ఎంట్రెన్స్ టెస్టుల నిర్వహణ తేదీల ఖరారు

by  |
ఎంట్రెన్స్ టెస్టుల నిర్వహణ తేదీల ఖరారు
X

దిశ, న్యూస్​బ్యూరో: కొవిడ్​ నేపథ్యంలో వాయిదా పడిన ఎంట్రన్స్​ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇటీవల నిర్వహించిన కేబినెట్​ సమావేశంలో ఎంట్రన్స్​ పరీక్షలకు సన్నద్ధంగా ఉన్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. విద్యాసంస్థల రీఓపెన్​, కరోనా ప్రభావం అంశాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వాహణ, అకాడమిక్​ ఇయర్​ ప్రారంభించే అంశాలపై సోమవారం విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో సెట్‌ల నిర్వహణపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ఎంట్రన్స్​ పరీక్షలతో పాటు స్కూళ్లు, కాలేజీల రీఓపెన్​పై కూడా సమావేశం నిర్ణయం తీసుకుంది.

ఆగస్టులో రీఓపెన్​.. డిజిటల్​ క్లాసుల నిర్వాహణ

కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల రీఓపెన్​పై ఉన్న సస్పెన్స్​కు తెరపడింది. సెప్టెంబర్​ 1 నుంచి అకాడమిక్​ ఇయర్​ను ప్రారంభించాలని కేంద్రం సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 17నుంచే ఇంటర్​ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రవేశాలను మాత్రం సెప్టెంబర్ 1 నుంచే చేపడుతారు. ​డిగ్రీ పరీక్షలను నిర్వహించాల్సిందేనని యూజీసీ స్పష్టం చేసింది. సెప్టెంబర్​ 30లోపు డిగ్రీ, పీజీ పరీక్షలను పూర్తిచేయాలని సూచించింది. మరో వైపు డిగ్రీ, పీజీ పరీక్షలపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈనెల 14న విచారణ అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షల నిర్వాహణపై నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇక తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు సంబంధించి దోస్త్​ సేవలను ఈనెల 20నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈనెల 20 నుంచి ప్రభుత్వ విద్యార్థులకు డిజిటల్​ పాఠాలు చెప్పనున్నారు. మొదటి దశలో 6-10 తరగతులకు సెప్టెంబర్​ 1నుంచి డిజిటల్​ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో క్లాసుల నిర్వహణకు దూరదర్శన్​, టీశాట్​ సేవలను వినియోగించుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది.

ఎంట్రన్స్​ పరీక్షలకు తేదీల ఖరారు

కొవిడ్​ నేపథ్యంలో జూలైలో నిర్వహించాల్సిన అన్నిరకాల ఎంట్రన్స్​ పరీక్షలు వాయిదా పడిన విషయం విధితమే.. ఎంసెట్‌తో పాటు పాలీసెట్‌, పీజీ ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఎప్పుడు నిర్వహిస్తారా అనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సెట్స్​ నిర్వాహణ కోసం తేదీలను ఖరారు చేశారు. ఈనెల 31ఈ సెట్​, సెప్టెంబర్​ 1న పాలీసెట్​ నిర్వహించాలని భావిస్తున్నారు. సెప్టెంబర్​ 8,9,10,11 తేదీల్లో ఎంసెట్​ పరీక్షలను నిర్వహించాలని తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన ఎంట్రన్స్​ పరీక్షల తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఎంట్రన్స్​ పరీక్షల నిర్వాహణపై కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఈ నెల 17న ఎంట్రన్స్​ పరీక్షలపై వాదనలు జరగనున్నాయి. కోర్టు ఆదేశాల అనంతరమే నిర్ణయించిన తేదీల్లో సెట్స్​ నిర్వాహణ చేస్తారా లేదా అనేది తేలనుంది.

సుప్రీం ఆదేశాల ప్రకారమే డిగ్రీ,. పీజీ పరీక్షలు

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే డిగ్రీ పరీక్షల నిర్వాహణపై నిర్ణయం ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడీయాతో మాట్లాడారు. డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో ఉందని, అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే డిగ్రీ, పీజీ పరీక్షలపై స్పష్టత వస్తుందన్నారు. ఈ నెల 14న సుప్రీంకోర్టులో ఈ అంశంపై వాయిదా ఉన్నట్టు ఆయన తెలిపారు.

Next Story