ఇయర్ ఎండ్ దందా.. డ్రగ్స్ మాయా

by  |
ఇయర్ ఎండ్ దందా.. డ్రగ్స్ మాయా
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ మాఫియా వదలడం లేదు. ఏదో ఒక రూపంలో సరఫరాదారులు తమపని తాము చేసుకుపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వాటిని తీసుకొచ్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రాము మత్తు మందు ధర వేలల్లో పలుకుతుండడంతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే చాన్స్ ఉందని ఈ బిజినెస్ ఊబిలోకి దిగుతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా డ్రగ్స్‌కు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న శుభకార్యాలలోనూ ఏదో ఒకరకమైన డ్రగ్స్‌ను తీసుకుని ఎంజాయ్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. ఇక ఇయర్ ఎండ్ వస్తుందంటే చాలు మహానగరాన్ని మత్తులో ముంచెత్తడానికి డ్రగ్స్ ముఠాలు రెడీ అయిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి.

పెరుగుతున్న డ్రగ్స్‌ కల్చర్‌

న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమైపోతోంది. ఎవరి ప్లాన్‌లు వారు చేసుకుంటున్నారు. ఎలా ఎంజాయ్ చేయాలి అన్నదానిపై ఎవరికి తోచిన విధంగా వారు ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే సందట్లో సడేమియాలా యూత్‌ను మత్తులో జోగేలా చేసేందుకు డ్రగ్స్ సరఫరాదారులు సైతం పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో నగరంలో ఏదో ఒకచోట తరచూ డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. వీరందరి టార్గెట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీదనే.. ఇయర్ ఎండ్ పార్టీల మీద ఫోకస్ చేసిన విక్రయదారులు గోవా, కశ్మీర్‌తో పాటు ఆయా రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను నగరానికి తెప్పించడంలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు నగర శివారుల్లోనూ లోకల్ మేడ్‌గా తయారు చేస్తూ ఈ ఇయర్ ఎండ్‌లో వీలైనంత ఎక్కువగా సప్లై చేసి కోట్లకు పడగెత్తాలని కొందరు అక్రమార్కులు ఈ బిజినెస్‌లోకి దిగుతున్నారు. ఇలాంటి వారికి పాత ఫార్మా కంపెనీలు అడ్డాగా మారాయి. అందులోని ల్యాబ్‌ల్లో పలు రకాల మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ముఠాలు యూత్ మీదకు వదులుతున్నాయి. వీటి మత్తులో పడ్డ యూత్, విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

అందరికీ అందుబాటులోకి..

గతంలో సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ మత్తు మందులు ఇప్పుడు సామాన్యుల చెంతకు కూడా చేరాయి. చివరికి స్కూలు విద్యార్థులకు సైతం మత్తుమందులు దొరుకుతున్నాయంటే ఈ డ్రగ్స్ ముఠాలు ఏస్థాయిలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. చిత్రసీమను, ఐటీ ఎంప్లాయిస్‌ను టార్గెట్‌గా చేసుకుని రంగంలోకి దిగిన డ్రగ్స్ ముఠాలు.. సామాన్యులను సైతం తమ ఉచ్చులోకి లాగుతున్నాయి. వారికి ఏదో ఓరూపంలో అందిస్తూ విద్యార్థి దశ నుంచి డ్రగ్స్‌కు దాసోహం అనేలా చేస్తున్నాయి. ఇదివరకు నైజీరియా, ఉగాండా లాంటి ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అయ్యే అత్యంత ఖరీదైన మత్తుపదార్థాలు ఇప్పుడు లోకల్‌‌గానే లభిస్తున్నాయి. గోవా, జమ్మూకశ్మీర్‌, పంజాబ్ నుంచి ఖరీదైన డ్రగ్స్‌ హైదరాబాద్‌కు వచ్చి చేరుతున్నాయి. వీటి సరఫరా కోసం పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులకు దొరక్కుండా కొత్త కొత్త పద్ధతుల్లో ఈ డ్రగ్స్ దందాను కంటిన్యూ చేస్తున్నారు.

అడ్డాగా హైదరాబాద్

ఇదివరకు చిన్నాచితకా గంజాయి కేసులు నమోదయ్యే హైదరాబాద్‌లో ఇప్పుడు గంజాయి కంటే డ్రగ్స్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే ఒకప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డాయి అంటే ఆఫ్రికన్ల అరెస్టులు ఉండేవి. ఇప్పుడు లోకల్ ముఠాలే డ్రగ్స్‌ తయారు చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్‌ వినియోగంలో గోవా, ఢిల్లీ నగరాల తర్వాత.. హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉందంటే అతిశయోక్తికాదు. ప్రతీ చిన్న పార్టీలో కూడా డ్రగ్స్‌ వాడకం కామన్‌గా మారింది. పబ్‌‌లు, బార్‌‌లు, రిసార్టులు, ఫామ్ హౌసుల్లో చాలాకాలంగా ఈదందా సాగుతుండగా ఈ మధ్య ఈ కల్చర్ అన్నిచోట్లకు పాకింది. బర్త్ డే వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలు ఏదో ఒకరకమైన డ్రగ్స్ లేకపోతే నామోషీగా ఫీలవుతున్నారు కొందరు. అదేదో స్టేటస్ సింబల్ అన్నట్లు పోజ్ కొడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే డ్రగ్స్ వాడకం అనేది ఇప్పుడు నయా ట్రెండ్‌ అంటున్నారు యూత్. ఆయా జిల్లాల్లో లభించే గంజాయితో పాటు కొకైన్‌, హెరాయిన్‌, చరాస్‌, ఎండీఎంఏ బ్లోట్స్‌, ఓపియం, ఎఫెడ్రోన్‌, ఎల్‌‌ఎస్‌ఏ స్ట్రిప్స్‌, ఎల్‌‌ఎస్‌డీ బ్లోట్స్‌ నగరానికి వస్తున్నట్లు సమాచారం.

డ్రగ్స్‌లో రకాలెన్నో..

మాదక ద్రవ్యాల్లో అనేక రకాలున్నాయి. వాటి క్వాలిటీ, ఇచ్చే కిక్కును బట్టి వాటి విలువ కూడా మారుతూ ఉంటుంది. ఇదివరకు నగరంలో కేవలం గంజాయి దొరకడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు దేశ విదేశాలకు చెందిన డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు అక్రమార్కులు. కొకైన్, ఓపియం, హెరాయిన్, ఎల్‌ఎస్‌డి, ఎండీఎంఏ, బ్రౌన్‌‌ షుగర్‌‌, చరస్, వంటి డ్రగ్స్‌కు హైదరాబాద్‌లో మంచి డిమాండ్​ఉన్నట్లు తెలుస్తోంది.

శాఖల మధ్య సమన్వయ లోపం

నగరంలో తరచూ ఏదో ఒకచోట డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. అయినా అధికారులు నియంత్రణలో సీరియస్‌గా వ్యవహరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నార్కోటిక్ సెల్, డ్రగ్ కంట్రోల్ బోర్డ్, డీఆర్‌‌ఐ, సీఐడీలోని యాంటీ నార్కోటిక్ సెల్, ఎక్సైజ్ శాఖలు ఉన్నా, సరైన నిఘా లేక సరఫరాదారులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇయర్ ఎండ్ టార్గెట్‌గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారిని అధికారులు ఎలా కట్టడి చేస్తారన్నది ఇప్పుడు శేషప్రశ్నగా మారింది.


Next Story

Most Viewed