అసలు టీఎన్జీఓ సభలో ఏం జరిగింది..? నివేదిక కోరిన ఈసీ

by  |
Sagar
X

దిశ, తెలంగాణ బ్యూరో : సాగర్​ ఉప ఎన్నికల్లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ నాన్​ గెజిటెడ్​ అధికారుల సంఘం (టీఎన్జీఓ) బుధవారం నిర్వహించిన సమావేశం వివాదస్పదమైంది. సాగర్​లోని టూరిజం పరిధిలోని విజయ్​ విహార్​ హోటల్​లో టీఎన్జీఓ జిల్లా కమిటీ సమావేశంతో పాటుగా సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతా సమావేశాన్ని నిర్వహించారు. అయితే సాగర్​ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడంపై కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ వివరాలడిగింది. కాగా ఈ సమావేశం సందర్భంగా ఉద్యోగులు పటాకులు కాల్చడం, ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏం చేశారు..?

సాగర్​లోని విజయ్​ విహార్​ హోటల్​లో టీఎన్జీలో నిర్వహించిన సమావేశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని నల్గొండ కలెక్టర్, సాగర్​ఉప ఎన్నికల రిటర్నింగ్​అధికారికి ఈసీ గురువారం ఆదేశాలు జారీ చేసింది. టీఎన్జీఓల సమావేశం నుంచి ప్రసంగాల వరకు పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలోపై కాంగ్రెస్​ బుధవారమే కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్​ సజ్జన్​ సింగ్​చౌహాన్​కు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఈసీ నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

కాంగ్రెస్ ఫిర్యాదు ఏంటంటే..?

ఈ సందర్భంగా కాంగ్రెస్​ ఫిర్యాదులో పలు అంశాలను వివరించింది. కాంగ్రెస్​ నుంచి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ ఈ ఫిర్యాదు చేశారు. సాగర్​లోని ప్రభుత్వ అతిధి గృహంలో టీఎన్జీవో నాయకులంతా వచ్చి సమావేశం ఏర్పాటు చేశారని, పీఆర్సీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞత సభ నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఎన్జీవో నేతలు సీఎం సూచనలతోనే సాగర్​కు వచ్చారని, ప్రభుత్వ ఉద్యోగులను సమీకరించి, టీఆర్ఎస్​ మద్దతుగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్లాన్​ చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల్లోనే ఈసీ పూర్తిస్థాయి నివేదిక కోరింది.

మాది జిల్లా మీటింగ్​

ఇక సాగర్​ సమావేశాన్ని టీఎన్జీఓ జిల్లా కమిటీ సమావేశమని టీఎన్జీఓ పేర్కొంది. పీఆర్సీ ప్రకటన తర్వాత జిల్లా స్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామని, దీనిలో ప్రభుత్వానికి కృతజ్ఞతా తీర్మానంతో పాటుగా యూనియన్​, ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకుంటున్నామని తెలిపింది. ఇప్పటికే జనగామ, వరంగల్, మెదక్​తో పాటు పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించుకున్నామని టీఎన్జీఓ వెల్లడిస్తోంది. నల్గొండ సమావేశాన్ని ఈసారి సాగర్​లోని విజయ్​విహార్​లో నిర్వహించుకున్నామని, అంతకానీ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం కాదని టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​ స్పష్టం చేశారు. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా 30 శాతం పీఆర్సీ అమలుపై ఉద్యోగవర్గాలు ఆనందంగా ఉన్నారని, రాష్ట్ర కమిటీ వస్తే డ్యాన్సులు, ర్యాలీతో స్వాగతం పలికారని, టపాసులు కాల్చారన్నారు. అంతేకానీ సాగర్​ ఉప ఎన్నికలు, టీఎన్జీఓ జిల్లా కమిటీ సమావేశానికి సంబంధం లేదంటూ కొట్టిపారేశారు.



Next Story

Most Viewed