ఈస్ట్‌బెంగాల్‌కు వరుసగా మూడో ఓటమి

by  |
ఈస్ట్‌బెంగాల్‌కు వరుసగా మూడో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి గోవాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో ఈస్ట్‌బెంగాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ క్లబ్ 2-0 తేడాతో సునాయస విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని నార్త్‌ఈస్ట్ యునైటెడ్ మరోసారి దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ ఆసాంతం ఎస్‌సీ ఈస్ట్‌బెంగాల్ బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్నా.. గోల్స్ చేయడంలో మాత్రం విఫలమయ్యింది.

తొలి 30 నిమిషాల వరకు ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. అయితే 33వ నిమిషంలో నార్త్ఈస్ట్ యునైటెడ్‌కు గోల్ లభించింది. కాగా ఈ గోల్ ఈస్ట్‌బెంగాల్ ఆటగాడు సుర్‌చంద్ర సింగ్ చేయడం గమనార్హం. కేస్వి అప్పయ్య అందించిన పాస్‌ను ఇద్రిస్సా సైలా హెడర్‌తో గోల్ చేద్దామని అనుకున్నాడు. ఆ బంతిని డిఫెండ్ చేయాలని భావించిన సుర్‌చంద్ర తన గోల్ పోస్టులోకే బంతిని పంపి ‘ఓన్ గోల్’ చేసి ప్రత్యర్థి జట్టుకు ఆధిక్యత ఇచ్చాడు. ఇక రెండో అర్ద భాగంలో గోల్స్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి.

బంతి ఎక్కువగా ఈస్ట్ బెంగాల్ నియంత్రణలోనే ఉన్నా గోల్స్‌గా మలచలేక ఆపసోపాలు పడ్డారు. 90 నిమిషాల తర్వాత మ్యాచ్ రిఫరీ మరో ఐదు నిమిషాలు ఇంజ్యురీ టైం కలిపాడు. అప్పుడే తనకు లభించిన పాస్‌ను నార్త్‌ఈస్ట్ ఆటగాడు ఛార గోల్‌గా మలిచాడు. దీంతో చివరి నిమిషంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఆధిక్యం 2-0కు చేరింది. నిర్ణీత సమయం ముగిసేలోపు నార్త్‌ఈస్ట్ యునైటెడ్ క్లబ్ 2-0 తేడాతో విజయం సాధించింది. నార్త్ఈస్ట్ జట్టు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కాగా, ఈస్ట్ బెంగాల్ మాత్రం ఇంత వరకు బోణీ చేయకపోవడం గమనార్హం. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు సుహైర్ గెల్చుకోగా, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు బెంజమిన్ లాంబొట్‌కు దక్కింది.



Next Story

Most Viewed