యోగాతో లాభమే బాగా!

by Disha edit |
యోగాతో లాభమే బాగా!
X

జూన్ 21 న ప్రపంచ యోగా దినోత్సవం అన్ని దేశాల్లో జరుపుకోవడం యోగా పుట్టిన భారత దేశానికి గర్వకారణం. ఈ యేడు భారత ప్రధాని మోడీ అమెరికా లో ఐక్యరాజ్యసమితి ఆవరణలో యోగా కార్యక్రమాలు నిర్వహించబోవడం మరింత హర్షణీయం. ఆరోగ్యానికి బాటలు వేసే సహజమార్గమైన యోగాని జన బాహుళ్యంలోకి ప్రాచుర్యంలోకి తీసుకురావడం, అవగాహన కలిగించి ఆచరణ మార్గం పట్టించడం దేహానికి, దేశానికి లాభదాయకమే. ఈ మధ్యనే ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం దేశంలో చక్కెర వ్యాధి, రక్తపోటు, స్థూలకాయం, జీవన శైలి వ్యాధులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. రానున్న ఐదేళ్లలో 13 కోట్ల మంది కొత్తగా చక్కెర వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే మధుమేహం వ్యాధికి భారత్ ప్రపంచ రాజధానిగా తయారైంది. కాబట్టి వెంటనే మేలుకుంటే ప్రమాద తీవ్రత తగ్గించొచ్చు. లేదంటే పదేళ్లలో దేశం ఆరు లక్షల కోట్ల రూపాయల నష్టం భరించాల్సి వస్తుంది. .వ్యక్తులకు, కుటుంబాలకు జరిగే నష్టం కూడా ఎక్కువే.

ఈ వ్యాధులకు ముఖ్య కారణం తప్పుడు జీవన శైలి. అనారోగ్యం కలిగించే ఆహారం, శరీరం కదిలించని వైఖరి, మానసిక ఒత్తిడి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండి సాంప్రదాయక ఆహారానికి పెద్దపీట వెయ్యాలి. శరీరాన్ని కదిలించాలి. అది ఉదయపు నడక కావొచ్చు, సాయంత్రపు నడక కావొచ్చు, శారీరక శ్రమ కలిగించే పనులు కావొచ్చు, యోగా లాంటి క్రమపద్ధతి ఉండే ఎక్సర్ సైజులు కావొచ్చు ..మొత్తానికి రోజంతా చురుగ్గా ఉండాలి. సూర్య నమస్కారాలు, వివిధ ఆసనాలు వేయడం వల్ల శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెరుగతుంది. ధ్యానం వల్ల ఏకాగ్రత పెరగడం, మానసిక వత్తిడి తగ్గడం కుదురుతుంది. ఏ ఖర్చు లేని ఈ విధానాల్ని రోజుకి అరగంట పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వం, పౌర సమాజం, మీడియా వీటిని ప్రోత్సహించాలి. స్కూల్ దశ నుండే మంచి జీవన శైలి అలవడితే దేహానికీ, దేశానికీ లాభం.

- డా. డి.వి.జి.శంకర రావు ,

94408 36931


Next Story

Most Viewed