శతాబ్దాల స్వప్నం సాకారం..

by Disha edit |
శతాబ్దాల స్వప్నం సాకారం..
X

హైందవధర్మ వేదిక అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వసుదైక కుటుంబం అన్న సంకేతాన్ని సాకేతపురం సాక్షిగా భారతీయ సాంస్కృతిక పతాక రెపరెపలు ప్రపంచానికి చాటుతున్నాయి.

సరయూ నదీ తీరంలో సాకేతపురిగా పిలుస్తున్న సనాతన ఆధ్యాత్మిక నగరంలో శతాబ్దాల స్వప్నం సాకారమైంది. బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహా సంబురంలో, అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంది. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్య ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లింది. జగదానంద కారకకునికి శుభస్వాగతం అంటూ మంగళ నీరాజనాలు సమర్పించింది..

ఎంతో చరిత్ర గల నగరం

''కొందఱు పల్లకీల, మఱి కొందఱు తేరుల, నందలంబులం

గొందఱు, కొందఱశ్వములఁ, గొందఱు మత్త గజేంద్ర సంఘమున్‌

గొందఱు స్వర్ణ డోలికలఁ, గోరిక నెక్కి నృపాల నందనుల్‌

సందడిఁగాఁగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడఁగన్‌.''

అని కవయిత్రి మొల్ల వర్ణించిన తీరుకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆధునిక అయోధ్యలో ప్రైవేట్ విమానాలు, విమానయాన సంస్దల వాణిజ్య విమానాలలో ఆయోధ్య విమానాశ్రయం నుంచి ఎలక్ట్రిక్ బస్సులలో అతిధులు రామమందిర ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, వ్యాపార, సినీ, క్రీడా రాజకీయ ప్రముఖులు, దేశవ్యాప్తంగా వేలాది మంది స్వామిజీలు ఈ గొప్ప వేడుకకు హాజరైన నేపథ్యం నభూతో న భవిష్యతి అనిపించింది.

అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం. మహారాజైన ఆయుధ్‌ని పురాణాలలో శ్రీరాముని పూర్వీకుడుగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. 1528-2019 వరకు దాదాపు అయిదు శతాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం హిందువుల నమ్మకాన్ని వమ్ము చేయలేకపోయింది. న్యాయం గెలిచింది. హైందవ ధర్మం జయించ శక్యం కానిదని ప్రపంచానికి చాటింది. నాడు వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది అయోధ్య. జైన్ మతస్థులకు కూడా ప్రముఖ్యమైన నగరం అయోధ్య. బుద్ధమత వారసత్వం కలిగిన నగరం. గుప్తులకాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. క్రీ.పూ 600లలో కూడా అయోధ్య వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీ.పూ 5వ శతాబ్దం నుండి క్రీ.శ 5వ శతాబ్దం వరకు బౌద్ధమత కేంద్రంగా అయోధ్య విలసిల్లినది. బుద్ధుడు ఈ నగరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు భావిస్తున్నారు.

అభ్యాగతి స్వయం విష్ణుః

అయోధ్య దేవాలయ ప్రారంభం ఈ ప్రాంతానికి ఆర్థిక శ్రేయస్సులో కొత్త శకానికి నాంది పలికింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సినీ ప్రముఖులు ఇక్కడ స్దిరాస్దిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ స్టార్ హోటళ్ళు సైతం సంస్కృతి, సాంప్రదాయాలకు విలువనిస్తూ మధ్యరహితంగా పూర్తి శాఖాహారంతోనే అతిథులకు ఆతిధ్యం ఇవ్వడానికి నిర్ణయించి ఆ దిశగా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాయి. అయోధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటకానికి గొప్ప గమ్యస్థానం. మన సనాతన ధర్మంలో దేవాలయాల పాత్ర అత్యంత ప్రముఖమైనది. పూర్వం దేవాలయాలు కేవలం భగవంతుని పూజా స్థలాలు గానే కాక అనేక సామాజిక కార్యకలాపాలకు కూడా నెలవులుగా ఉండేవి. ఇప్పడు ఆయోధ్య కూడా ప్రపంచ యవనికపై ధార్మిక, సాంస్కృతిక చారిత్రక, పర్యాటక వెలుగులను ప్రతిబింబిస్తోంది. శ్రీరాముని జన్మస్థలం అయిన అయోధ్య, సంవత్సరం పొడవునా భక్తులను ఆకర్షిస్తుంది అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పర్యాటక రంగం దూసుకుపోతుంది.

సరికొత్త యుగానికి ప్రతీక

మోదీ పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 తేదీ సరికొత్త యుగానికి ప్రతీక అయోధ్యలో ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమయ్యింది. అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భారతీయులు బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారని, ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... "రాముడు త్యాగనిరతికి, ధర్మానికి ప్రతీకని, సమన్వయం చేసుకుని ముందుకెళ్లడమే మన ధర్మం వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. రాముడే భారత్‌కు ఆధారం... రాముడే భారత్ విధానం. నేడు జరిగింది విగ్రహ ప్రాణ ప్రతిష్ట మాత్రమే కాదు... భారతీయ విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ఠ" రామరాజ్యం అనే ఆదర్శ పాలన భావన నేడు అన్ని సమాజాల ఆకాంక్ష ప్రస్తుతం 'రామ్' అనే పదం యావత్ ప్రపంచానికి చెందినది వెయ్యేళ్ల లక్ష్యం'రామాలయ నిర్మాణం తోనే మన పని పూర్తి కాలేదు వచ్చే వెయ్యేళ్ల కోసం దేశానికి బలమైన పునాది నిర్మించాల్సి ఉంటుంది . ఘనమైన, దైవిక, సామర్థ్యం కలిగిన భారతదేశాన్ని నిర్మించుకునేందుకు అంతా ప్రతిజ్ఞ చేయాలి. ప్రస్తుతం దేశంలో పూర్తిగా సానుకూల శక్తి ఉంది. సంప్రదాయాలతో కూడిన ఆధునికతతో దేశం అభివృద్ధి సాధిస్తుంది. ఇది విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదు. దేశ విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ. ఇది కేవలం ఆలయమే కాదు భారత చైతన్యానికి ప్రతీక. రాముడే భారత్‌ ఆధారం, రాముడే భారత్‌ విధానం, రాముడే భారత్‌ ప్రతాపం, రాముడే భారత్‌ ప్రభావం, రాముడే విశ్వం, రాముడే విశ్వాత్మ. రాముడే నిత్యం, రాముడే నిరంతరం. ఇవాళ దేశంలో నిరాశావాదానికి చోటు లేదు. ఉన్న బలాన్ని కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలి. 'దేవ్‌ సే దేశ్‌- రామ్‌ సే రాష్ట్ర్‌' ఇదే మన కొత్త నినాదం. పరాక్రమవంతుడు రాముడిని నిత్యం పూజించాలి. రాముడు వేల ఏళ్లుగా మనకు ప్రేరణ కలిగిస్తున్నాడు. భవిష్యత్తులో మనం అనేక విజయాలు సాధించాలి. భారత సర్వోన్నత అభివృద్ధికి ఈ మందిరం చిహ్నం కావాలి".

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story

Most Viewed