ధరలు షాక్ కొట్టేలా ఉంటేనే తాగడం తగ్గిస్తారు: జగన్

by  |
ధరలు షాక్ కొట్టేలా ఉంటేనే తాగడం తగ్గిస్తారు: జగన్
X

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. అమ్మకాలు ఊపందుకున్నాయి. తొలి రోజు 60 కోట్ల వసూళ్లతో మద్యం విక్రయాలు దూసుకెళ్లాయి. తొలి రోజు 25 శాతం ధరలు పెంచి అమ్మగా విమర్శలు వచ్చాయి. ఈ రోజు 50 శాతం పెంచడంతో మొత్తం 75 శాతం మద్యం ధరలు పెరిగాయి. అయినప్పటికీ విక్రయాల జోరు తగ్గలేదు. మద్యం కేంద్రాల వద్ద కోలాహలం సన్నగిల్లలేదు.

మధ్యం ధరల పెంపుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి డబ్బులు దండుకుంటున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలపై జగన్ వివరణ ఇచ్చారు. ఏపీలో మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే భారీగా ధరలు పెంచామని స్పష్టం చేశారు. మద్య నియంత్రణ సాధించాలంటే మద్యం రేట్లు షాక్ కొట్టేలా ఉండాలని భావించామని ఆయన చెప్పారు. అందుకే ధరలు పెంచామని ఆయన అన్నారు.

సుదీర్ఘ విరామం తరువాత మద్యం విక్రయాలు ఆరంభించడంతో మందుబాబులు కొనుగోలు చేస్తున్నారని, మున్ముందు మద్యం అమ్మకాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో మద్యం దుకాణాలు 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. అలా చేస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాలు 33 శాతం తగ్గించినట్టవుతుందని ఆయన వెల్లడించారు.

మద్యం అక్రమ తయారీ, రవాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎస్పీలపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇసుక మాఫియా, అక్రమ మద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ఆ రెండు విభాగాలను తానే పర్యవేక్షిస్తున్నానని ఆయన వెల్లడించారు. వీటిపై కలెక్టర్లు, ఎస్పీలకు అధికారాలిస్తున్నామని ఆయన అన్నారు.

కరోనా కట్టడిపై ఆయన మాట్లాడుతూ, కరోనా నిర్ధారణ టెస్టులపరంగా ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చెప్పారు. ప్రతి పదిలక్షల జనాభాకు 2500కిపైగా కరోనా టెస్టులు చేస్తున్నామని ఇది ఒక రికార్డు అని ఆయన వ్యాఖ్యానించారు. సుమారుగా 35 రోజుల కింద ఏపీలో స్విమ్స్‌‌లో తప్ప మరో చోట కరోనా టెస్టింగ్‌ సౌకర్యం లేదని ఆయన గుర్తు చేశారు. అక్కడ టెస్టింగ్ సెంటర్ నిర్వహించినా ఫలితాలు మాత్రం రెండు రోజుల తరువాత వచ్చేవని అన్నారు.

ఇప్పుడు ఏపీలో 11 జిల్లాల్లో టెస్టింగ్‌ సౌకర్యాలు, ట్రూనాట్‌ కిట్లు అందుబాటులోఉన్నాయని ఆయన చెప్పారు. గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్ల రూపంలో ఏపీకి బలమైన నెట్‌వర్క్ ‌ఉందని ఆయన గుర్తు చేశారు. అందుకే కరోనాను ఇతర రాష్ట్రలతో పోలిస్తే భిన్నంగా ఎదుర్కొన్నామని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు అద్భుతమైన పని తీరుతో ఆకట్టుకున్నారన్నారు. అయినప్పటికీ కరోనా ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా ఉన్న వ్యక్తి దగ్గడమో, తుమ్మడమో చేస్తే అది పక్కవాళ్లకు వ్యాపిస్తుందని ఆయన తెలిపారు. అందుకే భవిష్యత్‌లో కరోనా కలిసి జీవించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే కరోనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్న పెద్దవారిపై ప్రభావం చూపిస్తుందని, మరణాల రేటు కేవలం 2 శాతం లోపే ఉందని ఆయన గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తుందని ఆయన చెప్పారు.

జూన్ 15వ తేదీ నాటికి గ్రామ సచివాలయాల్లో ఇళ్ల లబ్దిదారుల లిస్టు పెట్టాలని ఆయన సూచించారు. 15 రోజులు దానిని అక్కడే ఉంచాలని, ఇల్లు లేవని, తమ పేరు కనిపించడం లేదని ఎవరైనా వస్తే వారి అప్లికేషన్ తీసుకుని, విచారించి, అర్హులైతే వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని అన్నారు. జూలై 8 నాటికి ఇళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

Tags: ysrcp, ap, government, ap cm, ys jagan, high level meeting

Next Story