తెలంగాణ ఆకాంక్షలు తీరాయా?

by Disha edit |
తెలంగాణ ఆకాంక్షలు తీరాయా?
X

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 60 సంవత్సరాలుగా సాగిన ప్రజా పోరాటాల అంతిమ విజయం. అనేక పురిటి నొప్పులను అనుభవించి, వేలాది బిడ్డలను కోల్పోయిన తెలంగాణ త్యాగాల తోవ ఫలితాలేవని ప్రశ్నిస్తున్నది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, వారి డిమాండ్లను ప్రతిబింబించే విధంగా రాజకీయ ప్రక్రియ ఉండాలనేది ప్రజాస్వామిక సూత్రం. అందుకు భిన్నంగా దశాబ్దాలుగా ప్రాంతీయ ఆధిపత్యం, వనరుల దోపిడీ, ఆత్మగౌరవం, సాంస్కృతిక వివక్ష, కొల్లగొట్టిన లక్షలాది ఉద్యోగాలు, భూముల పరాయీకరణ, నదీజలాలను చెరపట్టడం, ఈ ప్రాంతపు విద్యావ్యవస్థను కుప్ప కూల్చడం మొత్తంగా సీమాంధ్ర పాలకులు తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేయడంతో వీటన్నింటికీ పరిష్కార మార్గంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది.

ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి అసాధారణ త్యాగం, రక్తం, కన్నీళ్లను బలి పెట్టాల్సి వచ్చింది. మలిదశ ఉద్యమంలో పాట మీద తూటా పేలింది, నూనూగు మీసాల త్యాగాలు తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేశాయి. ఈ త్యాగాలు చెప్పిన తెలంగాణ పటం ఎలా ఉండాలో, దానికి ఎలా ప్రాణం పోయాలో భువనగిరి, వరంగల్, సూర్యాపేట డిక్లరేషన్లు ఇంకా కళ్లముందే కనబడుతున్నాయి. ఈ అసాధారణ త్యాగాలతోనే తెలంగాణను జూన్ రెండున సాధించుకున్నం. జూన్ రెండు తేదీ మాత్రమే కాదు, దశాబ్దాల ఉద్యమ ఆకాంక్షల ప్రతిబింబం.

ఎనిమిదేండ్లలో ఏం ఒరిగింది?

ఉద్యమంలో అనేక రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా పాల్గొన్నాయి. పార్టీలకు వివిధ రకాల సిద్ధాంత భావజాలాలు ఉన్నప్పటికీ ఒకే వేదికపై నుంచి పని చేయవలసిన అవసరాన్ని తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది. ఇన్ని పార్టీలు, ప్రజా సంఘాలు పోరాడినప్పటికీ, దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేందుకు 2014లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక చారిత్రక అవకాశం ఇచ్చారు ప్రజలు. 2018లోనూ ఇచ్చారు. ఈ రెండు అవకాశాలను టీఆర్‌ఎస్ అనతికాలంలోనే దుర్వినియోగం చేసుకుంది. తెలంగాణలో వనరులు, అవకాశాలు, ఆదాయ మార్గాలు, సౌకర్యాలు, ఎక్కడ లేనంతగా ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఉపాధి అవకాశాలు లేని పెట్టుబడుల విధానాన్ని తీసుకొచ్చి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అయ్యింది.

సీమాంధ్ర పాలనలో కార్పొరేట్ శక్తులకు ఇచ్చిన ప్రాధాన్యం కంటే రెట్టింపుగా తెలంగాణ ప్రభుత్వం వనరులను కార్పొరేట్ అననూయుల పాలుజేసింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములను అప్పనంగా అప్పజెప్పింది. తెలంగాణ భవిష్యత్ తరాలకు అందాల్సిన భూములను పెట్టుబడుల పేరుమీద అమ్మి వేసింది. ప్రాజెక్టులన్నింటినీ పక్కకుబెట్టి, ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టును కట్టి తెలంగాణ సంపాదనంతా దానికి ధారవోసి ఖజానాను ఖాళీ చేసింది. తెలంగాణ ఆర్థిక పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజలకు కనీస భాగస్వామ్యం దక్కలేదు. ఇక్కడి ఆర్థిక అవకాశాలను, సంపదనంతా మెఘా, మైహోమ్, హెటిరో మొదలగు దోపిడీ శక్తులకు చేరవేసింది. ప్రజలు చెమట చిందించి సంపాదించగా వచ్చిన ఆదాయాన్ని పన్నుల రూపంలో వసూలు చేసి, ఇష్టారీతిగా ఖర్చు చేసి 'ఈన గాచి నక్కల పాలు చేసినట్లుగా' తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. దీంతో తెలంగాణ అభివృద్ధి జరగకపోగా, లక్షల కోట్ల అప్పులపాలై మూలుగుతున్నది.

సామాజిక అంతరాలు

సామాజిక అంతరాలను విధ్వంసం చేసి దానిని ఒక నమూనాగా ఆచరించాల్సిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించలేకపోయింది. ఈ ఎనిమిదేండ్ల కాలంలో ఎన్నడూ జరగనంతగా కుల హత్యలు చోటుచేసుకోవడం గమనార్హం. గ్రామాలన్నీ గడీల చుట్టూ తిరుగుతూ కుల అహంకారాన్ని పెంచి పోషిస్తున్నాయి. ప్రభుత్వం తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, స్థిరపర్చుకోవడానికి మరింత బలంగా మత పునరుద్దరణ వాదాన్ని ముందుకు తెచ్చింది. ప్రజల పేదరికాన్ని నివారించడానికి ఉపయోగించాల్సిన సామాజిక వనరులను యజ్ఞాలు యాగాలు, దేవాలయాలు, వాస్తు పేరు మీద,విచ్చలవిడిగా ఖర్చు చేసింది.

పరిపక్వత లేని పాలన

తమదైన అస్తిత్వం, చైతన్యంతో కూడిన రాజకీయాలు కావాలని తెలంగాణ ఉద్యమం విశ్వసించింది. కానీ, స్వరాష్ట్రంలో మరింత విచ్చలవిడిగా అదే సీమాంధ్ర రాజకీయ సంస్కృతే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆచరించింది. ఉద్యమకారులకు పాలనలో అవకాశం కల్పించలేదు. విలువలతో కూడిన రాజకీయాలు, పాలనా విధానాలు రూపుదిద్దుకునే క్రమంలో ఉద్యమ ఆకాంక్షలకు చోటు దక్కకుండా చూసుకుంది. తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకించిన సీమాంధ్ర వలసవాద రాజకీయ నమూనాను యథాతధంగా పున:ప్రతిష్ఠించింది.నిర్బంధం మీద ఇక్కడ జరిగినన్ని ప్రతిఘటనలు ఎక్కడా జరగలేదు.

నిర్బంధాలను ఎదిరించడానికి, త్యాగాలు చేయడానికి సైతం ఇక్కడి యువత వెనుకాడలేదు. అత్యంత బలమైన సీమాంధ్ర నిర్బంధ పాలనను కూడా తన ఆత్మ గౌరవం కోసం ముక్తకంఠంతో ఎదిరించి నిలువరించింది తెలంగాణ సమాజం. ఈ అవగాహనను కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర పాలకులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి సీమాంధ్ర తరహాను మించిన పోలీసు వ్యవస్థను సృష్టించుకొని అసాధారణ స్థితిలో బలోపేతం చేసుకున్నారు. విచ్చలవిడిగా ప్రజల మీదికి ఉసిగొలుపుతున్నారు. ప్రతిపక్షాలను, ప్రజల గొంతుకగా ఉన్న పౌర సమాజాన్ని, ప్రగతి శీల శక్తులను నిలువరించడానికి, ప్రజా ఉద్యమకారులను బలి తీసుకునేందుకు దారులు వేసుకుంటున్నారు. పాట మీద, మాట మీద, కలం మీద ఇనుప పాదాలను మోపుతున్నారు.

పోరాటం మిగిలే ఉంది

ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవడానికి, మన వనరులను మనం రక్షించుకోవడానికి, తెలంగాణ యువతరాన్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, అంతిమంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, పాలకులను నిలువరించడానికి, వనరులను కొల్లగొడుతున్నవారిపైన పోరాటం చేయడానికి సంసిద్ధులు కావలసిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వాల మీద నిరంతరం ఒత్తిడి పెంచడం ద్వారానే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదని తేలిపోయింది. ఉద్యమ ఆకాంక్షలకు చోటు దక్కాలంటే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలి.

పందుల సైదులు

9441 661192

తెలంగాణ విద్యావంతుల వేదిక

Next Story