నా యాత్ర వారికి అంకితమిస్తా : వంశీకర్

by  |
Vamsikar
X

దిశ, వనపర్తి: శిరాజ్ వంశీకర్ సోలో ట్రేక్ యువతకు స్ఫూర్తిదాయకమని డీఎస్పీ కిరణ్ కుమార్ అన్నారు. జాదీ అమృత మహోత్సవాల్లో భాగంగా కాశ్మీర్ టూ కన్యాకుమారి (3800 కిలోమీటర్) కాలినడకన కార్యక్రమం చేస్తున్నారు. తాజాగా.. వనపర్తి జిల్లా కేంద్రానికి చేరుకున్న వంశీకర్‌కు ఘన స్వాగతం పలికారు. దీంతో వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల క్రీడల మైదానంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా డీఎస్పీ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని, దేశ భక్తిని నరనరాల్లో నింపుకొని దేశ రక్షణ, అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 3800 కిలోమీటర్లను కాలినడకన 75 రోజుల్లో పూర్తి చేయాలన్న ఆశయంతో మొదలుపెట్టారు. ప్రస్తుతం 53 రోజుల్లో 2450 కిలోమీటర్లు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతానికి చెందిన వంశీకర్ ఆశయాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మిగిలిన లక్ష్యాన్ని అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాకు చెందిన పర్వతారోహకులు రాజేందర్ జిల్లా సరిహద్దు వరకు వంశీకర్‌తో పాటు యాత్రలో నడిచారు.

స్వాతంత్ర్య సమర యోధులకు నా యాత్ర అంకితం : వంశీకర్

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా తాను చేస్తోన్న పాదయాత్ర, అనుకున్న సమయానికంటే ముందే విజయవంతంగా పూర్తిచేసి స్వాతంత్ర్య సమర యోధులకు అంకితం చేస్తానని వంశీకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కుతుబుద్దీన్, స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సుధీర్ రెడ్డి, సీనియర్ ఫుట్‌బాల్ ప్లేయర్ మురళి కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ కుమార్, నగేష్, కోట్లరవి పాల్గొన్నారు.

Next Story

Most Viewed