కేసీఆర్ పాలనకు బీసీలే కాపలా!

by Disha edit |
కేసీఆర్ పాలనకు బీసీలే కాపలా!
X

లంకకు లంఖిని కాపలా ఉన్నట్లు కేసీఆర్ పాలనకు బీసీలే కాపలా ఉన్నారు. తమ తలరాతలను తామే రాయగల శక్తిని అవకాశాన్ని వదులుకుని తమనే అణిచి వేస్తున్న కేసీఆర్ పాలనకు ఓట్లు వేసి మరీ మద్దతు పలుకుతున్నారు. కుంభ కర్ణుడు రావణునికి మద్దతు ఇచ్చినట్లు బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు అగ్రకుల నాయకుల చెప్పుచేతుల్లో ఉన్న పార్టీలకు మద్దతు పలకడం సర్వ సాధారణం అయిపోయింది. పార్టీ ఏదైతేనేం అన్ని మోసకారివే. కళ్ళ ముందు సముద్రం ఉన్నా అది తాగడానికి గుక్కెడు నీళ్ళు ఇవ్వదు, అగ్రకుల పార్టీలు కూడా అంతే... అవి బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వవు. గెలవడానికి పైసలు అవసరం కాదు ఓట్లు అవసరం. బీసీలకు ఓటు చైతన్యం వస్తే రెడ్లకు వెలమలకు ఓటు వేయరు కదా... బీసీలు బీసీ అభ్యర్థులకు మాత్రమే ఓటు వేస్తారు.

కేంద్రంను బదనాం చేసేందుకు..

ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న అగ్రకులాలు ఎటు చూసినా కబ్జాలు చేస్తూ తరాలకు సరిపోను ఆస్తులు సంపాదించారు. తెలంగాణ బీసీలు జానెడు పొట్ట నింపుకోవడం కోసం నిత్యం కష్టపడటం అలవాటు చేసుకున్నారు. కుల వృత్తులు చేసి చేసి తాగుడుకు బానిసలైనారు. తాగుబోతుల సతుల చేతులు... మంది ఇండ్లలో అంట్లు తోమితోమి అరిగిపోతున్నవి. వీళ్లంతా బీసీలే. చట్ట సభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌లు కలిపించాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో బిల్లు పెట్టాలని కేసీఆర్, ప్రధాన మంత్రికి లేఖ రాశారు. నవ్విపోదురుగాక నాకేమీ సిగ్గు అన్నట్లుగా, నక్క మాంసాహారం తినను శాకాహారిగా మారిపోయాను అని చెబుతున్నట్లు ఉంది కేసీఆర్ వ్యవహారం. ఈయన బీసీలకు తెలంగాణలో 33 శాతం టికెట్స్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇవ్వొద్దని కేసీఆర్‌ని వారించింది ఎవ్వరు? అన్నీ దొంగ నాటకాలే. ఒక లేఖ రాసి కేంద్రం మీద బదనాం పెట్టొచ్చు. నేను 33 శాతం రిజర్వేషన్‌లు కలిపించాలి అని లేఖ రాసినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. నిజాయితీ ఉంటే బీసీలకు 33 శాతం ఎమ్మెల్యే టికెట్స్ ముందు ఆయన ఇవ్వాలి. కేంద్రం కూడా ఇవ్వాలని ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలి, కేసీఆర్ చచ్చుడో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ వచ్చుడో అని ఉద్యమం లేవదీయాలి. తెలంగాణ తెచ్చినోడు బీసీలకు 33 శాతం రిజర్వేషన్లను తేలేడా?

ఏ రిజర్వేషన్ ప్రకారం ఆ సీట్లు..

మొదటే చెప్పినట్టు లంకకు లంఖిని కాపలా ఉన్నట్లు బీసీలే కేసీఆర్ పాలనకు కాపలా ఉన్నారు. బీఆర్ఎస్ జండా మోయడం, మీటింగ్‌లకు పోవడం ప్రచారం చేయడం ఓట్లు వేయడం వంటివి చేస్తున్నారు. ఇంకా బీసీలకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి వచ్చేటట్టు బీసీలు, బీసీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేయడం నేర్చుకున్నప్పుడు బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, ఏ రిజర్వేషన్లు ఉన్నాయని రెడ్లకు 40 ఎమ్మెల్యే సీట్లు కేసీఆర్ కేటాయించిండు, ఏ రిజర్వేషన్ ప్రకారం వెలమలకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిండు. మొద్దు నిద్రలో ఉన్న బీసీలు మేల్కొవాలి, ఓటు తోటే రాజ్యాధికారం వస్తుందన్న నిజం తెలుసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీసీ ముఖ్య మంత్రి ఎలా అవుతాడు?

అదిగో ఆంధ్రలో కమ్మ, రెడ్లు అధికారం కోసం యుద్ధం చేస్తున్నారు, జగన్ రెడ్డిని ఆర్థిక నేరం కింద గతంలో 15 నెలలు జైలులో పెడితే నేను మాత్రమే కాదు చంద్రబాబు కూడా ఆర్థిక నేరస్థుడే అని తన అధికారాన్ని ఉపయోగించి జైలుకు పంపించినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కమ్మలంతా ఒక్కటై అన్ని వర్గాలను కూడగట్టుకుని తిరుగుబాటు చేస్తున్నారు. రెడ్లు ఏపీలో రెడ్డి రాజ్యం కోసం యుద్ధం చేస్తుంటే, కమ్మలు తమవంతుగా కమ్మ రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నారు, ఇట్లాంటి పోరాటం కదా తెలంగాణలో బీసీలు నేర్చుకోవాల్సింది చేయాల్సింది!

- నారగొని ప్రవీణ్ కుమార్

సామాజిక కార్యకర్త

98490 40195



Next Story