TRS ఎమ్మెల్యేలపై ఈటల సంచలన కామెంట్స్.. మీరేం చేశారో నాకు తెలుసు..

by  |
etala-rajender 1
X

దిశ, కమాలాపూర్ : మాజీమంత్రి ఈటల రాజేందర్ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని బత్తినివానిపల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గ్రామంలో ని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నేత,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ జెండాను ఊపి ఈటల రాజేందర్ పాదయాత్రను ప్రారంభించారు. ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. బత్తినివానిపల్లి గ్రామం అంతా కూడా బీజేపీ జెండాలతో కాశయం గా మారిపోయింది.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక కాబోతోందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారని అన్నారు. తెలంగాణ సమాజం మొత్తం వారిని గమనిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను నియోజకవర్గంలోకి దింపి ప్రజలను భయబ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలపై ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారని, అయితే ఎవరు, ఎందుకు ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరికి ఓటు వేయాలన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే డిసైడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీ వెంట ఉండబోతున్నారని, ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల మద్దతు ఉన్న బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇదిలావుండగా పాదయాత్ర నేపథ్యంలో బత్తినివానిపల్లిలో అడుగడుగునా పోలీసుల నిఘా కొనసాగుతోంది. రాజకీయం వేడెక్కడంతో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.

Next Story

Most Viewed