కుల బలం, అభిమానుల బలం మెండుగా ఉన్న జనసేనానిని ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే తలంపుతో బీజేపీ దూకుడు పెంచింది. అందులో భాగంగానే పవన్‌ కళ్యాణ్‌కు బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు అపార గౌరవాన్ని ఇస్తున్నాయి.

ఆ వ్యాఖ్యల ఆంతర్యమేమిటి?

ఆంద్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక దశలో తమ కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ పేరును ప్రస్తావించారు. జాతీయ నాయకత్వం అభిప్రాయానికి భిన్నంగా సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారనడానికి ఆవకాశం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా చరమాంక దశలో ఉన్నారనేది నిర్వివాదాంశం. 2024 ఎన్నికలలో చంద్రబాబును అధికారంలోకి రానీయకుంటే టీడీపీ కనుమరుగు అవుతుందని, అపుడు జనసేనతో జత కలిసి ఎన్నికలలో విజయం సాధించి, పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ వ్యూహం పన్నుతున్నదని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను జనసేనాని ఇటీవల ఢిల్లీలో కలిశారు. ఆ సమయంలో అమిత్ షా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అంటున్నారు. ఓపికతో, ప్రణాళికాబద్ధంగా దీర్ఘకాలిక రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తామని పవన్‌కు అమిత్ షా హామీ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. అందుకు అనుగుణంగానే బీజేపీ రాష్ట్ర శాఖ వైసీపీ, టీడీపీని సమానంగా విమర్శిస్తూ వస్తున్నది. జనసేన విషయంలో ఎక్కడా మిత్రధర్మాన్ని విస్మరించిన దాఖలాలు లేవు. పవన్ మాత్రం బీజేపీని పట్టించుకోకుండా తన కార్యక్రమాలు చేసుకుంటూ పోతుండడం గమనార్హం.

అయినా, గుంభనంగానే

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో కేంద్రం నిర్ణయాన్ని పవన్ వ్యతిరేకించారు. ఇటీవల కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు జనసేనతో పొత్తును ప్రస్తావించగా పవన్ సానుకూలంగా స్పందించారు. ఈ పరిణామాలతో పవన్ అంతర్గత ఆలోచనను బీజేపీ కనిపెట్టింది. జనసేనాని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నిర్ధారణకు వచ్చింది. తమను ఉపయోగించుకుని చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకే జనసేనాని తమ పంచన చేరారని తెలుసుకుంది. తమను వ్యతిరేకించేవారిని సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించుకుని మోడీ, షా తమ దారిలోకి తెచ్చుకుంటున్న విషయం దేశం మొత్తానికి తెలుసు. జనసేనాని విషయంలోనూ అలాంటి అడుగులే వేసింది.

వివాహ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించామని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల ఒక ప్రకటన చేశారు. రెండు లేదా అంతకు మించి పెండ్లిళ్లు చేసుకున్నవారు ప్రజాప్రతినిధులుగా పోటీచేసేందుకు అనర్హులుగా ఆ చట్టంలో పొందుపరస్తున్నామన్నారు. ఇదే జరిగితే పవన్ రాజకీయ జీవితం సమాధి అయినట్టే. ఇది పవన్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ ఉపయోగించిన ట్రంప్ కార్డుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటన వెలువడగానే చంద్రబాబు పొత్తుల విషయం తర్వాత చూసుకుంటామని సర్దుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీని ఒప్పిస్తామని మొదటిసారి పవన్ ప్రస్తావించారు. అదే సమయంలో మెగా అభిమానులు హడావుడిగా విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకుని తామంతా పవన్‌ను సీఎం చేసేందుకు పని చేస్తామని ప్రకటించారు. కొందరు కాపులు కూడా మద్దతు ఇస్తామన్నారు. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే జనసేనాని ముందరి కాళ్లకు బీజేపీ వేసిన బంధం సత్పలితాలు ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది.

కైలసాని శివప్రసాద్

సీనియర్ పాత్రికేయులు

94402 03999


Next Story

Most Viewed