హుజురాబాద్‌లో కురుక్షేత్ర యుద్ధమే.. ఈటల సంచలన వ్యాఖ్యలు

by  |
హుజురాబాద్‌లో కురుక్షేత్ర యుద్ధమే.. ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వీణవంక : మండలంలోని ఘన్ముఖ్ల గ్రామంలో గౌడ సంఘానికి చెందిన పలువురు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. ఈ క్రమంలో పార్టీ కండువా కప్పి ఈటల బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నా దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడు.

నా వల్లే దళితులు, గొల్ల కురుమలు, ఇతర కులాల వాళ్లు కేసీఆర్‌కు గుర్తుకు వస్తున్నారు. నేను చిన్నోన్నే కావచ్చు.. చిచ్చరపిడుగులాగా కొట్లాడుతా.. వాళ్లను వీళ్లను నా మీద పోటీ పెట్టుడు కాదు.. మీరే రావాలని హరీశ్ రావుకు, కేసీఆర్‌కు చెప్పాను. ప్రజల మీద నాకు నమ్మకముంది కాబట్టే.. కేసీఆర్ మీదనైనా గెలుస్తానన్న ధీమా నాది అని పేర్కొన్నారు. ఇప్పటికే 200 కోట్లు ఖర్చుపెట్టారు. డబ్బు, అధికారం విషయంలో నేను వాళ్లతో పోటీ పడకపోవచ్చు.

కానీ ప్రజాభిమానం నా మీద ఉంది. ఇప్పటికే చెప్పాను.. హుజురాబాద్‌లో జరిగేది కురుక్షేత్ర యుద్ధం. కౌరవులకు, పాండవులకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. ఈటల రాజేందర్ ఏం చేశాడని.. అతనిపై ఇంతలా మాట్లాడుతున్నారని ప్రజలే నిలదీస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్లు గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్లు, పంట పొలాలపై మిడతల దండు పడ్డట్లు ఊర్లలో తిరుగుతున్నారు. మీ కోసం గొంతెత్తి మాట్లాడే నా గొంతు నొక్కుతారా.. నిలుపుకుంటారా మీరే ఆలోచించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు పాల్గొన్నారు.


Next Story

Most Viewed