గ్రేటర్‌లో డ్రగ్ మాఫీయా..స్థావరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by  |
గ్రేటర్‌లో డ్రగ్ మాఫీయా..స్థావరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో‌ డ్రగ్ మాఫీయా పాగా వేస్తుంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకున్న గ్యాంగ్‌లు భారీ మొత్తంలో మత్తు పదార్థాలను నగరానికి స్మగ్లింగ్ చేస్తున్నారు. అంతర్రాష్ట్రాల నుంచి గంజాయి కుప్పలు కుప్పలుగా రాజధానికొస్తుంది. పోలీసులు డేగ కన్ను వేసి తనిఖీలు చేసినా ఎక్కడో ఒక చోటు నుంచి గంజాయి సంచులు దిగుమతి అవుతూనే ఉన్నాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి.

దీనికి తోడు ఒక వర్గం వారిని, పబ్‌లను టార్గెట్ చేసుకున్న ముఠాలు డ్రగ్స్‌ను అలవాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. వీటికి నిదర్శనం.. తార్నాకలో బుధవారం పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. నిందితుల నుంచి నిషేధిత ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 236 గ్రాముల హాషీష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. ఇటువంటి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ పట్టుబడింది. గోవా, బెంగళూరు కేంద్రంగా ఈ డ్రగ్స్ హైదరాబాద్‌కు చేరుతున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పోలీసులు డ్రగ్ స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ..నగరానికి డ్రగ్స్ ఎలా వస్తున్నాయో అంతుచిక్కకుండా మారింది.

అందుబాటు ధరలో గంజాయి పొట్లలు:

కొకైన్, ఎల్ఎస్‌డీ బ్లాట్స్, హాషీష్ ఆయిల్ మత్తు పదార్థల ఖరీదు చాలా ఎక్కువ. అందుకే చాలా మంది వ్యసనపరులు అందుబాటు ధరలో లభించే గంజాయి పొట్లలను ఎక్కువగా తీసుకుంటున్నారు. సుమారు రూ. 100 నుంచి రూ.500లోపే ఈ పొట్లలు లభ్యం కావడంతో గంజాయి డిమాండ్ పెరిగింది. విద్యను మధ్యలోనే ఆపేసి కాలక్షేపం చేస్తున్న కుర్రాళ్లు, ఆకతాయి పనులు చేసే వాళ్లు మాత్రమే ఎక్కువగా గంజాయి వైపు మొగ్గుచూపుతున్నారు. నగరంలో ధూల్‌పేట కేంద్రంగా పెద్ద మొత్తంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. దందా సాఫీగా సాగేందుకు వాటికి బానిసలు అయిన వారినే ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. ఈ ఏజెంట్లతోనే ఇతరులకు కూడా సరఫరా చేస్తున్నారు. అపరిచితులకు గంజాయి విక్రయాలు నిషేధం. ఈ విషయంలో గంజాయి వ్యాపారులు జాగ్రత్త పడడంతో విషయం బయటకు రావట్లేదని తెలుస్తోంది.

స్థావరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే:

గంజాయి వ్యాపారులు వారు ఎంత జాగ్రత్తగా అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారో అంతే గోప్యంగా మత్తు బానిసలు సేవిస్తున్నారు. ఎందుకంటే సాధారణ సిగరేట్ కంటే గంజాయి వాసన చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో గంజాయిని కాలిస్తే వాసన 10 మీటర్ల దూరం వరకు వస్తుంది. దీంతో ఎవరైనా ఆ వాసన పసిగట్టవచ్చు. అందుకే గంజాయి సేవించడం కోసమే ప్రత్యేక స్థావరాలను ఎంచుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా నగరంలోని శశ్మాన వాటికలు, రైల్వే పట్టాలు, నగర శివారులు, నిర్మానుష ప్రదేశాల్లోనే సేవిస్తున్నారు. ఈ ప్రదేశాలనే స్థావరాలుగా మార్చుకుంటూ.. నిత్యం రాకపోకలు చేస్తున్నారు. దేశంలోనే అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా ఉన్న నగరంలో ఈ భాగోతం బయటకు రాకపోవడం గమనార్హం.


Next Story

Most Viewed