ఆ జిల్లా పల్లెల్లో తాగు నీటికి తిప్పలెన్నెన్నో!

by  |
ఆ జిల్లా పల్లెల్లో తాగు నీటికి తిప్పలెన్నెన్నో!
X

దిశ, నల్లగొండ: జిల్లాలోని పల్లెల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించినప్పటికీ అన్ని గ్రామాలకు తాగునీరు అందడం లేదు. ఈ పథకం కింద మొదలుపెట్టిన ట్యాంకుల నిర్మాణాలు అనేక గ్రామాల్లో ఇంకా పూర్తికాలేదు. ఫలితంగా తాగు నీటి కోసం పల్లెల్లో మహిళలు నానా తంటాలు పడుతున్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లంటూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. అహో..ఓహో..అంటూ పొద్దున లేచింది.. మొదలు పొద్దగూకె దాకా భగీరథపై ప్రజాప్రతినిధులు, లీడర్లు ఘంటాపథంగా ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ, క్షేత్రస్థాయికొచ్చేసరికి ఆ మాటలు నీటి మూటలుగా కాదు కదా. కనీసం వేసవిలో ఎండమావిలాగా కూడా కన్పించడం లేదు. రూ.వేల కోట్లు వెచ్చించినా ప్రజలకు మాత్రం అవే నీటి కష్టాలు. అవే బాధలు. అయితే, మిషన్ భగీరథ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు మాత్రం కాసుల పంట పండింది. జిల్లాలో తాగునీటి కష్టాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

నల్లగొండ జిల్లాలో 2015లో మిషన్ భగీరథ పనులు ప్రారంభమయ్యాయి. భగీరథ పనుల కోసం జిల్లాకు రూ.2,176 కోట్లు కేటాయించారు. అందులో రూ.590 కోట్లు పైప్‌లైన్ నిర్మాణ పనులకే వెచ్చించారు. నాగార్జునసాగర్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ఏకేబీఆర్(అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నుంచి, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు ఉదయ సముద్రం నుంచి, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సాగర్ టెయిల్ పాండ్ నుంచి నీరు అందించాలని నిర్ణయించారు. ఈ పనులను పూర్తి చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ వంద రోజుల ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుంది. ఆ గడువు కాస్త ముగిసి ఏడాది దాటింది. అయినా ఇంతవరకు పనులు అసంపూర్తిగానే మిగిపోయాయి.

అసంపూర్తిగా పనులు..

నల్లగొండ జిల్లా పరిధిలో 1,710 ఇండ్లకు 1,536 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో దాదాపు అన్ని ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యింది. కానీ, వాటికి కనెక్షన్లు ఇవ్వలేదు. జిల్లావ్యాప్తంగా 4,100 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్ లైన్ నిర్మించాల్సి ఉంది. ఇందులో దాదాపు పైప్ లైన్ నిర్మాణం అంతా చేశారు. కానీ, అవి ఎక్కడికక్కడ అతుకుల బొంతగానే మిగిలిపోయాయి. ఇకపోతే ఇంట్రా విలేజ్ పనుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. చాలా గ్రామాల్లో ఇంట్రా విలేజ్ పైప్ లైన్ నిలిచిపోయాయి. నల్లాలు సైతం బిగించడం వదిలేశారు. కొన్ని గ్రామాల్లో నల్లాలు బిగించినప్పటికీ ఇప్పటివరకు చుక్కనీరు వచ్చింది లేదు. పనుల పూర్తికి సంబంధించి అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదు.

నియోజకవర్గాల వారీగా ట్యాంకుల నిర్మాణం..

నియోజకవర్గం ట్యాంకులు
నల్లగొండ 135
నాగార్జునసాగర్ 273
మిర్యాలగూడ 305
మునుగోడు 169
దేవరకొండ 414
నకిరేకల్ 240

రంగంతండాలో నీటి తిప్పలు..

మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం అంతంపేట గ్రామపంచాయతీ పరిధిలోని రంగం తండాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో మూడ్రోజుల నుంచి ఆ తండాలో తాగు నీటి ఎద్దడి నెలకొంది. మిషన్ భగీరథలో భాగంగా ఇచ్చిన ఇంటింటికీ నల్ల కలెక్షన్ నామమాత్రంగానే మిగిలిపోయిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపులైన్లు మరమ్మతులు చేపట్టి మంచి నీటి ఎద్దడిని తీర్చాలని కోరారు.

Tags: drinking water, mission bhagiratha, scheme, not successful, people, facing problems, water tanks

Next Story

Most Viewed