నిర్మల్‌ టౌన్‌ పై డ్రోన్..!

by  |
నిర్మల్‌ టౌన్‌ పై డ్రోన్..!
X

దిశ, ఆదిలాబాద్: కరోనా కట్టడి కోసం నిర్మల్ జిల్లా కేంద్రం‌పై డ్రోన్ కెమెరా పహారా కాయనుంది. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తున్న వారి ఆట కట్టించడం కోసం పోలీసులు డ్రోన్ కెమెరాను వినియోగించాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంతో పాటు కరోనా ప్రభావిత గ్రామాలపై డ్రోన్‌తో పహారా కాసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం ఈ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించినందున ప్రజలంతా ఇంటి నుండి బయటకు రావద్దన్నారు. జిల్లాలో 14 కంటెయిన్‌మెంట్ జోన్లు ఉన్నందున వాటి పరిధిలోని వాహనాల కదలికల పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలను వినియోగించడం జరుగుతుందన్నారు.

డ్రోన్ కెమెరాల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కిలోమీటరు వరకు మనుషుల, వాహనాల కదలికలను పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తుందన్నారు. ప్రతి దృశ్యం స్క్రీనింగ్‌పై కనబడుతుందని, అందరూ సామాజిక దూరం పాటించి తమ ఇళ్లలోనే ఉండాలన్నారు. ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో 19 కరోనా కేసులు నమోదు కాగా 14 కంటెయిన్‌మెంట్ జోన్లుగా గుర్తించడం జరిగిందన్నారు. వ్యక్తులు, వాహనాల కదలికలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తామని, ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంటువ్యాధుల నియంత్రణ చట్టం, 188 సెక్షన్ ప్రకారం ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందన్నారు.

Tags: Nirmal town, Drone Camera, Police, Coronavirus, Lockdown, Indrakaran Reddy, SP Shashidhar, Containment Zone



Next Story