బిగ్ బ్రేకింగ్: హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈసీ డెడ్‌లైన్

by  |
EC, Huzurabad by-election
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూలు ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రధాన రాజకీయ పార్టీలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ లాంఛనంగా విడుదల కావొచ్చని ఆశలు పెట్టుకున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి వేటలో పడింది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం బాంబులాంటి వార్తను తీసుకొచ్చింది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన ఉప ఎన్నికలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి వాటివాటి అభిప్రాయాలను వెల్లడించాల్సిందిగా ఆగస్టు 30వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించింది.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే అక్కడి ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎలక్షన్ కమిషనర్లు సమావేశమై అన్ని కోణాల నుంచి విశ్లేషణ చేశారు. అధికారుల స్థాయిలో ప్రభుత్వ సన్నద్ధతపై ఆరా తీశారు. ఇప్పుడు పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చినందున అప్పటివరకూ షెడ్యూలు విడుదలయ్యే అవకాశం లేదని పార్టీలు భావిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇటీవల లేఖ రాసి అక్టోబరు వరకు పరిస్థితులు అనుకూలంగా ఉండవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

Next Story